KOTI RUDRAKSHA POGRAM : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ముత్యాలంపాడులోని షిర్డి సాయిబాబా మందిరంలో ఈ నెల 28న కోటి రుద్రాక్షల అభిషేక, అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షుడు, ఎపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. ఎక్కడా లేని విధంగా కోటి రుద్రాక్షలతో అభిషేకం, ఆర్చనను ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్ నుంచి కోటి రుద్రాక్షలు సేకరించి భక్తులతో సాయిబాబాకు అర్పించనున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. 28 న తెల్లవారుజామున 3 గంటలకు కోటి రుద్రాక్షల అభిషేకం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి శ్రీ స్వరూపానంద స్వామి, శ్రీ స్మాత్మానంద్రేద్ర స్వామీజీలు , పలువురు మంత్రులు, నేతలు, హాజరవుతారన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేసే కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి భక్తిపాటను ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆవిష్కరించారు.
"దేశంలో ఎక్కడా జరగని విధంగా రుద్రాక్షలతో పూజలు చేస్తున్నాం. కోటి 20లక్షల రుద్రాక్షలను నేపాల్ నుంచి తీసుకొచ్చాము. వీటిని ఈ నెల 28న సాయిబాబాకు అభిషేకం చేస్తాం. భక్తులు స్వయంగా వచ్చి రుద్రాక్షలకో అభిషేకం చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీ స్వరూపానంద స్వామి, శ్రీ స్మాత్మానందేద్ర స్వామీజీల చేతుల మీదుగా ప్రారంభిస్తాం" -గౌతమ్రెడ్డి, ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిర గౌరవాధ్యక్షుడు
కోటి రుద్రాక్షలతో అభిషేకం చేయడం ప్రపంచంలో తొలిసారి అని గజల్ శ్రీనివాస్ అన్నారు. ముత్యాలంపాడులోని సాయిబాబాకు కోటి రుద్రాక్షలతో అభిషేకం చేయడం అద్భుతమన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్రెడ్డి ఆధ్వర్యంలో నేపాల్ నుంచి తెప్పించిన రుద్రాక్షలను మాలలుగా కట్టి అభిషేకానికి సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. షిర్డీ సాయినాథునికి రుద్రాక్షలతో అభిషేకం చేయడం వల్ల భక్తి, ముక్తి, సంపద లభిస్తాయని.. ఇది ధర్మంలో భాగమని ఆయన తెలిపారు.
ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం గురించి తెలియగానే తనవంతుగా బాబాపై పాట రాసినట్లు చెప్పారు. ముకుంద శర్మ పాట రాయగా మణిశర్మ శిష్యుడు డీజే వసంత్ సంగీతం సమకూర్చారని ఆయన తెలిపారు. పిల్లలకు సనాతన ధర్మం, ఆధ్యాత్మిక విలువలు తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు దోహదం పడతాయని చెప్పారు. ఇది జీవిత కాలంలో అత్యద్భుత అనుభూతిని పొందే కార్యక్రమమని, భక్తులంతా కార్యక్రమంలో పాల్గొనేందుకు విరివిగా తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
"షిర్డీ సాయి మహరాజ్కి కోటి రుద్రాక్షలతో అభిషేకం, అర్చన చేయడం అనేది విశిష్టమైన కార్యక్రమం. ఇది చాలా మహత్కర కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి"-గజల్ శ్రీనివాస్, ప్రముఖ గాయకుడు
ఇవీ చదవండి: