ETV Bharat / state

కేంద్రం నిర్ణయం.. కర్ణాటకకు వరం.. తెలుగు రాష్ట్రాలకు శాపం

author img

By

Published : Mar 1, 2023, 9:58 PM IST

Etv Bharat
Etv Bharat

Upper Bhadra : ఒక నిర్ణయం.. తెలుగు రాష్ట్రాలకు శాపమైతే... అదే నిర్ణయం... పొరుగు రాష్ట్రానికి వరమైంది. ఒక ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే... మరో ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీనంతటికి కారణం... ఒకే ఒక్క ప్రాజెక్టు. అదే అప్పర్‌ భద్ర. ఈ ప్రాజెక్టు వల్ల కర్ణాటకకు లాభం చేకూర్చేలా ఉంటే....రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును... రాయలసీమ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్‌లో సాగు నీరుకు తీవ్ర కటకట ఏర్పడుతుందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అప్రర్ భద్ర ప్రాజెక్టు అంటే ఏమిటి...? దీని వల్ల రాయలసీమ ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లనుంది....? ఇప్పుడు చూద్దాం.

అప్పర్ భద్ర పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు రాష్ట్రాలు

Upper Bhadra : కర్ణాటకకు మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై వరాల జల్లు కురిపిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్​లో అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం 5వేల 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి జాతీయ హోదా సైతం కల్పిస్తూ... కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కర్ణాటక రాష్ట్రంలోని రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టును వెంటనే ఆపాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఆవిర్భవించే తుంగ, భద్ర వేర్వేరు నదులు. శివమొగ్గ జిల్లాలో ఈ రెండింటి కలయికతో తుంగభద్రగా దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కృష్ణానదికి ఉపనది. కర్ణాటకలోని చిక్ మగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, తుముకూరు.. తదితర జిల్లాల్లో నీటి కటకటతో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. తమకు తాగు, సాగునీరు అందించేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మించాలని సుమారు 2 దశాబ్దాలుగా... ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ప్రభుత్వాలు రూపకల్పన చేశాయి. తుంగ నది నుంచి భద్రకు 17.40 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. అనంతరం భద్ర నుంచి 29.90 టీఎంసీల జలాలను అజ్జంపుర సమీపంలోని సొరంగం ద్వారా తరలిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2.25 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు అందనుంది. మరో 367 చెరువులను 50 శాతం సామర్థ్యంతో నింపడం ద్వారా తాగునీటి కూడా సమస్య తీరనుంది. రెండు దశల్లో సాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 2018-19 నాటి అంచనాల ప్రకారం 21వేల 473 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి డీపీఆర్ సిద్ధం చేశారు. 2008లోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రాథమికంగా ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 4వేల 800 కోట్లు వెచ్చించినట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. నిర్మాణం పూర్తి కావటానికి సుమారు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

2008లో అప్పర్ భద్ర ప్రాజెక్టు పనులు ప్రారంభమైనా... ఆశించిన మేర ముందుకు సాగలేదు. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అనేక అభ్యంతరాలున్నాయి. అయినప్పటికి 2010లో కొన్ని అనుమతులు లభించాయి. తుంగ నది నుంచి 15 టీ‌ఎం‌సీల నీటిని భద్ర రిజర్వాయర్‌కు తరలించి, ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 21.5 టీఎం‌సీల నీటిని ఎత్తిపోయాలనేది ఆనాటి ప్రతిపాదన. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా బచావత్ ట్రిబ్యునల్ ఆదేశం మేరకు కృష్ణ జలాలలో కర్ణాటకకు 21 టీఎం‌సీల అదనపు జలాలు ఉపయోగించుకొనే అవకాశం ఉందని చెబుతూ అప్పర్ భద్ర పరిధి పెంచారు. దీంతో కర్ణాటకకు అదనంగా మరిన్ని జలాలను వినియోగించుకునే అవకాశం వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ ప్రతిపాదనల్లో అప్పర్ భద్ర కోసం ఏకంగా 5వేల300 కోట్ల రూపాయలు కేటాయించింది.

వర్షాలు బాగా కురిసి... కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ప్రవహించి... ప్రాజెక్టులు నిండితే ఎలాంటి సమస్యలూ ఉండవు. అలా కాని పక్షంలో... కృష్ణా నదీ జలాల వినియోగంలో పలు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతంలో ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం చుట్టూ వివాదం చెలరేగింది. తెలంగాణ, ఏపీ మధ్య రాజోలిబండ మళ్లింపు పథకం ఆర్​డీఎస్, శ్రీశైలం ప్రాజెక్టు జలాల వినియోగంలో వివాదం నడుస్తోంది. కృష్ణా నదికి తుంగభద్ర ఉపనది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నిండాక... కర్నూలు, తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేశుల జలాశయంలోకి నీరు చేరుతుంది. అనంతరం సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసిపోతుంది.

చాలా సందర్భాల్లో కృష్ణానదికి వరద రాకపోయినా... తుంగభద్ర నుంచి వచ్చే నీటితోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. ఏటా తుంగభద్ర నుంచి వంద టీఎంసీలకు పైగా శ్రీశైలంలో చేరుతోంది. శ్రీశైలం వెనుక జలాల వల్ల కేసీ కెనాల్, ఎస్సార్ బీసీ, తెలుగుగంగ, గాలేరు- నగరి, హంద్రీనీవా పథకాలకు నీరు అందుతుంది. ఈ పథకాల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుతోంది. వెలుగోడు, గోరుకల్లు, అవుకు, గండికోట తదితర జలాశయాలు నిండుతున్నాయి. చెన్నెకి కూడా నీరు అందుతోంది. ఒకవేళ తుంగభద్రకు నీరు రాకపోతే... కృష్ణానదికి వచ్చే వరదపైనే ఆధారపడాలి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నిండిన తర్వాతనే శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. ఈ అప్పర్‌ భద్ర నిర్మాణంతో కృష్ణానదిలో నీటి సమస్య ఏర్పడనుంది. దీని ద్వారా ప్రాజెక్టు దిగువన రాష్ట్రాలకు ఇబ్బందులు ప్రారంభమవుతాయి.

తుంగభద్రా నది మీద కర్ణాటకలోని బళ్లారి జిల్లా హోస్పెట్‌ వద్ద 1943లో తుంగభద్ర డ్యామ్‌ నిర్మాణం చేపట్టారు. ఇది కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. డ్యామ్‌ నిర్మించే నాటికి నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీలు. పూడిక కారణంగా ప్రస్తుతం 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే వుంది. డ్యామ్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఆధారంగా... 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రైబ్యునల్ అంచనా వేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 72 టీఎంసీలు, తెలంగాణకు 6.51 టీఎంసీలు, కర్ణాటకకు 151.49 టీఎంసీల నీటిని కేటాయించింది. తుంగభద్ర డ్యామ్ పూర్తిసామర్థ్యం ప్రకారం నీటి వాటా దక్కాలంటే భద్ర నుంచి వచ్చిన వరద నీరే ఆధారం. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, కె.సి.కెనాల్‌ ద్వారా ప్రస్తుతం ఏపీకి జలాల వినియోగం జరుగుతోంది. అనంతపురం, కర్నూలుతో పాటుగా కడప జిల్లాకు కూడా ఈ నీరు అందుతోంది. అనంతపురం జిల్లాలో సగం ఆయకట్టుకు అంటే లక్షా 45వేల 236 ఎకరాలకు ప్రధాన వనరు ఇదే. కర్నూలు జిల్లాలో 14వేల 744 ఎకరాలు, కడప జిల్లాలో లక్షా 40వేల 600 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోంది.

కేసీ కెనాల్‌ కింద ఉమ్మడి కడప జిల్లాలో 92వేల ఎకరాలు, కర్నూలు జిల్లాల్లో లక్షా 73వేల 627 ఎకరాలు, తుంగభద్ర దిగువ కాలువ కింద కర్నూలు జిల్లాలో లక్షా 51వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర నదిలో ఇన్ ఫ్లో తగ్గిపోతుంది. దానివల్ల హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, పోతిరెడ్డిపాడు, రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందదు. దీనిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతం వ్యక్తం చేశాయి. అయినా దిగువన ఉన్న రాయలసీమ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను విస్మరించి కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పిన భాజపా అందుకు విరుద్ధంగా ఎగువ ప్రాజెక్టులకి నిధులు కేటాయించి ఆయకట్టు దిగువన ఉన్న వారిని దగా చేస్తోందని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. అప్పర్ భద్ర పూర్తి చేయడానికి ముందుగా రాయలసీమ ప్రయోజనాల రీత్యా సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడికాల్వ వంటివి నిర్మించాలని వారు కోరుతున్నారు.

అప్పర్ భద్ర నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటం చేయనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు వచ్చే జలాల్లో సమస్యలు వస్తాయని, కృష్ణా డెల్టా ఇక్కట్లలో పడుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, జాతీయ హోదా నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. కె-8, కె-9 బేసిన్లలో కర్ణాటక ఎక్కువగా నీటిని వినియోగించుకుంటోంది. దాంతో విజయనగర చానెళ్లు, తుంగ, భద్ర వాటాలో మిగులు లేదు. అయినప్పటికీ కేంద్ర జలశక్తిశాఖ తాను పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా జాతీయ హోదా ఇస్తోంది. బేసిన్‌లో కేటాయింపులు లేకుండా, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తన మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయనున్నట్లు... ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

అప్పర్‌ భద్ర ప్రాజక్టుకు ఏడాది క్రితమే జలశక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ జాతీయ హోదా సిఫార్సు చేసినట్లుగా నిపుణలు చెబుతున్నారు. ఏడాదిగా ఏపీ ప్రభుత్వం ఏమీ చేయకుండా... మౌనంగా ఉందని... ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడి చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం పూర్తి చేయలేదని, రాయలసీమ నీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వీడడం లేదని నాయకులు ధ్వజమెత్తుతున్నారు.

అప్పర్ భద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఏపీ, తెలంగాణలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు కదిలి వస్తేనే... సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే... రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.