ETV Bharat / state

'జగనన్నే మా భవిష్యత్'.. అట్టహాసంగా ఇంటింటికీ పోస్టర్లు.. స్టిక్కర్లు వేసిన మంత్రులు

author img

By

Published : Apr 7, 2023, 5:12 PM IST

Updated : Apr 8, 2023, 6:23 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Jaganan is our future : 'జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్'.. పేరిట చేపట్టిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పలకరించారు. పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన స్టిక్కర్లను లబ్ధిదారుల ఇళ్లకు, సెల్​ఫోన్లకు అంటించారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయమని ప్రకటించారు.

Jaganan is our future : ఎన్నికలు ఎప్పుడు జరిగినా 175 స్థానాల్లో వైఎస్​ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో సిద్ధంగా ఉన్నారని.. ఏ ప్రతిపక్షమైనా 175 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీ చేయించగలదా అని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సురేష్ మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటామని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. అనంతరం పట్టణంలోని ఆర్చి బజారులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యాన... సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా.. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ ప్రభుత్వం గృహ సారథులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో రాజకీయాలు, కుల, మతాలకతీతంగా పని చేస్తున్నామని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తమను అభాసు పాలు చేయాలని ఎంత ప్రయత్నించినా ప్రజలు తమవెంటే ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇంటింటికి అతికించబోయే స్టిక్కర్లను, కరపత్రాల బ్యాగులను గృహసారథులకు పంపిణీ చేశారు.

అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్.. అనకాపల్లి మండలం తుమ్మపాల పరిధిలోని మూడవ సచివాలయంలో జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు ఇంటింటికీ వెళ్లి.. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వివరిస్తూ ఐదు ప్రశ్నలతో కూడిన సమాధానాలను రాబట్టారు. ఇంటింటికీ జగనన్న మా భవిష్యత్తు పోస్టర్టను అంటించారు. తుమ్మపాల్లో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు.

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా... రాష్ట్రంలోని కోటీ 60 లక్షల కుటుంబాలకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేరువ చేయడానికి విస్తృత కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. కడప నగరంలోని గౌస్ నగర్ నుంచి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కుటుంబాల ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను అంజద్ బాషా వివరించారు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి వచ్చిన పథకాలను అడిగి తెలుసుకున్నారు. జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్ ను ఇంటి తలుపునకు అంటించారు. దాంతోపాటు మహిళ మొబైల్ ఫోన్ కు కూడా జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ అంటించారు. ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇస్తూ నగరంలో కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఇవీ చదవండి :

Last Updated :Apr 8, 2023, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.