ETV Bharat / state

Margadarshi : ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే... మార్గదర్శిపై ఏకపక్ష దాడులు

author img

By

Published : Apr 21, 2023, 8:44 AM IST

Margadarshi : ఏపీ ప్రభుత్వం దురుద్దేశాలతో ఈనాడు, మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థలపై ఇరువైపులా దాడి చేస్తోందని మార్గదర్శి తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా నిలువరించేందుకే మార్గదర్శి గ్రూపునకే చెందిన ‘ఈనాడు’పైనా రాష్ట్ర ప్రభుత్వం నిత్యం దుష్ప్రచారం చేస్తోందన్నారు. సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే లక్ష్యంతో మార్గదర్శిపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

Margadarshi : మార్గదర్శి వ్యవహారాలపై ప్రైవేటు ఆడిటర్‌ నియామకంతోపాటు, ఆడిట్‌ నిర్వహించాలని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్ట్రార్‌ మార్చి 13, 15, 18, ఏప్రిల్‌ 2వ తేదీల్లో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గురువారం జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టారు. 1962 నుంచి 60 ఏళ్లపాటు ఒక్క ఫిర్యాదుగానీ ఆరోపణ గానీ లేకుండా రూ.10వేల కోట్ల టర్నోవరుతో మార్గదర్శి వ్యాపారం నిర్వహిస్తోందని, అలాంటి సంస్థకు ఏపీ ప్రభుత్వం 2022 నుంచి సమస్యలు సృష్టించడం ప్రారంభించిందని మార్గదర్శి తరఫు న్యాయవాదులు ఆక్షేపించారు. చిట్‌ఫండ్‌ కంపెనీని దెబ్బతీయడం ద్వారా వ్యాపారాన్ని స్తంభింపజేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫైనాన్స్‌ వ్యాపారంలో ఒక వదంతి వస్తే వ్యాపారం కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. చిట్‌ఫండ్‌ కంపెనీ చట్టానికి విరుద్ధంగా నియంత్రణ పేరుతో చర్యలు చేపట్టారన్నారు. మార్గదర్శిపై ఆరోపణలు చేస్తూ రిజిస్ట్రార్‌ విలేకర్ల సమావేశం నిర్వహించి 4 నెలలైనా ఒక్క ఫిర్యాదూ అందలేదని... ఇదే హైకోర్టు పేర్కొన్న విషయాన్ని మార్గదర్శి తరపు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఏమీ లేకపోయినా ఏదో దొరుకుతుందని విచారణ జరుపుతోందని ఉద్దేశాలు, లక్ష్యాలు మాత్రం వేరుగా ఉన్నాయని ఆరోపించారు.

నిధుల మళ్లింపు సాకుతో.. చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారమే మార్గదర్శి వ్యాపారం నిర్వహిస్తోందన్నారు. మార్గదర్శి ఖాతాల తనిఖీ నిమిత్తం జనవరి 9న ఏకపక్షంగా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను నియమించారన్నారు. ఇలా నియమించే అధికారం రిజిస్ట్రార్‌కు లేదని తెలిపారు. కొన్ని ఆరోపణలు, నిధుల మళ్లింపు సాకుతో ప్రాథమిక విచారణ చేశారని... దాని ఆధారంగా పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ ఆడిటర్‌ను నియమించడం చెల్లదన్నారు. ప్రాథమిక నివేదిక తమకు అందజేయలేదని, అందులో ఏముందో కూడా తెలియదని మార్గదర్శి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏపీలోని 37 బ్రాంచ్‌లతోపాటు తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ఒక్కో శాఖలో కొన్ని వందల చిట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో చిట్‌ గ్రూపులో కొంతమందిని కలిపి తీసుకుంటామని అందరి నుంచి సొమ్ము వసూలు చేసి చిట్‌ పాడుకున్న వ్యక్తికి అందజేస్తుంటామన్నారు. ఖాతా పుస్తకాలు బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్థిరాస్తులు, నిధుల మళ్లింపు తదితరాలకు సంబంధించి వివరాలు కోరుతున్నారన్నారు. ఒక బ్రాంచికి సంబంధించి కాకుండా.. మొత్తం కంపెనీకి సంబంధించిన వివరాలు అడుగుతున్నారని ఇది కంపెనీని నష్టపరచడానికేనని.. మార్గదర్శి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

ఈనాడు ఫోబియాతోనే... రిజిస్ట్రార్‌ దిల్లీలో విలేకర్ల సమావేశం పెట్టి మార్గదర్శిపై ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నియంత్రణ పేరుతో నిషేధం విధించే ప్రయత్నం జరుగుతోందని వారికి ‘ఈనాడు’ ఫోబియా పట్టుకుందన్నారు. గత ఏడాది అధికారం లేకుండానే మార్గదర్శి కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో పాటు చందాదారుల ఆధార్‌, ఇతర వ్యక్తిగత వివరాలు అడిగారని దీనిపై ఇదే హైకోర్టు గతేడాది డిసెంబరు 16న స్టే విధించిందని గుర్తుచేశారు. నిర్దిష్ట ఆరోపణలకు సంబంధించిన వివరాలు కాకుండా బ్యాంకు ఖాతాలు, ఆస్తి, అప్పుల పట్టీ, చందాదారుల లెడ్జర్, వారికి ఇచ్చిన రశీదులు, చిట్‌పాట వివరాలు అడిగారని ప్రతి అంశంపై ఆరా తీయడానికి వాళ్లేమైనా ఫోరెన్సిక్‌ అడిట్‌ నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. వీటన్నింటితో ఏం సంబంధం ఉందన్నారు. ఇదంతా చిట్‌ఫండ్‌ వ్యాపారాన్ని మూయించే ప్రయత్నమని మార్గదర్శి తరఫు న్యాయవాది ఆరోపించారు.

ఆధారాల్లేకున్నా.. ప్రభుత్వం దురుద్దేశపూరిత చర్యలతో నియంత్రించాలని చూస్తోందని, ఇక్కడ తాము ‘ఈనాడు’ గురించి మాట్లాడటం లేదని మార్గదర్శిపై నిరాధారంగా జరుగుతున్న విచారణపై మాత్రమే చెబుతున్నామని మార్గదర్శి తరఫు న్యాయవాది తెలిపారు. రోథాస్‌ ఇండస్ట్రీస్‌ వర్సెస్‌ ఎస్‌డీ అగర్వాల్‌ కేసులో కంపెనీ చట్టంలోని సెక్షన్‌ 237 ప్రకారం నిరాధార దర్యాప్తు చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. కంపెనీపై దర్యాప్తు ప్రభావం చూపుతుందని స్పష్టంగా పేర్కొందని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. అధికారం లేకపోయినా ఒక అధికారిని నియమించి ప్రాథమిక నివేదిక తెప్పించడం తరువాత పూర్తిస్థాయి విచారణ నిమిత్తం రిజిస్ట్రార్‌కు సహకరించాలంటూ మరో అధికారిని నియమించడం చెల్లదన్నారు. తాము ఆడిటర్‌ను వ్యతిరేకించడం లేదని, ఆయన నియామకాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. 87 ఏళ్ల వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

మరోవైపు.. ఏపీలో జరుగుతున్న సంఘటనలపై విచారించే పరిధి తెలంగాణ కోర్టుకు లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పలు తీర్పులను ప్రస్తావించారు. అన్నీ ఏపీలో జరిగాయని అందువల్ల అక్కడి హైకోర్టును ఆశ్రయించవచ్చని ఇక్కడ కాదని అన్నారు. గతంలో హైదరాబాద్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించినందున ఈ కోర్టు జోక్యం చేసుకుందని తెలిపారు. ఛైర్మన్, ఎండీలపై ఆరోపణలతోపాటు నిధుల మళ్లింపు అంతా ప్రధాన కార్యాలయం ద్వారా జరిగిందన్నారు. ప్రస్తుతం ఏపీలోని 37 బ్రాంచ్‌ల ఖాతాలు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్తర్వులకు విరుద్ధంగా ఆడిటర్ నియామకం.. మార్గదర్శిలో 3 లక్షల మంది చందాదారులున్నారని, ఒక్క ఫిర్యాదు కూడా లేదని మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ తెలిపారు. ఫిర్యాదు ఇవ్వాలని చందాదారులను బెదిరిస్తున్నారని తెలిపారు. గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఆడిటర్‌ను నియమించి రికార్డుల తనిఖీ చేపట్టారన్నారు. అంతా ఏపీలోనే అంటున్నారని.. కానీ, అడుగుతున్నది మొత్తం కంపెనీ వివరాలని తెలిపారు. 25 అంశాలపై వివరాలు అడిగారని, ఇవన్నీ బ్రాంచ్‌లకు చెందినవి కావని కంపెనీవేనన్నారు. కంపెనీ హైదరాబాద్‌లో ఉన్నందున ఈ హైకోర్టుకు పరిధి ఉంటుందని మార్గదర్శి తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మార్గదర్శిని లక్ష్యంగా చేసుకోవడానికి ఇతర చిట్‌ కంపెనీల్లో తనిఖీలు ప్రారంభించారని తెలిపారు. కోర్టు పరిధిపై సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులు ప్రస్తావించారు. మరోవైపు తన నియామకంపై జారీ చేసిన ఉత్తర్వులకు వారం గడువిస్తే కౌంటరు దాఖలు చేస్తానని ఆడిటర్‌ వేములపాటి శ్రీధర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వి.పట్టాభి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.