ETV Bharat / state

బీజేపీకు దడ పుట్టిస్తాం.. భవిష్యత్తులో ఆ పార్టీకి మరిన్ని కష్టాలు'

author img

By

Published : Dec 11, 2022, 9:23 AM IST

బీజేపీకు దడ పుట్టిస్తాం..
బీజేపీకు దడ పుట్టిస్తాం..

‍‌CM KCR comments on BRS: భారత్‌ రాష్ట్ర సమితికి జాతీయ పార్టీగా బంగారు భవిష్యత్తు ఉంటుందని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీకి వణుకు పుట్టిస్తామన్నారు. రానున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కీలకంగా మారతామని తెలిపారు. మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వ ఎజెండా ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. గవర్నర్‌ తమిళిసై తీరుపై కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

‍‌CM KCR comments on BRS: సుముహూర్తంలో భారత్‌ రాష్ట్ర సమితి అవతరించిందని.. దేశ రాజకీయాల్లో బీఆర్​ఎస్​ సంచలనం సృష్టించడం ఖాయమని తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కేసీఆర్‌ మంత్రులతో అన్నట్లు తెలిసింది. ఆవిర్భావ వేడుకలు ముగిసిన వెంటనే దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతాయని చెప్పారు. దేశంలో రాజకీయ శూన్యతను బీఆర్​ఎస్​ మాత్రమే పూడ్చగలదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైందని కేసీఆర్‌ వివరించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో.. జేడీఎస్​తో కలిసి పోటీ చేస్తామని.. మాజీ సీఎం కుమారస్వామికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.

కర్ణాటకలో దాదాపు పది జిల్లాల్లో బీఆర్​ఎస్​ ప్రభావం ఉంటుందని.. ఊహించని విధంగా బీఆర్​ఎస్​ స్థానాలు వస్తాయని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఏర్పాటులోనూ బీఆర్​ఎస్​ పాత్ర ఉంటుందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. ఇటీవలి ఎన్నికల్లో గుజరాత్‌లో మాత్రమే బీజేపీకు మంచి ఫలితాలు వచ్చాయని.. హిమాచల్‌ప్రదేశ్‌ను కోల్పోయిందన్నారు. ఉప ఎన్నికల్లోనూ బీజేపీకు చేదు ఫలితాలే వచ్చాయని చెప్పారు. మున్ముందు బీజేపీకు మరిన్ని కష్టాలు వస్తాయని.. కర్ణాటకపైనా ఆ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ నిర్వాకాలపై మరిన్ని నిజాలు బయటికి వస్తాయని.. బీఆర్​ఎస్​ ఆవిర్భావంతో కాంగ్రెస్‌లో కలవరం ఏర్పడిందన్నారు.

ఈ నెల 14న దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని.. మంత్రులంతా.. ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలని ఆదేశించారు. 14 తర్వాత పార్టీపరంగా జాతీయ అంశాలపై దృష్టి సారిద్దామని చెప్పారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను దిల్లీలో ఎండగడతామన్నారు. దిల్లీ పర్యటన ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలపై నిర్ణయం తీసుకుందామని మంత్రులతో సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.

గవర్నర్​ తీరుపై అసంతృప్తి: తెలంగాణ అభివృద్ధి, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఏడు బిల్లులను గవర్నర్‌ పెండింగులో పెట్టడంపై సీఎం, మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో 1066 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, దాంతో పాటు మరో వెయ్యి సహాయ ఆచార్యుల పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నామని, గవర్నర్‌ ఈ బిల్లులను పెండింగులో పెట్టడంతో నియామకాలు నిలిచిపోయాయని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. బిల్లుల ఆమోదానికి అనుసరించాల్సిన కార్యాచరణపై నిపుణులతో చర్చించాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది. కేరళ, తమిళనాడు మాదిరే విశ్వవిద్యాలయాల ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించాలని ఈ సందర్భంగా కొందరు మంత్రులు కోరినట్లు తెలిసింది. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.

బీజేపీకు దడ పుట్టిస్తాం..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.