ETV Bharat / state

దేశంలోనే ఇంతటి ఫెయిల్యూర్​ సీఎం లేడు : టీడీపీ నేత యనమల

author img

By

Published : Apr 7, 2023, 4:33 PM IST

Updated : Apr 7, 2023, 5:09 PM IST

Etv Bharat
Etv Bharat

TDP LEADERS : లింగంగుంట్లలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రసంగంపై టీడీపీ నేతలు స్పందించారు. సీఎంకు రాక్షస రాజ్యం ఇష్టమని, మరోసారి ప్రజల్ని వంచించటానికంటూ, స్వప్రయోజనాలను రాష్ట్ర ప్రయోజనాలను దిల్లీలో తాకట్టు పెట్టాడానికే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Yanamala Ramakrishnudu : రామరాజ్యం కంటే రాక్షస రాజ్యంపైనే జగన్​కు మోజు ఎక్కువ అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్​ ​ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అందుకే ఒంటిమిట్ట కళ్యాణానికి వెళ్లకుండా ఎగ్గొట్టారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల అన్నారు. జనం నమ్మట్లేదనే జగన్ మారీచ జిత్తులు మళ్లీ ప్రారంభించారని దుయ్యబట్టారు. దేశంలోనే ఇంత ఫెయిల్యూర్ సీఎం ఎక్కడా లేడన్న యనమల.. సొంత పార్టీలోనే అంతర్గత తిరుగుబాట్లతో దిక్కుతోచని స్థితి వైసీపీలో నెలకొందని మండిపడ్డారు. ‘జాబ్ కేలండర్​కు పట్టిన గతే జగన్ వెల్ఫేర్ కేలండర్​కు కూడా పడుతుందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంపై బాధిత వర్గాలన్నీ తిరగబడుతున్నాయని అన్నారు. 4ఏళ్ల అరాచక, అప్రజాస్వామిక, నిరంకుశ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలను చూసే.. సొంతపార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో సడలిన నమ్మకాన్ని పెంచేందుకే నానాపాట్లు పడుతున్నారని విమర్శించారు. ఏపీ పంజాబ్​లా మారిందని సాక్షాత్తూ ప్రధాని మోదీనే అన్నారని గుర్తు చేశారు. ఐటీ రంగంలో ఏపీ వాటా కేవలం 0.2% మాత్రమేనని జాతీయ నివేదికలే వెల్లడించాయని.. ఉపాధి కల్పనకే కీలకమైన ఐటీలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. ఎక్సైజ్ రాబడి ప్రభుత్వాదాయం కిందకు రాదనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

మరోసారి జనాన్ని వంచించడానికి : కల్లబొల్లి కబుర్లు, పచ్చి అబద్ధాలతో మరోసారి జనాన్ని వంచించడానికి జగన్ సిద్ధమయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ధ్వజమెత్తారు. సొంత తల్లిని, చెల్లిని రోడ్ల పాలు చేసిన ముఖ్యమంత్రి జగన్​ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని రక్షిస్తాడంటే ఎలా నమ్మాలని నిలదీశారు. సొంత పిన్ని పుస్తెలు తెంపి, బాబాయ్​ని చంపిన వారితో తాడేపల్లిలో విందులు, వినోదాల్లో పాల్గొంటున్న జగన్.. ప్రజల్ని రక్షిస్తాడా అని ప్రశ్నించారు. మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న నావ వైసీపీ అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే అందులోంచి ఎమ్మెల్యేలు దూకేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు దిల్లీలో తాకట్టు : దేశంలోనే అబద్ధాన్ని నిజం చేసి అవాస్తవాలను నమ్మించే జగన్ రెడ్డి ఎత్తులు కుయుక్తులు ప్రజలందరికీ తెలుసని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్కాములు చేసి కేసుల్లో ఇరుక్కుని బయటపడడానికి రాష్ట్ర ప్రయోజనాలను దిల్లీలో ఏ విధంగా తాకట్టు పెట్టారో అది ప్రజలకు తెలుసని విమర్శించారు. స్కాములకు పెట్టింది పేరు జగన్ రెడ్డి అని.. స్కాములకు పుట్టినిల్లు వైసీపీ అంటూ ఎద్దేవా చేశారు.

అబద్ధాన్ని వాస్తవంగా చిత్రీకరించే పరిస్థితులు : అంగబలం లేదని సీఎం అంటారని.. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. సాక్షి పత్రిక, ఛానల్​ను తనతో పెట్టుకుని.. ఏమీ లేవని అమాయకంగా ప్రజల చెవిలో పూలు పెడితే ఎవరు నమ్మరన్నారు. జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి.. అబద్ధాన్ని వాస్తవంగా చిత్రీకరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. కేంద్రంలో, పక్క రాష్ట్రాలలో ఎలా మేనేజ్ చేయాలో, తెలుగుదేశం పార్టీలో అల్లర్లు క్రియేట్ చేయడం కుట్రలు కుయుక్తులకు జగన్ రెడ్డి పెట్టింది పేరని ప్రజలకు తెలుసన్నారు. లింగంగుంట్ల సీఎం ప్రచారం చూస్తుంటే ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం : ఇంటింటికి డాక్టర్ పథకాన్ని ఎవరం కాదనమని.. ప్రస్తుతం ఆసుపత్రులలో సరైన మందులు, వైద్యం లేవని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ఆసుపత్రులలో చెల్లింపులు చేయకపోవడం.. రోగులకు కుంటి సాకులు చెబుతూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. వైద్యానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోకపోవడం.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. వైద్యానికి కేటాయించిన నిధుల్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్య పోస్టుల భర్తీలో జరిగిన అవినీతిపై మంత్రి రజిని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. యడవల్లిలోని వేస్ట్ ఓవర్ డంపు ద్వారా 75 వేల లారీల మట్టి తరలించి సుమారు 150 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఎవరో కూడా తెలుసన్నారు. చిలకలూరిపేటలో మంత్రి చేసిన అక్రమాలపై తాను ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రత్తిపాటి సవాల్ విసిరారు. నాలుగు కోట్ల జనాల హృదయాల్లో ఎవరున్నారు ముందస్తు ఎన్నికలకు వస్తే తెలుస్తుందన్నారు. ప్రజల అమాయకులు కాదని రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.

"ఐ ప్యాక్​ నివేదిక ప్రకారం వైసీపీపై ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉంది. వైసీపీకి 175 మంది ఎమ్మెల్యేకు పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా? వారి పేర్లు మీరు ప్రకటించగలరా? అసలు మీ దగ్గర ఉన్నాయా అని వైసీపీని సూటిగా ప్రశ్నిస్తున్నాను." - బొండా ఉమా, టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు

బొండా ఉమా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

ఇవీ చదవండి :

Last Updated :Apr 7, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.