Farmers Problems: ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా అవస్థలే.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు..
Published: May 17, 2023, 9:41 AM


Farmers Problems: ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా అవస్థలే.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు..
Published: May 17, 2023, 9:41 AM
Farmers Problems: ప్రకృతి విపత్తులకు తట్టుకుని పండించిన.. ధాన్యం కల్లాల్లోనే మగ్గుతోంది. పెట్టిన పెట్టుబడులకు వడ్డీ పెరిగిపోతోంది.! అన్నదాతల ఆశ అడియాశఅవుతోంది.! ఐనా.. పంట కొనడంలేదు..! రైతు భరోసా కేంద్రాలు ప్రేక్షకపాత్ర పోషిస్తుంటే.. మిల్లర్లు మద్దతు ధరకు మంగళంపాడి.. బేరసారాలు ఆడుతున్నారు. అసలు ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చెప్తోందేంటి..? క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితేంటి..? ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ ప్రత్యేక కథనం మీకోసం..
Farmers Problems: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ మాటలు, చేతలకు మధ్య చాలా తేడా ఉంది. ధాన్యం కొనుగోళ్ల తీరు చూస్తే.. ప్రభుత్వం చెప్పే మాటల్లో వడ్లగింజంత వాస్తవం కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం చెప్తోందే నిజమైతే.. కల్లాల్లో ధాన్యం రాశులు ఇలా పోగుపడేవా? రైతులు మండుటెండల్లో ఇలా అవస్థలు పడేవారా? ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో రబీ సీజన్లో వరిసాగు చేశారు. అందులో కొత్తూరు తాడేపల్లికి చెందిన ఈ రైతులూ.. ఉన్నారు.
20 రోజులు దాటినా ధాన్యం.. కల్లం దాటలేదు. రైతులు కళ్లలో ఒత్తులు వేసుకుని రైతు భరోసా కేంద్రాలవైపు చూస్తున్నారు. ప్రస్తుతం కొత్తూరు తాడేపల్లి రైతుల వద్ద ఉన్న ధాన్యం తేమ శాతం 14 మాత్రమే ఉంది. ప్రమాణాల ప్రకారం 17శాతం వరకూ అనుమతిస్తారు. కానీ ఆర్బీకే సిబ్బంది.. రేపుమాపంటూ కాలంగడుపుతున్నారు. ధాన్యం తరలించడానికి గోనెసంచులు రావాలని ఒకసారి, లారీలు రావడం లేదని మరోసారి.. సాకులు చెప్తున్నారని.. రైతులు వాపోతున్నారు.
ఈ ప్రహసనమంతా పూర్తై ధాన్యం రైస్ మిల్లలకు చేరితే.. అక్కడ మిల్లర్లు కొర్రీలు వేస్తున్నారు. ధాన్యం నూకగా మారుతోందంటూ బస్తాకు 5కేజీల ధాన్యాన్నితరుగురూపంలో అదనంగా తీసేస్తున్నారు. మిల్లర్లు బేరాలు ఆడడం తప్ప.. మద్దతు ధరకే కొనడంలేదు.ఇక ఈ సీజన్లో ధాన్యం కొనకపోవడమేకాదు.. గత సీజన్లో కొన్న ధాన్యం డబ్బూ ఇంతవరకూ చెల్లించలేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో సుమారు లక్షా 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని.. అధికారులు మొదట అంచనా వేశారు. ఆ తర్వాత 64వేల 771 టన్నుల వరకు చేస్తామని.. కిందిస్థాయి అధికారులు మరో నివేదిక ఇచ్చారు. చాలామంది రైతులు అప్పటికే ధాన్యాన్ని దళారులకు విక్రయించడమే.. అంచనాలు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.
"మేము వరి కోసి సుమారు 22 రోజులవుతోంది. పదిహేను రోజుల క్రితం తేమ శాతం చూసి 16 వచ్చిందన్నారు. ధాన్యాన్ని ఈ రోజు కాటా వేస్తాం.. రేపు వేస్తాం అని అంటున్నారు. రోజూ వారి చుట్టూ తిరుగుతున్నాము.. కానీ వారు మాత్రం కాటా వెయ్యట్లేదు. ఏదో ఒక సాకు చెప్పి.. మమ్మల్ని మోసం చేస్తున్నారు." - చింతా సుధాకర్, రైతు
ఇవీ చదవండి:
