ETV Bharat / state

చౌక బియ్యం మార్చి.. ఏమార్చి

author img

By

Published : Oct 8, 2020, 1:51 PM IST

సామాన్యుల ఆకలిని తీర్చటం కోసం చౌక ధరకు అందిస్తున్న రేషన్​ బియ్యాం పై కోందరు దుండగులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రేషన్‌ షాపుల నుంచి దళారుల ద్వారా తిరిగి మిల్లులకు అక్కడ నుంచి చౌక దుకాణాలను చేరుతున్నాయి. ఇలా అక్రమాలకు పాల్పడుతూ..సొమ్ము చేసుకుంటున్నారు.

Ration rice
చౌక బియ్యం

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలోని పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. గత రెండురోజులుగా జరుగుతున్న తనిఖీల్లో భారీగా బియ్యం పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. రేషన్‌ షాపుల నుంచి దళారుల ద్వారా మిల్లులకు చేరుతూ తిరిగి ప్రజా పంపిణీకి బియ్యం చేరుకుంటున్నాయి. ఇలా అక్రమార్కులు భారీగా దండుకొంటున్నారు.

జిల్లాలోని 2,353 రేషన్‌ దుకాణాల ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బియ్యంతోపాటు కందిపప్పు, శనగలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది మార్చి చివరిలో కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటంతో అప్పటినుంచి ఉచిత పంపిణీ మొదలైంది. ఆ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్‌మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఎవై) పథకాన్ని ప్రారంభించి అప్పట్నుంచి ఉచితంగా రేషన్‌ కార్డులపై కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి అయిదు కిలోలు, కేజీ కందిపప్పు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అదే మొత్తంలో బియ్యంతోపాటు కిలో శనగలను పంపిణీ చేస్తున్నారు. గతంలో నెలకు ఒకసారి మాత్రమే వచ్చే రేషన్‌ను నెలలో రెండుసార్లు ఇస్తున్నారు. ఒకే నెలలో పెద్ద మొత్తంలో పేదల కుటుంబాలకు బియ్యం అందజేస్తుండటం వాటిని కొందరు తీసుకోకపోవడంతో డీలర్ల వద్ద భారీగా మిగిలిపోతున్నాయి. ఇలా మిగిలిన బియ్యం అక్రమ మార్గంలో ట్రేడింగ్‌, నాన్‌ ట్రేడింగ్‌ మిల్లులకు చేరుకుంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రేడింగ్‌ మిల్లులపై సివిల్‌ సప్లైస్‌, రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. విజయవాడ ముత్యాలంపాటు శ్రీనగర్‌ కాలనీలో ఒక రేషన్‌ దుకాణంలో దాదాపు 1200 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని బుధవారం విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.

లాక్‌డౌన్‌ నుంచి కొనసాగుతున్న దందా...

జిల్లాలో 13,37,663 కార్డుల ద్వారా 38,22,507 మందికి ఉచితంగా ప్రతినెలా రేషన్‌ పంపిణీ జరుగుతోంది. దుకాణాల్లో నెలలో పెద్దఎత్తులో మిగిలిపోతున్న బియ్యాన్ని దళారులు కిలో రూ.12 చొప్పున సేకరించి ట్రేడింగ్‌, నాన్‌ ట్రేడింగ్‌ మిల్లులకు సరఫరా చేస్తున్నారు. ఈ బియ్యాన్ని తిరిగి రీసైక్లింగ్‌(పాలిషింగ్‌) చేసి ప్రభుత్వ లెవీ ద్వారా తిరిగి సివిల్‌ సప్లయిస్‌ గోదాములకు ట్రేడింగ్‌ మిల్లుల నిర్వాహకులు సరఫరా చేస్తున్నారు. మచిలీపట్నం, మోపిదేవి తదితర ప్రాంతాల్లోని ట్రేడింగ్‌ మిల్లుల్లో రీసైక్లింగ్‌ కోసం విదేశీ పరికరాల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. లెవీ ద్వారా కిలోకు రూ.30 పొందుతున్న పలువురు వర్తకులు ఈ వ్యాపారం ద్వారా భారీగా డబ్బు దండుకొంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంతో పోల్చితే లాక్‌డౌన్‌ కాలంలో వ్యాపారం పుష్కలంగా సాగుతోంది. కొంతమంది అక్రమార్కులు జిల్లాలు కూడా దాటిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైస్‌ హబ్‌లుగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు మిల్లుల్లో బియ్యం పట్టుకున్నప్పటికీ సదరు యజమానులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే బ్లాక్‌ మార్కెట్‌ దందా సాగుతోందని పలువురు చెబుతున్నారు. దీనిపై జిల్లా ఇన్‌ఛార్జి డీఎస్‌వో రాజ్యలక్ష్మి వివరణ కోరగా... రీసైక్లింగ్‌పై పటిష్ఠ నిఘా ఉంచామని బియ్యం పట్టుకుంటే ఆయా మిల్లుల యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...నాగాలాండ్ మాజీ​ గవర్నర్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.