ETV Bharat / state

Gandhi satram: గాంధీ సత్రాన్నీ వదలని మంత్రి.. 33 ఏళ్లకు లీజుకివ్వాలంటూ ఒత్తిళ్లు

author img

By

Published : Jul 30, 2023, 10:29 AM IST

Gandhi satram in Tuni: దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ఖాళీ స్థలాన్ని గరిష్టంగా 11 ఏళ్ల వరకే లీజుకు ఇవ్వాలి. అందులో కాంక్రీట్ శ్లాబ్ వేసేలా శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. కానీ ఓ మంత్రి గాంధీ సత్రానికి చెందిన స్థలాన్ని.. 33 ఏళ్లకు లీజుకు ఇచ్చిదీరాల్సిందేనని మొండిపట్టు పడుతున్నట్లు తెలిసింది. కుదరదు మహా ప్రభో అని అధికారులు చెబుతున్నా.. తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిలోని గాంధీ సత్రం స్థలం పరిస్థితి..

Gandhi satram in Tuni
గాంధీ సత్రాన్నీ వదలని మంత్రి.. 33 ఏళ్లకు లీజుకివ్వాలంటూ ఒత్తిళ్లు

గాంధీ సత్రాన్నీ వదలని మంత్రి.. 33 ఏళ్లకు లీజుకివ్వాలంటూ ఒత్తిళ్లు

Gandhi satram in Tuni: అధికార పార్టీ నాయకులు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ వాలిపోయి.. దానిని కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదు.. అందులోను బాగా ధర పలికే స్థలాల విషయంలో అయితే అస్సలు తగ్గడం లేదు.. తాజాగా ఆ కీచకులు కాకినాడ జిల్లాలో ఉన్న గాంధీ సత్రాన్నీ వదలడం లేదు. తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ వద్ద దేవాదాయశాఖకు చెందిన గాంధీ సత్రం ఉంది. వ్యాపార కేంద్రమైన తునికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సత్రంలో ఉండి, వ్యాపార కార్యకలాపాలు చూసుకొని వెళ్లడం చేసేవారు.

1942- 43లో గాంధీజీ తునికి వచ్చినప్పుడు ఈ సత్రంలోనే బస చేశారు. అప్పటి నుంచి దీనికి గాంధీ సత్రంగా పేరు వచ్చింది. తర్వాత దీనిని వాకర్స్ సంఘం కొనుగోలు చేసి చాలా కాలం నిర్వహించింది. కొన్నేళ్లకు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. సత్రం 750 చదరపు గజాల్లో ఉండగా.. దీనికి సమీపంలో ఓ కళ్యాణ మండపం, 40 వరకు దుకాణాలు ఉన్నాయి. అయితే ఈ సత్రం శిథిలమై పోవడంతో దాదాపు పదేళ్లుగా వినియోగించడం లేదు. నాలుగు నెల క్రితం అధికారులు సత్రాన్ని కూల్చి వేసి, స్థలం ఖాళీగా ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ చదరపు గజం లక్షకు పైగానే పలుకుతోంది. ఈ స్థలం మార్కెట్ విలువ 7.5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

తునిలో ప్రధాన మార్కెట్ ప్రాంతం కావడంతో గాంధీ సత్రం స్థలానికి అధిక డిమాండ్ ఉంది. దీంతో ఓ మంత్రి కళ్లు దీనిపై పడినట్టు సమాచారం. ఎలాగైనా స్థలాన్ని దీర్ఘకాలిక లీజుపేరిట తీసుకొని.. బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయం నిర్మించుకోవాలని చూస్తున్నారు. అందుకే స్థలాన్ని 33 ఏళ్లకు లీజుకు అనుమతించాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు కొన్ని నెలల కిందట ప్రతిపాదన పంపారు. కొంత కాలం కిందట జరిగిన ధార్మిక పరిషత్ సమావేశంలో.. గాంధీ సత్రం స్థలం లీజు అంశంపై చర్చ జరిగింది. ఇలా 33 ఏళ్లకు లీజుకు ఇవ్వొద్దంటూ మెజార్టీ సభ్యులు నిర్ణయం తీసుకొని.. 11 ఏళ్లకు లీజుకిచ్చేలా అంగీకారం తెలిపారు. ఈ మేరకు అక్కడి దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు పంపారు.

కానీ ఆ మంత్రి మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలిసింది. 33 ఏళ్లకు లీజుకిచ్చేలా సీఎం కార్యాలయం నుంచి అయినా ఆదేశాలు తీసుకొచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తునిలోని దేవాదాయ అధికారులు సైతం ఈ స్థలాన్ని 11 ఏళ్లకు లీజుకు వేలం నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నట్టు సమాచారం. 33 ఏళ్ల లీజు పేరిట దీనిని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.