'ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.. ముఖ్యమంత్రికి కర్ర కాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు'

author img

By

Published : Mar 17, 2023, 10:24 AM IST

Etv Bharat

mlc results : ముఖ్యమంత్రికి కర్ర కాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించే ప్రయత్నం బెడిసికొట్టిందని, అభివృద్దే తమ నినాదం అని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు.

mlc results : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పార్టీ అధినేత చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫకీరప్పతో ఫోన్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి టీడీపీ వారిపై దాడులకు దిగిన వైఎస్సార్సీపీ శ్రేణులపై తక్షణ చర్యలకు చంద్రబాబు డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైఎస్సార్సీపీ సిద్ధమైందని ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులను చంద్రబాబు ఆదేశించారు.

ఇవి సెమీఫైనల్.. ముఖ్యమంత్రికి కర్ర కాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలు తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలు తమ పక్షానే నిలిచారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని భావించి మూడు రాజధానులంటూ మోసగించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓడిపోతే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకం అనే భావన వ్యక్తమవుతుందని వైఎస్సార్సీపీ నేతలే ప్రచారం చేశారన్నారు. అభివృద్ధే తమ నినాదం అని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు.

విశాఖలో 40వేల కోట్ల రూపాయల విలువైన భూములు వైఎస్సార్సీపీ కొల్లగొట్టిందని తాము చూపిన ఆధారాలను ప్రజలు నమ్మి ఓటు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసంతృప్తిలో ఉన్న చాలా మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. తాజా పట్టభద్రుల ఫలితాలు చూసి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటేయబోతున్నారన్నారు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలు సెమీఫైనల్ గా భావిస్తున్నామన్నారు. రేపు పులివెందులలో కూడా గెలవబోతున్నామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

టీడీపీ విజయదుందుభి.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ రోజు నుంచి టీడీపీ విజయదుందిభి మొదలైందన్న ఆయన.. ఇకమీదట కూడా ఇలానే ఉంటుందని చెప్పారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ ఈమేరకు స్పందించారు.

సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. ఉత్తరాంధ్ర జగన్ ని ఛీ కొట్టిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దూసుకుపోతుందని తెలిపారు. వైఎస్సార్సీపీ ఏ రౌండ్ లోనూ, కనీసం పోటీ ఇవ్వలేదన్న ఆయన.. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి తెలుగుదేశం 20 వేల ఆధిక్యంలో ఉందని చెప్పారు. జగన్ ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదని, రాజధాని కబుర్లు నమ్మలేదని అన్నారు. రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే ఈ నాలుగేళ్ల చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరని గుర్తించారని, అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలు వస్తున్నాయన్నారు. వైఎస్సార్సీపీ అంతానికి ఆరంభం ఇదేనని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సైకో పోవాలి - సైకిల్ రావాలి అంటూ అయ్యన్న ట్వీట్‌ చేశారు.

'జె ట్యాక్స్' వల్లే ధరల్లో ఏపీ నెంబర్1.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సామాన్యులెవ్వరూ బతికే పరిస్థితి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప ధ్వజమెత్తారు. ప్రజలు ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్న తీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనపడిందన్న ఆయన.. ధరల పెరుగుదలతో ప్రజలంతా అప్పులపాలవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపే శక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోయారంటూ చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరిగాయంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. 'జె ట్యాక్స్' వల్లే ధరల్లో ఏపీ నెంబర్1 అంటూ బ్యానర్ తో పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్ర చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.