ETV Bharat / state

YSRCP Attacks: నన్ను ఎమైనా అంటే నా అభిమానులకు బీపీ పెరుగుతుంది.. 'వైసీపీ దాడులపై' జగన్​తీరు

author img

By

Published : Jun 23, 2023, 8:19 AM IST

YCP leaders anarchists: అధికారం, అరాచకం కలగలిస్తే నేరగాళ్లు ఎంతలా పేట్రేగిపోతారనేదానికి ఒకప్పుడు.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు ఉదాహరణగా ఉండేవి. వాటిని తలదన్నేలా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లుగా అధికారపార్టీయే అరాచకం సృష్టిస్తోంది. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, భూకబ్జాలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, ఆత్మహత్యలకు పాల్పడేలా వేధింపులు.. ఇలా రాష్ట్రంలో ఏ నేరాల్లో చూసినా వైఎస్సార్​సీపీ నాయకులదే ప్రధానపాత్ర. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు రెచ్చిపోతున్నారు. వీరికి ప్రభుత్వమే వెన్నుదన్నుగా ఉంటోంది. వాటి ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత అరాచకం, ప్రభుత్వ ప్రాయోజిత నేరాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.

YCP Attacks
నన్ను ఎమైనా అంటే నా అభిమానులకు బీపీ పెరుగుతుంది.. 'వైసీపీ దాడులపై' జగన్​తీరు

YSRCP leaders anarchists: చూశారుగా.. వైఎస్సార్​ సీపీ నాయకులు యథేచ్ఛగా చెలరేగిపోతూ.. దాడులు, నేరాలకు తెగబడుతుంటే ఖండించడం పోయి.. తనను తిడితే అభిమానులకు బీపీ పెరుగుతుందంటూ వారి దాడులను సమర్థించుకున్నారు కూడా. అందుకే వీటన్నింటికీ ముఖ్యమంత్రినే వేలెత్తిచూపాలని ప్రతిపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణపై జిల్లా ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించిన దాఖలాలే లేవు.

చట్టం ముందు అందరూ సమానులేనని.. అధికారపార్టీ నాయకులు తప్పుచేసినా వారిపై చర్యలు తీసుకోవాలని ఏనాడూ చెప్పలేదు. పైగా అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు పలికేలా పోలీసు వ్యవస్థను మార్చేశారు. జనాల్ని భయభ్రాంతులకు గురిచేయటం.. తద్వారా వారు ఏం చేసినా మౌనంగా పడుండేలా చేయటమే వీటి వెనక ప్రధాన ఉద్దేశం అని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిల ప్రమేయం గురించి వాస్తవాలు వెలికి తీస్తున్నకొద్దీ సీబీఐ అధికారులను జగన్‌ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. ఏకంగా దర్యాప్తు అధికారిపైనే కేసు నమోదుచేసింది. అనేక ఆటంకాలు సృష్టించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే సీబీఐపైనే ఆరోపణలు చేశారు.

ALSO READ: రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. కార్యకర్తపై దాడి.. వీడియో వైరల్​

హత్యలు చేసిన వారికి ప్రోత్సాహమా?.. తనవద్ద డ్రైవరుగా పనిచేసే దళిత యువకుడిని చంపేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు.. ఆ మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఘటననే విశ్లేషిస్తే.. అధికారం అండ ఉందన్న ధైర్యం లేకపోతే ఆయన అంతలా బరితెగించగలిగేవారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆయన బెయిలుపై బయటకొచ్చినప్పుడు వైఎస్సార్​సీపీ శ్రేణులు భారీ ర్యాలీతో ఊరేగించాయి. తాజాగా రంపచోడవరంలో నిర్వహించిన సభలో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా పాల్గొని మాట్లాడారు. ఇది అసాంఘికశక్తులకు దన్నుగా నిలవటం కాకపోతే మరేంటి?

పొన్నూరుకు చెందిన దళితుడు అంజి బర్నబాస్‌ను గతేడాది కిడ్నాప్‌ చేసి చంపేశారు. తన భర్తను వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే హత్య చేశారంటూ వారి పేర్లతో బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే.. ఆధారాలు లేవంటూ పక్కదారి పట్టించారు. ఆ తర్వాత ఆమె కూడా నోరు విప్పలేని పరిస్థితి కల్పించారు. ఆరోపణలున్నవారిని కనీసం నిందితులుగా కూడా చేర్చలేదంటే వారి నేరాల్ని ప్రభుత్వం ప్రోత్సహించడం కాదా?

ALSO READ: జగన్ ప్రోత్సాహంతోనే తిక్కారెడ్డిపై హత్యాయత్నం.. తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడానికి కర్నూలు వెళ్లిన సీబీఐ అధికారులను అవినాష్‌ బస చేసిన ఆసుపత్రి దరిదాపుల్లోకి కూడా రానీయకుండా అడ్డుకునేందుకు అల్లరి మూకలు నాలుగైదు రోజులు అక్కడే మోహరించాయి. వైఎస్సార్​సీపీ నాయకులే దీనికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారు. పోలీసులు వారికి సహాయ సహకారాలు అందించారు. హత్య కేసుల్లో అభియోగాలు ఉన్నవారినే ఇంతలా వెనకేసుకు రావటం ఏంటి? జగన్‌ ప్రభుత్వమే రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తోందనడానికి వీటి కంటే తిరుగులేని రుజువులు ఏముంటాయి?

ALSO READ: ఇంకా ఆరని మాచర్ల విధ్వంసం మంటలు.. నివురుగప్పిన నిప్పులా పల్నాడు..

దాడి చేస్తే పదవి ఇవ్వాల్సిందే..

ప్రపంచంలో ఎక్కడైనా నేరాలకు పాల్పడ్డవారిని అరెస్టుచేసి జైల్లో పెడతారు. శిక్షలు పడేలా చూస్తారు. మరీ రెచ్చిపోతే పీడీ చట్టం ప్రయోగించి నెలల తరబడి జైలు నుంచి బయటకు రాకుండా నిర్బంధిస్తారు. అప్పుడే వారికి భయం ఉంటుంది. కానీ జగన్‌ ప్రభుత్వం తీరే వేరు. నేరాలు, దాడులకు పాల్పడ్డవారికి పదవులతో పట్టం కడుతుంది.

  • పెడన ఎమ్మెల్యేగా ఉంటూ తన అనుచరులతో కలిసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి కర్రలు, రాళ్లతో దాడిచేసిన జోగి రమేష్‌కు ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారు.
  • మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పార్టీ పరిశీలకులుగా వెళ్లిన టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్న కారును వెంబడించి.. వారిపై భారీ దుడ్డుకర్రతో దాడికి పాల్పడ్డ తురక కిషోర్‌కు మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి లభించింది.
  • పంచాయతీ ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడి స్వగ్రామమైన నిమ్మాడకు దండయాత్రగా వెళ్లి అక్కడ ఉద్రిక్తత సృష్టించిన వైఎస్సార్​సీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ తర్వాత వారం, పది రోజుల్లోనే MLC పదవి ఇచ్చారు.
  • టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఇల్లు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిచేసిన మహిళకు దుర్గగుడి పాలకమండలి సభ్యురాలిగా పదవి కట్టబెట్టారు. ప్రభుత్వమే ఈ అరాచక సంస్కృతిని ప్రోత్సహిస్తోందనేందుకు ఇంతకంటే తిరుగులేని తార్కాణాలు ఏముంటాయి?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.