ETV Bharat / state

Kurnool Mega Seed Hub: కర్నూలు విత్తన భాండాగారాన్ని పట్టాలెక్కించండి జగన్ సారూ..!

author img

By

Published : Jul 30, 2023, 2:10 PM IST

Kurnool mega seed hub
కర్నూలు మెగా సీడ్‌ హబ్‌ను పాడుబెట్టిన వైసీపీ ప్రభుత్వం

Kurnool Mega Seed Hub: బంగారం పండించే నేల, అనుకూల వాతావరణం.! సీడ్‌ హబ్‌గా చేస్తే.. విత్తన కొరత తీరడమే కాదు.. వేలమందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయనే ఆశ..! కానీ, వైసీపీ ప్రభుత్వం ఆ ఆశలపై నీళ్లు కుమ్మరించింది..! కర్నూల్‌ జిల్లాకు తలమానికం అవుతుందని భావించిన విత్తన భాండాగారాన్ని.. పాడుబెట్టింది. పరిశోధనలతో కళకళలాడాల్సిన ప్రాంతాన్ని పిచ్చిచెట్లపాలుజేసింది.

కర్నూలు మెగా సీడ్‌ హబ్‌ను పాడుబెట్టిన వైసీపీ ప్రభుత్వం

Kurnool Mega Seed Hub: ఉమ్మడి కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో 1,600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో.. మెగా సీడ్ హబ్, అల్ట్రా మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తే సద్వినియోగం అవుతుందని గత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. నేల, వాతావరణం అనుకూలంగా ఉండే.. తంగడంచ గ్రామ పరిసరాల్ని విత్తన హబ్‌గా మార్చాలని అప్పటి సీఎం చంద్రబాబు.. శంకుస్థాపన చేశారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. సాంకేతిక భాగస్వామ్యం, అమెరికాలోని అయోవా యూనివర్శిటీ.. సమాచార కేంద్రంగా పనిచేయటానికి ఒప్పందం చేసుకున్నారు. గోదాములు, విత్తన పరీక్షా కేంద్రాలు, పరిశోధనా కేంద్రం, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, శిక్షణా కేంద్రం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు వేశారు. అయితే ప్రభుత్వం మారాక.. విత్తన భాండాగారం మూలనపడింది. దీంతో వేలాది మంది ఉపాధి అవకాశాలు.. గల్లంతయ్యాయి. గతంలో నిర్మించిన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.

సీడ్ హబ్‌లో భాగంగా అంతర్జాతీయంగా పేరుగాంచిన.. జైన్‌ ఇరిగేషన్‌, గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్‌ వంటి సంస్థలను.. పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వం ఒప్పించింది. కొన్ని కోట్ల రూపాయలతో.. మౌళిక వసతులూ కల్పించింది. నాటి సీఎం చంద్రబాబు 2017 జూన్ 21న.. జైన్ ఇరిగేషన్ సంస్థ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఒప్పందం ప్రకారం.. జైన్‌ ఇరిగేషన్‌ సంస్థ రెండేళ్లలో కార్యకలాపాలూ ప్రారంభించింది. అయితే.. వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవవడంతో.. కార్యకలాపాలు దాదాపు ఆగిపోయాయి. మరో సంస్థ గుజరాత్‌ అంబుజా మొత్తానికే ముఖం చాటేసింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు.. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. విత్తన భాండాగారం ప్రణాళికల్ని పట్టాలెక్కించాలని స్థానికులు కోరుతున్నారు.

"సీడ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం డ్రైనేజీ సిస్టమ్, ఇతర వాటి కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. అయితే జగన్మోహన్​ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవటం వల్ల.. ఇది నిర్వీర్యం అయిపోయింది. దీనిపై ఖర్చు పెట్టిన ఆరు కోట్ల రూపాయల ప్రజాధనం కూడా నిరుపయోగం అయిపోయింది. కర్నూలు జిల్లాలోనేకాక.. దక్షిణ భారతదేశానికి ఉపయోగపడే ఈ విత్తన పరిశ్రమను వైసీపీ సర్కారు పట్టించుకోకపోవటం చాలా అన్యాయం." - రామకృష్ణ, రైతు సంఘం నేత

"సీడ్ హబ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే రైతులకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. మేలు రకం విత్తనాల వల్ల పంటలు మంచిగా పండుతాయి. దీనివల్ల రైతులు లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్థానికంగా రైతులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి విత్తన భాండాగారం ప్రణాళికల్ని పట్టాలెక్కించాలని కోరుతున్నాము." - సూరి, రైతు సంఘం నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.