ఇంటిల్లిపాదిని అలరించే.. టీవీ పుట్టుక కథ తెలుసా?

author img

By

Published : Nov 21, 2022, 5:30 PM IST

టీవీ పుట్టుక కథ

World Television Day: ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు పుట్టుక ఓ విప్లవాత్మక మార్పే.. అవి మానవుడి జీవితంలో సృష్టించిన అద్భతాలు అన్ని ఇన్ని కావు. టెలిఫోన్‌, విద్యుత్‌ బల్బ్‌, టీవీ ఈ వస్తువులు ఎన్నో అద్భుతాలకు నెలవు. కానీ, ఇందులో టీవీకున్న ప్రత్యేకతే వేరు. నేడు మనమంతా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగే వింతల్ని, విశేషాల్ని తెలుసుకోవడానికి చూసే ఈ టీవీ. మానవుడి జీవితంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్లో ఒకటి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో తెలుసుకునే ఈ సాధనంతో సమాజంలో కూడా పెనుమార్పులే వచ్చాయి. అలాంటి టీవీ పుట్టుకకు కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది. వస్తువును కనిపెట్టడమే కాదు.. దానిలో ఎప్పుటికప్పుడు మార్పులు కూడా అవసరమే. మెుదట బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీతో మెుదలై కలర్‌ టీవీ, ప్రస్తుతం 4కే అంటూ ఎన్నో మార్పులు వచ్చాయి. మరి, అలాంటి టీవీకి సంబంధించిన ప్రత్యేకతేంటో ఇప్పుడు చూద్దాం.

World Television Day: మనం చూస్తున్న ఈ టీవీకి శతాబ్దాల చరిత్ర ఉంది. మెుదట విద్యుత్ సహాయంతో వార్తల్ని పంపే టెలిగ్రాఫ్ కనుకున్న రోజుల్లోనే బొమ్మల్ని కూడా తెరపై చూపించవచ్చని అలెగ్జాండర్ బెయిన్ అనే స్కాట్‍లాండ్ శాస్త్రవేత్త ప్రయత్నించాడు. ఆ తర్వాత ఇదే క్రమంలో పలువురు శాస్త్రవేత్తలు స్కానింగ్‌ విధానము, నిప్కో డిస్క్‌ విద్యుత్‌ దూరదర్శిని, ఫొటో ఎలక్ట్రిక్‌ సెల్‌ నిర్మాణములపై విస్తృత పరిశోధనలు జరిపారు. ఈ పరిణామ క్రమంలోనే.. టెలివిజన్ నిర్మాణంకు సంబంధించిన అనేక సాంకేతిక సమస్యల్ని చాలా వరకు పరిష్కరించాడు జాన్ లోగీ బెయిర్డ్.

ఈ టీవీ కోసం బెయిర్డ్ ఎదుర్కొన్న అవాంతరాలు అన్ని ఇన్నీ కావు. ఆయన తన పరిశోధనలకు ఒక పాత ఎలక్ట్రిక్ మోటారు, కొన్ని కటకాలు, మిలిటరీ స్టోర్‌లో మూల పడేసిన పాత వైర్‍లెస్ టెలిగ్రాఫ్ టార్చ్, బ్యాటరీలు, సూదులు, కొయ్యముక్కలు, కాస్త లక్క, దారాలు, జిగురు ఇలా ఎన్నో వస్తువులను టెలివిజన్‌ నిర్మాణంలో భాగంగా ఆయన వినియోగించాడు. అలా తన రెండేళ్ల నిరంతర కృషి ఫలితంతో కొన్ని ఆకారాల్ని సుమారు మూడు మీటర్ల దూరం దాకా తెరపై ప్రసారం చేయడంలో బెయిర్డ్ విజయం సాధించాడు.

ఇది ఇలా ఉండగా అమెరికాలో ఎలక్ట్రానిక్స్ పద్ధతిలో టెలివిజన్ రూపొందించే కృషి ముమ్మరంగా జరిగింది. 1910 నుంచి కాథోడ్ రే ట్యూబ్‌ను రిసీవర్‌గా ఉపయోగించి టీవీకి సంబంధించిన ప్రయోగాలు చేశారు. ఫలితంగా 1928లో ఐకనోస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశారు. దృశ్యాల్ని అతి త్వరగాను, సమర్థవంతంగానూ ప్రసారం చేయగల విప్లవాత్మక సాధనంగా ఇది తయారైంది. అప్పటి నుంచి టెలివిజన్ కెమెరాలో ఒక ప్రధాన భాగంగా ఇది ఉంటోంది.

ప్రసారం చేయాల్సిన దృశ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిపై ఓ క్రమ పద్ధతిలో ఎలక్ట్రాన్‌ల సముదాయాన్ని సెకనుకు 24 సార్లు పడేలా చేశారు. అదే 24 ఫ్రేమ్స్‌ అన్నమాట. ప్రసారణిలో ఉండే కెమెరాలలో ఎంత వేగంతో ఎలక్ట్రాన్‌ల సముదాయం కదులుతుందో.. అదే వేగంతో రిసీవర్‌లో కూడా కదిలినప్పుడు దృశ్యం తెరమీద పడుతుంది. మెుదటిసారి తెలుపు, నలుపు రంగుల్లో నిరంతర టెలివిజన్ ప్రసారాలు 1936లో లండన్‌లో ప్రారంభమయ్యాయి.

మరో విప్లవాత్మకమైన మార్పు రంగుల టీవీ: ఆ తర్వాత 1960లలో స్క్రీన్‌లు చతురస్రాకారంలో ఉంటూ సౌండ్‌ వచ్చేలా స్పీకర్ మెరుగుపరిచారు. అలా దృశ్యం, ధ్వని ఉండేలా రూపకల్పన చేశారు. అలా టీవీ విశ్వరూపం ధరించి ప్రపంచమంతటా వ్యాపించటం మొదలైంది. టీవీలో వచ్చిన మరో విప్లవాత్మకమైన మార్పు రంగుల టీవీ. టెలివిజన్ కార్యక్రమాల్ని రంగుల్లో ప్రసారం చేయటానికి వీలవుతుందని ఆటోవాన్ బ్రాంక్ అనే జర్మనీ శాస్త్రవేత్త నిరూపించాడు.

టీవీ ప్రసారాల్లో ఇది ఓ విప్లవాత్మక పరిణామం: కానీ, తొలి దశలో రంగుల టెలివిజన్‌ కోసం వినియోగించే రిసీవర్‌ల ధర చాలా ఎక్కువగా ఉండేది. అలా ఎలక్ట్రానిక్స్ విభాగంలో జరిగిన విస్తృత పరిశోధనల కారణంగా రంగుల టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. కలర్‌ టీవీ ప్రసారాల్లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగుల్లో స్కానింగ్ జరుగుతుంది. ఈ మూడు రకాల సిగ్నల్స్ రిసీవర్‌కి ప్రసారం చేస్తారు. అక్కడ జరిగే రంగుల సమ్మేళనం ఫలితంగా రంగు బొమ్మలు తెరపై ఏర్పడతాయి. నలుపు-తెలుపు టెలివిజన్ నిర్వహణ కంటే రంగుల టెలివిజన్ నిర్వహణ అధిక వ్యయమైన్నప్పటికీ రాను రాను దాని వాడకం పెరిగింది. దీంతో టీవీ ప్రసారాల్లో ఇది ఓ విప్లవాత్మక పరిణామంగా మారింది.

టెలివిజన్‌ తయారీలో 2010లో పెద్ద మార్పు: మెుదట పెద్ద పెద్ద పరిమాణాల్లో ఉండే టీవీలు కాస్తా రాను రాను చిన్నగా మారడం మెుదలయ్యాయి. అందులో కూడా ఛానల్‌ ట్యూనింగ్, సౌండ్‌ పెంచుకునేలా వెసులుబాటు చేశారు. 1990ల కొచ్చే సారికి మరింతగా అభివృద్ధి చెంది నాణ్యత కలిగిన దృశ్యాలను ప్రేక్షకులకు అందించేలా సీఆర్‌టీ డిస్‌ప్లేలలో మార్పులు తెచ్చారు. 1995లో మెుత్తం సన్నగా ఉంటూ స్క్రిన్‌ ముందు బటన్లు ఉన్న టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్న టెలివిజన్‌ తయారీలో 2010లో పెద్ద మార్పే వచ్చింది.

ఒకప్పుడు టీవీ ఛానళ్లు యాంటెనాల ద్వారా ప్రసారాలు: పెద్ద టీవీలు వచ్చాయి.. కాకపోతే ఫ్లాట్‌ స్క్రీన్‌ రావడం మెుదలయ్యాయి. అలా రానురాను ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, కరువుడ్‌ టీవీలు వచ్చాయి. అసలు ఇప్పుడైతే ఎవరి ఇంట్లో చూసినా కానీ, 40 ఇంచెస్‌, 50 ఇంచెస్‌ ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు కన్పిస్తున్నాయి. ఇందులోనూ పుల్‌ హెచ్‌డీ, 4కే అంటూ విభాగాలు కూడా ఉన్నాయి. మన దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంత నాణ్యమైన దృశ్యం చూసే టీవీలు వచ్చాయి. ఒకప్పుడు టీవీ ఛానళ్లు యాంటెనాల ద్వారా తమ ప్రసారాలను అందించేవి. ప్రారంభంలో ఒక పెద్ద యాంటెనా ఊరికి ఒకటి ఉండేది. అక్కడి నుంచి ఒకవైర్‌ ద్వారా ఊర్లోని వారందరికీ వైర్‌ ద్వారా కనెక్షన్‌ ఇచ్చేవారు.

క్రమ క్రమంగా యాంటెనా పరిమాణం చిన్నఆంటెనగా మారిపోయి ఇంటికి ఒకటి ఏర్పరుచుకున్నారు. అదే డీటీహెచ్ పరిజ్ఞానం. దాంతో డైరెక్ట్‌ శాటిలైట్‌ ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడైతే ఇంటర్నెట్‌ ఫైబర్ ద్వారా ప్రసారాలు జరుగుతున్నాయి. ఇంకాస్తా మాట్లాడుకుంటే వీటి స్థానాన్ని ఓటీటీలు భర్తీ చేశాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత్‌లో ఓటీటీలదే హవా నడుస్తోంది. వీరు యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు టీవీ ఛానళ్లను కూడా అందిస్తున్నారు. దీంతో చాలా మంది ప్రజలు ఈ ఓటీటీల వైపు మెుగ్గుచూపుతున్నారు.

భారత్‌లోకి టెలివిజన్‌ రాక: 1950లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థి శివకుమారన్ చెన్నైలోని టేనాంపేట్ ప్రాంతంలో తొలిసారి ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. అది కూడా కొన్ని అక్షరాలను స్కాన్ చేసి క్యాథోడ్ రే ట్యూబ్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. కానీ, భారత్‌లో మొట్టమొదటి టీవీ ప్రసారం 1951లో జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఏర్పాటు చేశారు. అలా భారత్‌లో టీవీ అడుగుపెట్టింది.

అయితే, సాంకేతికతలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు నూతన టీవీలు రావడం మెుదలయ్యాయి. ఐతే, ప్రసారాల కోసం మాత్రం 1959 సెప్టెంబర్ 15వ తేదీన దిల్లీలో దూరదర్శన్ ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతంగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారత్‌... అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సాయంతో ప్రసారాలు చేసేది. తొలుత ఆల్ ఇండియా రేడియో 1965లో రోజువారీ ప్రసారాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలను ప్రధానంగా దూరదర్శన్ నిర్మించేది. ఇందులో రోజుకు రెండుసార్లు టెలికాస్ట్ అయ్యేది.

ఇప్పుడు ఇంటర్నెట్‌ సాయంతో ప్రసారాలు చూసే అవకాశం: టీవీలు అంటే మనకు నచ్చిన ప్రసారాలను అందించే ఒక సాధనం. అయితే, ఈ సాధనంకు ప్రత్యామ్నాయంగా చాలా వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా ఛానల్‌ చూడాలంటే కేవలం టీవీలలో మాత్రమే చూడాలి. కానీ, రోజురోజుకు పెరిగిపోతున్న సాంకేతికత వల్ల టీవీలు చూసే వారు తగ్గారు. ఎందుకంటే చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే ప్రపంచంలోని అన్ని రకాల ఛానళ్లు చూసే వెసులుబాటు వచ్చింది. ఇవి కాదనట్టు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల పుణ్యామా అంటూ ఎక్కడ కూర్చోనైనా ఇప్పుడు ఇంటర్నెట్‌ సాయంతో ప్రసారాలు చూసే అవకాశం లభించింది.

టీవీలలో కూడా స్మార్ట్‌ టీవీలు వచ్చాయి: ఇది కూడా టీవీ తెరల ఉండటంతో ఒక హెడ్‌ఫోన్‌ పెట్టుకుని చక్కగా చూసుకోవచ్చు. ఇది ఇలానే ఉంటే టీవీలు చూసే వారు తగ్గిపోతారనే చెప్పవచ్చు. కానీ, అది అనుకున్నంత సులమేమీ కాదు. ఎందుకంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో టీవీలలో కూడా స్మార్ట్‌ టీవీలు వచ్చాయి. అందులోనూ థియేటర్‌ అనుభవానిచ్చే పెద్ద పెద్ద తెరలు అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మంది ఖర్చు ఎక్కువైనా పర్వాలేదని పెద్ద టీవీలను కొనుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పెద్ద టీవీలతో ఇంటిల్లిపాది కొత్తగా విడుదలైన సినిమాలను ఇంట్లోనే కూర్చోని చూసే వెసులుబాటు ఉండటంతో చాలామంది టీవీలు కొనడానికే మెుగ్గు చూపుతున్నారు.

నేడు వరల్డ్‌ టెలివిజన్‌ డే: కొవిడ్‌ మహమ్మారి వల్ల రెండేళ్లు టీవీ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అదే సమయంలో టీవీ కొనుగోళ్లు కూడా పెరిగాయి. బ్రిటీష్‌ వారు మనల్ని పాలించే రోజుల్లోనే భారత్‌లోకి టీవీ అడుగుపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది ప్రజలు దీనిని ఆదరిస్తున్నారు. తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి సంపన్న కుటుంబాల వరకు టీవీ లేని ఇళ్లు ఉండదు. ఎందుకంటే అది మానవ జీవితంతో ఎడతెగలేని బంధం ఏర్పరుచుకుంది. అందుకే ప్రపంచం కూడా టీవీని మర్చిపోవద్దని చెప్పి ఐక్యరాజ్య సమితి 1996లో వరల్డ్‌ టెలివిజన్‌ డేను గుర్తించింది. ప్రతి ఏటా నవంబర్‌ 21న దీనిని నిర్వహిస్తున్నారు.

టీవీ పుట్టుక కథ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.