ETV Bharat / crime

డ్రైవర్​ హత్య కేసు... పోస్ట్​మార్టం నివేదికకు పోలీసుల వాదనకు కుదరని పొంతన

author img

By

Published : Jun 12, 2022, 10:25 AM IST

MLC EX DRIVER POSTMORTEM REPORT: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో పోలీసులు కట్టుకథ అల్లారా? పోస్టుమార్టం నివేదిక.. ఔననే అంటోంది. డ్రైవర్‌ సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించేందుకు.. మృతదేహాన్నిఎమ్మెల్సీ కొట్టారని పోలీసులు చెప్పగా.. మరణానికి ముందే గాయాలయ్యాయని పోస్టుమార్టం నివేదిక నిగ్గుతేల్చింది.

ananthababu
ananthababu

పోలీసుల ప్రకటనకు.. పోస్టుమార్టం నివేదికకు కుదరని పొంతన

MLC EX DRIVER POSTMORTEM REPORT: డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు.. కేసు తీవ్రతను తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని పోలీసులు మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక.. ఖాకీల కట్టుకథను మరోసారి తెరపైకి తెచ్చింది. పోస్టుమార్టం నివేదికకు, పోలీసుల ప్రకటనకు పొంతన కుదరడం లేదు.

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు సందర్భంగా కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియా ముఖంగా చెప్పిన వివరాలివి.. అనంతబాబు నెట్టడంతో సుబ్రమణ్యం అపార్ట్‌మెంట్‌ డ్రైనేజ్‌పై పడి తలకు గాయమైందని, కారులో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే చనిపోయాడని ఎస్పీ ఆనాడు తెలిపారు. అయితే హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అనంతబాబు.. సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి చెట్టుకొమ్మతో తొడలు, చేతులు, భుజం, వీపుపై కొట్టారని వెల్లడించారు.

కానీ సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మృతుడి శరీరంపైన, లోపల 34 గాయాలున్నాయని మృతదేహం కళ్లు, నోరు కొద్దిగా తెరిచి ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. శరీరంలో అంతర్గత రక్తస్రావమైందని, ఊపిరితిత్తులు కొంతమేర సాగాయని.. రంగరాయ వైద్యకళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టెక్నాలజీ ప్రధానాచార్యునితోపాటు, సహ ఆచార్యుడు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో స్పష్టం చేశారు. మరణానికి ముందే మృతదేహంపై గాయాలున్నట్లు.. పేర్కొన్నారు.

ఇవన్నీ బలమైన, మొద్దుబారిన వస్తువుతో బతికుండగానే కొట్టినవని పొందుపరిచారు. నిజానికి కొట్టిన గాయాల వల్లే సుబ్రమణ్యం చనిపోయాడని పోలీసులు మే 21న శవపంచనామా సమయంలోనే గుర్తించారు. తల, వీపు, కాళ్లు, చేతుల మీద బలంగా కొట్టడం వల్ల తగిలిన గాయాలకే చనిపోయినట్లు పైకి కనిపిస్తోందని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహంపై 15 గాయాలున్నట్లు పంచనామా నివేదికలో పేర్కొన్నారు. వీటితోపాటు ఇతర గాయాలనూ మరింత లోతుగా వైద్యనిపుణులు పరీక్షించి ఎన్ని సెంటీమీటర్ల లోతున తగిలాయో కొలతలతో సహా పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు మృతుడి శరీరంలో అవయవాలను చిన్నచిన్న ముక్కలుగా సేకరించి విజయవాడలోని ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌తో పాటు రంగరాయ వైద్య కళాశాలలోని పాథాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈ పరీక్షల్లో మరింత స్పష్టత రానుండగా నివేదికలు అధికారికంగా అందడానికి మరో 2 నెలలు పడుతుందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.