ETV Bharat / state

చవితి ఆంక్షలు.. అమ్ముడుపోనీ వినాయక విగ్రహాలు..దిక్కుతోచని స్థితిలో తయారీదారులు

author img

By

Published : Sep 7, 2021, 10:39 PM IST

Vinayaka idol makers
వినాయక విగ్రహ తయారీదారులు

ఓ వైపు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్త పరిస్థితి చక్కబడే సరికి ఇకనైనా పరిస్థితులు చక్కబడతాయనుకున్నారు. గతేడాది చేసిన వినాయక విగ్రహాలు అమ్ముడుపోక అసలే అవస్థలు పడుతున్న తయారీదారులకు.. ఈసారి కూడా ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన మొదలైంది. ఓవైపు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. మరోవైపు భవిష్యత్​ ఏంటో అర్ధంగాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి వినాయక చవితి పండగ నిర్వహణపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని వేడుకుంటున్నారు.. లేదంటే తమకు చావే శరణ్యమంటున్నారు.

కళను నమ్ముకున్న రాజస్థాన్​ బొమ్మల తయారీ దారుల.. వేల కిలోమీటర్ల ప్రయాణించి 15 ఏళ్ల క్రితం మోపిదేవి గ్రామానికి చేరుకున్నారు. కొనేళ్లుగా సాఫీగా సాగిన వీరి జీవనంలో కొవిడ్ 19 తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించటంతో.. రెండేళ్లుగా వినాయక ప్రతిమలు ఒక్కటి కూడా అమ్ముడుపోక.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్న రాజస్థాన్​ బొమ్మల తయారీ దారులపై ప్రత్యేక కథనం..

కృష్ణాజిల్లాలోని మోపిదేవికి కొంతమంది మట్టి కళాకారులు రాజస్థాన్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చారు. మోపిదేవి గ్రామంలో స్థలం లక్ష రూపాయలకు అద్దెకు తీసుకుని అందులో షెడ్లు వేసుకుని.. వినాయక విగ్రహాలు తయారు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. సంవత్సరం పొడవునా కష్టపడి.. సుమారు రెండు వందల విగ్రహాలు తయారు చేస్తారు. వీటి తయారీకి సుమారు 20 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడతారు. విద్యుత్ ఛార్జీలు, మేటిరియల్​ కోసం అప్పులు చేసి మరి బొమ్మలు తయారు చేస్తున్నారు. వీరి పిల్లలను కూడా స్థానిక స్కూళ్లలో చదివిస్తున్నారు.

అడ్వాన్స్ సొమ్ము అయిపోయింది...

మోపిదేవిలో తయారైన బొమ్మలకు మంచి గిరాకీ ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చి విగ్రహాలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది తయారు చేసిన వినాయక విగ్రహాలు అమ్ముడుకాక.. వర్షాలకు గాలులకు షెడ్లు పడిపోయి బొమ్మలు అన్ని తడిచిపోవటం వలన లక్షల రూపాయలు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా ఉన్న విగ్రహాలు అమ్ముడుపొతే అప్పులు తీర్చవచ్చు అనుకునే సమయానికి.. వినాయక విగ్రహాలు బహిరంగ ప్రదేశాల్లో పెట్టరాదని ప్రభుత్వం ఆంక్షలు ఇవ్వటంతో ఏమి చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటున్నారని.. ఆ డబ్బులు రంగుల కోసం ఖర్చు చేశామని.. ఏమి చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు.

లక్షల్లో పెట్టుబడి..

మరోవైపు వినాయక విగ్రహాలు పెట్టేందుకు అనుమతి లేదని ముందే చెప్పి ఉంటే.. విగ్రహాల తయారీ మానుకునే వాళ్లమని గుంటూరుకు చెందిన చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారు చేసిన తర్వాత.. ప్రభుత్వం ఇప్పుడు అనుమతి లేదంటే తామంతా తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు వాపోయారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో రోడ్డుపక్కన బొమ్మలు విక్రయిస్తుంటే.. నగరపాలక సంస్థ సిబ్బంది వచ్చి పారిశుద్ధ్య ట్రాక్టర్‌లో విగ్రహాలు ఎక్కించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్రనష్టం..

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వలన బొమ్మల తయారు చేసే కుటుంబాలు నష్టపోతాయని ప్రక్క రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు పెడుతున్నారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. అర్చకులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ కొన్ని రోజుల వరకు అయినా అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండీ.. LIVE VIDEO: చేపలు పట్టేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోతున్న అతనిని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.