కర్నూలు జిల్లా వేముగోడులో మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ దాదాపు అన్ని వర్గాల వారు జీవిస్తున్నారు. అందులో 13 రజక కుటుంబాలున్నాయి. దాదాపు 50 వరకు వారి జనాభా ఉంటుంది. ఆరేళ్ల క్రితం వరకు గ్రామస్థుల బట్టలను రజక కుటుంబాలే ఉతికేవి. కానీ, ఈ ప్రాంతాన్ని కరవు ముంచెత్తడంతో, బట్టలు ఉతకడానికి నీళ్లు లేకుండాపోయాయి. వారు బట్టలు ఉతకడం మానేశారు. వారంతా తమ భూముల్లో వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అయితే ఈ మధ్య పడిన వర్షాలతో గ్రామస్థులంతా రజకులను తిరిగి తమ బట్టలు ఉతకాలని ఒత్తిడి చేస్తున్నారు.
గ్రామస్థుల నిర్ణయానికి రజక కుటుంబాలు ససేమిరా అన్నాయి. ఆగ్రహించిన ఊరిజనం... ఇకపై రజకులను కూలి పనులకు పిలవొద్దని..వారికి ఎలాంటి సాయం చేయొద్దని.. వారితో మనకు అవసరం లేదని పంచాయతీలో తీర్మానం చేశారు. గ్రామస్థుల నిర్ణయానికి రజకులు మనస్థాపం చెంది పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను పిలిచి చర్చించటంతో సమస్యకు తెరపడింది. బలవంతంగా కులవృత్తి చేసే ప్రసక్తే లేదని రజకలు చెబుతున్నారు.ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని ఎస్సై హనుమంత రెడ్డి చెపుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అప్పుడప్పుడూ వేముగోడు గ్రామానికి వెళ్లి వస్తున్నారు. కానీ, తమను కులవృత్తిలోకి లాగే శక్తి నుంచి ఎంతకాలం తప్పించుకోగలం? అన్న అనుమానం మాత్రం రజకుల కళ్లల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది.
ఇదీ చూడండి