RTC Buses Stopped Due to Roads Damaged: నిర్వహణ లేక నిర్మానుష్యంగా మారిన రహదారి.. రోడ్ల మరమ్మతులకు నయా పైసా విడుదల చేయని జగన్ సర్కార్
Published: Sep 14, 2023, 2:14 PM


RTC Buses Stopped Due to Roads Damaged: నిర్వహణ లేక నిర్మానుష్యంగా మారిన రహదారి.. రోడ్ల మరమ్మతులకు నయా పైసా విడుదల చేయని జగన్ సర్కార్
Published: Sep 14, 2023, 2:14 PM

RTC Buses Stopped Due to Roads Damaged: గ్రామీణుల రవాణా అవసరాలు తీర్చడంలో ప్రధానమైనవి రహదారులే. గ్రామానికి రహదారి బాగుందంటే చాలు ఆర్టీసీ బస్సులు పరుగులు పెడతాయి. ప్రైవేటు వాహనాలు వాటికి పోటీ పడతాయి. రాకపోకలు పెరిగి వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఐతే రహదారి ధ్వంసం కావడంతో కృష్ణా జిల్లాలో పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించి బస్సులు తిప్పాలని ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
RTC Buses Stopped Due to Roads Damaged : దారిపొడవునా గుంతల మయమై.. చీలికలుగా మారి.. తారు రోడ్డు ఎక్కడుందో వెతుక్కోవాల్సిన స్థితిలో నిర్మానుష్యంగా కనిపిస్తోన్న ఈ రహదారిని చూడండి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజక వర్గాల్లోని పలు గ్రామాల ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా రవాణా సేవలందిస్తోన్న దారి ఇది. నాలుగేళ్ల క్రితం వరకు ఈ రహదారి వాహనాల రాకపోకలతో కళకళలాడేది. పచ్చని పంట పొలాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టేవి.
People Facing Problems Due to Worst Roads : పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నుంచి పామర్రు నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ పెదపారుపూడి మీదుగా గుడివాడకు బస్సులు తిరిగేవి. 30 కిలో మీటర్ల మేర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఈ దారిలో ప్రయాణించేందుకు విద్యార్థులు, ప్రజలు ఆసక్తి చూపేవారు. ప్రైవేటు వాహనాలు, వ్యక్తిగత వాహనాలతో రహదారి నిత్యం రద్దీగా ఉండేది. వర్షాల ధాటికి ఏర్పడ్డ చిన్నపాటి గుంతలను ఆర్అండ్బీ శాఖ అధికారులు వెంటనే పూడ్చకుండా చేతులెత్తేయడంతో నాలుగున్నర ఏళ్లలో ఈ రహదారి ఇదిగో ఇలా దారుణంగా తయారైంది.
Roads Situation in AP : జువ్వనపూడి, అప్పిగట్ల, ముదునూరు, బోళ్లపాడు, కాటూరు, గండిగుంట, తదితర గ్రామాలు విజయవాడ, ఉయ్యూరు, గుడివాడ వెళ్లాలంటే ఈ దారే దిక్కు. రహదారుల మరమ్మతులకు వైసీపీ సర్కార్ నయాపైసా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో నాలుగు సంవత్సరాలుగా రోడ్ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. తట్టెడు మట్టీ వేయకపోవడంతో చిన్నపాటి గుంతలు చెరువులుగా మారాయి. రోడ్డు పక్కన మొలిచిన చిన్నపాటి కంప చెట్లనూ తొలగించకపోవడంతో అవి క్రమంగా పెరిగి ప్రస్తుతం రెండు వైపులా విస్తరించి రోడ్డు మొత్తాన్ని మూసివేశాయి. కంప చెట్లు కమ్ముకున్న ఈ రోడ్డుపై రావాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనాలు అదుపు తప్పి పంట చేలల్లోకి దూసుకుపోతున్నాయి. గతంలో ఉయ్యూరు నుంచి గుడివాడకు ఈ మార్గం మీదుగా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించేవి. దారి వెంట కంప చెట్లు అడ్డుపడటం, దారి ధ్వంసం కావడంతో బస్సులను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన ఆర్టీసీ అధికారులు ఏడాది క్రితం నుంచి సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
ఇక ప్రైవేటు వాహనాలు, ఆటోవారూ ఈ దారికో నమస్కారం బాబూ అంటున్నారు. తప్పని సరి అయితే గ్రామస్థులు వ్యయ ప్రయాసల కోర్చి బైకుల పై మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. చిన్నపాటి చినుకులు పడితే వారి కష్టాలు అన్నీ ఇన్నీకావు. రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్నత చదువులకు బైకులపై పట్టణాలకు తీసుకువెళ్లలేని పలువురు తల్లిదండ్రులు వారి పిల్లల చదువులను ఆపి వేయించారు.
గ్రామాలకు అంబులెన్సులు రావడం లేదు. అత్యవసర వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఉద్యోగ , ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లే వారు కష్టాలు పడుతున్నారు. తమ గ్రామాలకు రోడ్డు వేసి ఆర్టీసీబస్సులు తిప్పే ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యేలను గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు కలసి వేడుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.
