ETV Bharat / state

TDP leaders On Smart Meeters: మోటర్లకు స్మార్ట్‌ మీటర్లు.. ఓ పెద్ద స్కాం! ఆ వివరాలను వెల్లడించాలి: టీడీపీ

author img

By

Published : Jun 10, 2023, 6:22 PM IST

Updated : Jun 10, 2023, 6:53 PM IST

TDP chief leaders fired on AP CM Jagan: వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం ముఖ్యమంత్రి జగన్.. విద్యుత్ ఉత్పత్తిని చంపేసి, విద్యుత్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

cm jagan
cm jagan

TDP chief leaders fired on AP CM Jagan: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై.. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు.. జీ.వీ.రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ మీటర్ల కాంట్రాక్టును షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు కట్టబెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఎన్నిసార్లు టెండర్లు పిలిచారు..?, వినియోగదారులపై ఎంతెంత విద్యుత్ భారాన్ని మోపారు..?, అన్ని రాష్ట్రాలు ఒక్కో స్మార్ట్ మీటర్​పై తక్కువ ధరను నిర్ణయిస్తే, జగన్ మాత్రం ఎక్కువ ధరను నిర్ణయించారంటూ పలు కీలక విషయాలను వెల్లడించారు.

టెండర్ల వివరాలను మూడు రోజుల్లో ప్రకటించాలి.. ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్ల పేరుతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 4వేల 800 కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధమైందని ఆరోపించారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్‌కు దోచిపెట్టడానికే ప్రజల్ని రాబందుల్లా పీక్కుతింటున్నారని జీవీ రెడ్డి మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగితే వివరాలు ఎందుకు బయటపెట్టరని నిలదీశారు. టెండర్ల వివరాలు మూడు రోజుల్లో ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, గృహవిద్యుత్ వినియోగదారుల నుంచి రూ. 9వేల కోట్లు కొట్టేయడానికి జగన్ అండ్ కో సిద్ధమైందన్న ఆయన.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక్కో స్మార్ట్ మీటర్ ధర రూ. 10వేలకు తక్కువగా నిర్ణయిస్తే.. జగన్ మాత్రం రూ. 37వేల ధర పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే చంద్రబాబు రావాల్సిందే.. 'మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఉండాలంటే.. మళ్లీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రావాల్సిందే' అని.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. 2019 నుంచి ముఖ్యమంత్రి జగన్.. ప్రతి ఏటా ఛార్జీలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సీఎం తన అనుచరుల కోసం లబ్ది చేకూర్చేందుకే వేల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో కట్టబెటుతున్నారని ఆరోపించారు.

జగన్‌పై ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం.. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని.. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి, దేశంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామన్నారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే.. 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని గుర్తు చేశారు.

ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక.. 2022లో పవర్ హాలిడే ప్రకటించారని, 2022 ఏప్రిల్‌లో రోజుకు 40-40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని.. ప్రత్తిపాటి విమర్శించారు. తక్కువ ఓల్టేజీ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ హామీని అమలు చేయడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని ప్రత్తిపాటి తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు చేశారన్న ఆయన.. ఆ పరికరాల వల్ల విద్యుత్ కోతలు, లో-ఓల్టేజీ విద్యుత్ సరఫరా సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆగ్రహించారు.

కమీషన్ల కోసం కక్కుర్తి- విద్యుత్ ప్రాజెక్టులు నిర్వీర్యం.. కమీషన్ల కోసం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని సీఎం జగన్ రెడ్డి చంపేస్తున్నారని.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తమ కమీషన్ల కోసం, ఒక యూనిట్ రూ.4.75 రూపాయలకు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగంలోని విద్యుత్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, ప్రైవేటు రంగంలో యూనిట్ రూ.16 రూపాయలకు కొనుగోలు చేసి.. ఆ భారాన్ని వినియోగదారునిపై వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తన అసమర్థత, కమిషన్ల కక్కుర్తితో విద్యుత్ రంగాన్ని బ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. అధిక రేటుకు కరెంటు కొనుగోలు చేశామని, ఆ భారాన్ని ట్రుఅఫ్ చార్జీల పేరుతో వినియోగదారునిపై వేయడమే కాకుండా, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య వాడుకున్న విద్యుత్‌కు కూడా ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పుడు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated :Jun 10, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.