ETV Bharat / state

ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Nov 15, 2022, 5:56 PM IST

TRS Executive Meeting
TRS Executive Meeting

TRS Executive Meeting: తెలంగాణ భవన్​లో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించి తెరాస విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. శాసనసభ ఎన్నికలపై పార్టీ సమావేశంలో కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు.

TRS Executive Meeting: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. మునుగోడు తరహాలో పటిష్ట ఎన్నికల వ్యూహం తయారుచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెరాస ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలన్న కేసీఆర్.. ఎమ్మెల్యేలను మార్చాలన్న ఉద్దేశం లేదని పేర్కొన్నారు. భాజపా కుట్రలు అన్నింటినీ తిప్పికొడదామని నేతలకు తెలిపారు. సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయన్నారు. వందశాతం అధికారం మళ్లీ తెరాసదే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా చాలా నీచంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని భాజపా ఒత్తిడి చేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

'ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర కూడా ప్రయత్నించి అడ్డంగా దొరికారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చట్టం తనపని తాను చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లబ్ధిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలి. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. తెరాస కార్యకర్తల బలంతో ఓటర్లందరినీ చేరుకోవాలి. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతగా దాడి చేస్తోంటే ఊరుకుందామా... పోరాడదామా?'- సీఎం కేసీఆర్

ఎమ్మెల్యేలకు ప్రలోభాలు వెలుగు చూసినందున.. ప్రజాప్రతినిధులకు గులాబీ దళపతి కీలక సూచనలు చేశారు. సిట్టింగ్​లకు మళ్లీ అవకాశమిస్తామని.. గతంలోనే పలు సందర్భాల్లో చెప్పిన పార్టీ అధినేత మరోసారి వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్​లో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.