కర్నూలు జిల్లాలోని పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గుంతలు విద్యార్థులను ప్రమాదాల్లోకి నెడుతున్నాయి. పాఠశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం 2018లో రూ. 2కోట్ల నిధులు మంజూరయ్యాయి. పాఠశాల మైదానంలో కొలతలు వేసి గుంతలు తవ్వించారు. అనంతరం నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో క్రీడామైదానంలో గుంతలు అలాగే దర్శనమిస్తున్నాయి. మైదానంలో ఆడుకోవటానికి వెళ్లిన విద్యార్థులు గుంతల వల్ల భయంభయంగా ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడుకుంటున్న సమయంలో గుంతల్లో ఆట వస్తువులు పడుతుండడంతో... ఆటవస్తువులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విద్యార్థలు గాయాలపాలవుతున్నారు. వర్షం పడినప్పుడు గుంతలు నీటితో నిండి పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం చేసుకుంటుందోనని... ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేసి...విద్యార్థులు ఆటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'బట్టలు ఉతకనన్నారని... 13 రజక కుటుంబాలను వెలివేశారు'