ETV Bharat / state

Tremadol : ముంబయిలో పట్టుబడిన ట్రెమడాల్ డ్రగ్.. పల్నాడు జిల్లాలో తయారీ మూలాలు

author img

By

Published : Apr 28, 2023, 7:15 PM IST

Tremadol : పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని సేఫ్ ఫార్ములేషన్స్ ఫార్మా యజమాని శనగల శ్రీధర్ రెడ్డిని ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే 'ట్రెమడాల్' మాత్రల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తుండడమే అందుకు కారణం.

Etv Bharat
Etv Bharat

Tremadol : బెంగళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ అనే సంస్థ ముంబయి నుంచి దక్షిణ సూడాన్​కు కాల్షియం కార్బొనేట్ మాత్రల (టామోల్-ఎక్స్-225) పేరుతో ఎగుమతి చేస్తున్న వారీ కన్​సైన్​మెంట్​ ఫిబ్రవరి 28న కస్టమ్స్ అధికారులు అనుమానంతో పరిశీలించగా వాటిలో ఉన్నవి ట్రెమడాల్ మాత్రలని తేలింది. సుమారు 10 లక్షల మాత్రల్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి తయారైంది సేఫ్ ఫార్ములేషన్స్ అని తేలడంతో, ఆ వ్యవహారంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా.. బెంగళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సంస్థ కాల్షియం కార్బొనేట్ మాత్రల పేరిట ట్రెమడాల్ మాత్ర లను దక్షిణ సూడాన్ కు ఎగుమతి చేస్తుండగా ముంబయి కస్టమ్స్ అధికారులు పట్టుకుని.. మార్చి నెలలో కేసు నమోదు చేశారు. ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బెంగళూరు వాసి గుడిపాటి సుబ్రహ్మణ్యాన్ని మార్చి 12న అరెస్టు చేశారు. ఆయన్ను విచారించగా.. నరసరావు పేటలోని సేఫ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాటిని తయారు చేసి, తమకు సరఫరా చేసిందని చెప్పారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్ శనగల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. అంతకు ముందు బెంగళూరు కేంద్రంగా ఐరిస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కూడా సేఫ్ ఫార్ములేషన్స్ పెద్ద ఎత్తున ట్రెమడాల్ మాత్రలు సరఫరా చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

మాత్ర కాదు.. మాదక ద్రవ్యమే.. నొప్పి నివారణ మాత్రలైన ట్రెమడాల్ తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు, నియంత్రణలు విధించింది. ఎన్ సీఎస్ చట్టం. పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రాపిక్ సబి స్టాన్స్ (మాదక ద్రవ్యం)గా గుర్తిస్తూ 2018 ఏప్రిల్ 28న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రెమడాల్ మాత్రల్ని దేశంలో వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించిన పరిమాణంలో, కాంబినేషన్స్ మాత్రమే తయారు చేయాలి. వేరే కాంబినేషన్లో తయారుచేసి, విదేశాలకు ఎగుమతి చేయాలంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అనుమతి పొందాలి. ట్రెమడాల్ మాదకద్రవ్యంగా విపరీతంగా వినియోగిస్తుండటంతో ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టింది. అలసట రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పని చేయడానికి ఐసిస్ బోకోహరామ్ వంటి సంస్థల ఉగ్రవాదులు ఆ మాత్రలు వాడుతుంటాయి. ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సంస్థ దక్షిణ సూడాన్ కు ట్రెమడాల్ మాత్రల ఎగుమతికి ఎన్ సీబీ అనుమతి తీసుకోలేదు సరి కదా.. కాల్షియం కార్బొనేట్ మాత్రల ముసుగులో వాటిని ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఆ సంస్థ గతంలోనూ అనుమతులు లేకుండా ట్రెమడాల్ మాత్రలు ఎగుమతి చేసినట్టుగా కస్టమ్స్ విభాగం గుర్తించింది.

ఎన్నో అనుమానాలు... అనుమతులు ఎలా ఇచ్చారు? ట్రెమడాల్ మాత్రలు పట్టుబడటం, శ్రీధర్ రెడ్డి ఆరెస్ట్ వంటి పరిణామాలపై సేఫ్ ఫార్ములేషన్స్ కంపెనీకి చెందిన స్థానిక ప్రతినిధిని ఈనాడు సంప్రదించింది. తాము రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతి తీసుకునే ట్రెమడాల్ మాత్రలు తయారు చేశామని, ట్రెమడాల్ పేరుతోనే ప్యాకింగ్ కూడా చేశామని, తేడా ఎక్కడ జరిగిందో తమకు తెలియదని బదులిచ్చారు. ఏదైనా సంస్థ తనకు ఎగుమతి ఆర్డర్ వచ్చిందని, ట్రెమడాల్ మాత్రల్ని తయారు చేసివ్వమని మీ కంపెనీని కోరితే... ఎగుమతి ఆర్డర్ చూపించమని అడగరా? రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎగుమతి ఆర్డర్ను కూడా జతచేయరా? అన్న ప్రశ్నలకు ఎగుమతి ఆర్డర్ ఉందో లేదో తాము చూడమని, వర్క్ ఆర్డర్ బట్టి మాత్రలు సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థకు చేసే దరఖాస్తులో కూడా వర్క్స్ ఆర్డర్నే పొందుపరుస్తామన్నారు. మాదకద్రవ్యంగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు, ఎగుమతి చేయాలంటే అనేక షరతులు పెట్టినప్పుడు.. బాధ్యతగల రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ ఉదాసీనంగా ఎలా అనుమతులిచ్చేస్తుంది. ట్రెమడాల్ తయారీకి అనుమతి కోసం ఏదైనా కంపెనీ దరఖాస్తు చేసుకుంటే ఎగుమతి ఆర్డర్ ఉందో లేదో చూడరా? ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ కి ట్రెమడాల్ మాత్రల సరఫరాకు సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థకు అనుమతిచ్చినట్లు ముంబయి కస్టమ్స్ విభాగం అదనపు కమిషనర్​కు రాసిన లేఖలో.. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎస్. రవిశంకర్ నారాయణ్ ధ్రువీకరించారు. ఫస్ట్ వెల్త్ సొల్యూషన్​కు నిజంగానే ఎగుమతి ఆర్డర్ ఉంటే, ఎన్ సీబీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదు? కాల్షియం మాత్రల పేరుతో ట్రెమడాల్ ఎందుకు ఎగుమతి చేస్తోంది? ఆ సంస్థకు ఎన్​సీబీ అనుమతి ఉందో లేదో రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఎందుకు చూడలేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక భారీ గూడుపుఠాణీ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా సమయంలో భారీగా ఆర్డర్లు... సేఫ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తునే మందులు, సర్జికల్ పరికరాలను సరఫరా చేస్తోంది. కొవిడ్ ఉద్ధృతంగా ఉన్నప్పుడు కరోనా రోగులకు వాడేందుకు వినియోగించే వివిధ మందుల్ని, సామగ్రిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఆర్డరు పొందినట్టు సమాచారం.

కంపెనీ చేతులు మారింది ఇలా..! సత్తెనపల్లి-నరసరావుపేట మార్గంలో ముప్పాళ్లకు సమీపంలోని గోళ్లపాడు వద్ద కోడెల శివప్రసాదరావు 1985లోనే సెలైన్ సీసాలతయారీ కంపెనీని ప్రారంభించారు. తర్వాత దాన్ని సేఫ్ పేరెంటల్స్ కంపెనీగా మార్చారు. అనంతరం అదే ప్రాంగణంలో సేఫ్ ఫార్ములేషన్స్ కంపెనీని నెలకొల్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేవరకు ఆ రెండు కంపెనీలు కోడెల కుటుంబ నిర్వహణలోనే ఉండగా... ఆ కుటుంబంపై రకరకాలుగా ఒత్తిడి తెచ్చి ఈ కంపెనీలను స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. సేఫ్ పార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2020 మే 13న శనగల శ్రీధర్ రెడ్డి డైరెక్టర్​గా, 2022 ఫిబ్రవరి 14న బాలినేని అరుణ, బాలినేని గోవిందరెడ్డి అదనపు డైరెక్ట ర్లుగా చేరారు. వీరిలో శ్రీధర్రెడ్డి ఆథరైజ్డ్ సిగ్నేటరీగా వ్యవహరిస్తున్నారు. సేఫ్ పేరెంటల్స్ (సేఫ్ ఫార్మా) లోనూ శ్రీధర్​రెడి, గాదె కనిగిరి డైరెక్టర్లుగా ఉన్నారు.

ఈనాడులో ప్రచురితమైన నరసరావుపేటలో ఐసిస్ డ్రగ్స్ తయారీ కథనాన్ని చూసిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవిందబాబు వెంటనే సేఫ్ ఫార్మా కంపెనీకి వెళ్లి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సేఫ్ ఫార్మా కంపెనీలో డ్రగ్స్ తయారీకి పాల్పడ్డ నిందితులు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అనుచరులని ఆరోపించారు. సేఫ్ ఫార్మా సంస్థ ఆగడాలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు చేయించాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.