ETV Bharat / state

ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 9:39 PM IST

Anganwadi Workers State Wide Protest : రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన బాటపట్టారు. వేతనాల పెంపుతోపాటు గ్రాట్యుటీ అమలు, పింఛన్ సౌకర్యం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లు, తహసీల్దార్, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలు ముట్టడించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు.

Anganwadi_Workers_State_Wide_Protest
Anganwadi_Workers_State_Wide_Protest

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన

Anganwadi Workers State Wide Protest : విజయవాడలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా కానూరులోని ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ. 26000 ఇవ్వడంతోపాటు గ్రాట్యుటీ, పింఛన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆంగన్‌వాడీలు ఆందోళన నిర్వహించారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. గుడివాడ, పామర్రు, మొవ్వలో అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, నందిగామలో నిరసన తెలిపారు.

అంగన్‌వాడీ వర్కర్ల పోరాటాలపై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం.. ఇచ్చిన హామీలను మరిచి, వేధింపులు!

Anganwadi Workers Protest Over Salary Hike : గుంటూరు కలెక్టరేట్ వద్ద వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. తెలంగాణ కన్నా ఎక్కువ వేతనం ఇస్తానన్న జగన్ ఇప్పటివరకు ఆ హామీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు పైగా బిల్లులు రాకపోవటంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని వాపోయారు. కాకుమానులో నిరవధిక సమ్మె చేపట్టారు. మంగళగిరిలో అంగన్‌వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్‌వాడీలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Jagan Cheated Anganwadi Workers: అంగన్వాడీలను నిలువునా ముంచిన జగన్‌ సర్కార్‌..ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వం

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అంగన్‌వాడీలు రోడ్డెక్కారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదంటూ నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో అంగన్‌వాడీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తునిలో నిరసన దీక్షకు దిగారు. అమలాపురం, పి.గన్నవరం,రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేటలోనూ అంగన్‌వాడీల ఆందోళనలు కొనసాగాయి. అంగన్‌వాడీ కేంద్రాల మూసివేతతో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందలేదు. ఏలూరులో కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. కైకలూరు ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

Anganwadi Workers Protest for Various Demands : ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అంగన్‌వాడీలు కదం తొక్కారు. విశాఖలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సమ్మెలో భాగంగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున నిరసన తెలిపారు. శ్రీకాకుళం ఐ.సి.డి.ఎస్ (ICDS) కార్యాలయం ఎదుట వందలాదిమంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిరవధిక సమ్మె చేపట్టారు, అంగన్వాడీల కనీస వేతనం రూ. 26 వేల రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Anganwadi Workers Protest: కదం తొక్కిన అంగన్వాడీలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు దిగారు. వీరి ఆందోళనకు టీడీపీ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని పుట్టపర్తిలో అంగన్‌వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. మడకశిరలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. నంద్యాలలో ప్రధాన రహదారిపై అంగన్‌వాడీ కార్యకర్తలు నిరనస దీక్ష చేపట్టారు.

Anganwadi Workers Strikes In Vijayawada : అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‍ చేశారు. తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలకు ఆయన మద్దతు తెలిపారు. తిరుపతి అర్బన్‌, గ్రామీణం, చంద్రగిరి మండలాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు తరలివచ్చి తిరుపతిలో సమ్మెలో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం, పులివెందుల, చక్రాయపేట, వేంపల్లిలో నిరవధిక ఆందోళనలు చేపట్టారు. కడపలో కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చి మినీ వర్కర్లు, హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. I.C.D.S కి బడ్జెట్‌ పెంచి ప్రీ స్కూల్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

'జగనన్న నువ్వు మోసగాడివన్నా.. మేము మోసపోయామన్నా' అంగన్వాడీల పాట

నెల్లూరు ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల కేంద్రాల్లోనూ నిరసనలు తెలిపారు. I.C.D.S ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఒంగోలులో అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టును పటిష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. మార్కాపురం, కనిగిరితోపాటు ఇతర మండల కేంద్రాల్లో I.C.D.S ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు ఆందోళనలకు దిగారు. కనిగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.