ETV Bharat / state

"ఎక్కడ ఆపారో.. అక్కడి నుంచే మళ్లీ నా పాదయాత్ర"

author img

By

Published : Jan 24, 2023, 5:32 PM IST

sharmila padayatra
sharmila padayatra

YS Sharmila Padayatra News : ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎంత ఒత్తిడి తెచ్చినా.. తెలంగాణలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈనెల 28 నుంచి మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. పోలీసులు అనుమతివ్వకపోయినా.. ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మొదలెడతానని తెలిపారు.

YS Sharmila Padayatra News : తెలంగాణలో ఈనెల 28న పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తానని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు. ఎక్కడ పాదయాత్రను ఆపారో అక్కడి నుంచే కొనసాగిస్తానని చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిడులు తెచ్చినా 3,500 కి.మీల పాదయాత్ర పూర్తి చేశానని వెల్లడించారు.

"ఎక్కడ ఆపారో.. అక్కడి నుంచే మళ్లీ నా పాదయాత్ర ప్రారంభం"

"బీజేపీ మతతత్వ పార్టీ.. దాంతో మాకు సంబంధం లేదు. కేసీఆర్‌కు రాజ్యాంగంపై, మహిళలపై గౌరవం ఉందా? గవర్నర్ ప్రమాణం చేయిస్తేనే కేసీఆర్‌ సీఎం అయ్యారు. నాకు భయపడే కేసీఆర్‌ ఖమ్మంలో సభ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేను పాలేరు నుంచే పోటీ చేస్తాను." - వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు

ponguleti meets YS Sharmila : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ..వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకిచ్చిన మాట తప్పారని.. ఇన్నేళ్లు ఆయన మాటకు కట్టుబడి ఉన్నానని పొంగులేటి అన్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్​గానైనా పోటీ చేయాలని ఎంతోమంది కోరినా తాను నిరాకరించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలతో పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అనేక కారణాలు చూపుతూ తన ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా మరో పార్టీకి చెందిన వ్యక్తిని పోటీలో నిలిపారని గుర్తు చేసిన ఆయన.. నాలుగేళ్లుగా తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు.

నాలుగేళ్లుగా తనకు ఏ పదవీ ఇవ్వకపోయినా ఆత్మగౌరవంతో ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నానని పొంగులేటి పేర్కొన్నారు. కష్టాలను ఎదుర్కొంటూ తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇల్లందు ఆత్మీయ సమ్మేళనానికి రాకుండా అభిమానులకు అనేక అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన ఆయన.. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఏ అధికారి కానీ, ప్రజా ప్రతినిధి కానీ అభిమానులను ఇబ్బందులు పెడితే శీనన్న ప్రత్యక్షమవుతాడని హెచ్చరించారు. పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుందన్నది వాస్తవమని.. ఎలాంటి అడ్డంకులు దీని ముందు చెల్లవని వ్యాఖ్యానించారు.

రాబోయే కురుక్షేత్రంలో తాను కచ్చితంగా యుద్ధంలో పాల్గొనబోతున్నానని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ఏ పదవిలో లేకపోయినా.. ప్రజలతోనే మమేకమవుతూ వచ్చానని తెలిపారు. జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళ్తానని పేర్కొన్నారు. "రాజకీయ నాయకుడు ప్రజల దీవెనలు, అభిమానులు పొందిన నాడే రాజకీయాల్లో రాణిస్తాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళ్తాను. రాబోయే ఎన్నికల్లో, కురుక్షేత్రంలో కచ్చితంగా యుద్ధంలో పాల్గొంటా అని ప్రకటించారు.

వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించాలి: మాజీ మంత్రి వైఎస్​ ‍‌వివేకానందరెడ్డి కేసు విచారణ త్వరగా పూర్తి చేసి, దోషులను శిక్షించాలని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల సీబీఐని కోరారు. విచారణ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ జాప్యం కావడానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉందా అనే ప్రశ్నకు ఉండకూడదు అంటూ జవాబిచ్చారు. వై.ఎస్.వివేకానందరెడ్డి గొప్ప నాయకుడని షర్మిల అన్నారు. వివేకాను అతి దారుణంగా హత్య చేశారని .. కేసు దర్యాప్తు ఇన్నేళ్లు చేస్తే వ్యవస్థపై, సీబీఐపై ప్రజలకు నమ్మకం ఉండదని తెలిపారు. ఇప్పటికైనా వివేకా హత్య కేసును తొందరగా తేల్చండని చెప్పారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.