ETV Bharat / state

అప్పుల భారంతో కౌలురైతు.. చెరువులోకి స్నానానికి దిగి ఇద్దరు..

author img

By

Published : Mar 25, 2023, 9:56 PM IST

young man committed suicide
young man committed suicide

young man committed suicide: చెరువులోకి స్నానానికి దిగి ఇద్దరు యువకుల మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.. ఓ వ్యక్తి నడిరోడ్డు మీద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన.. పల్నాడు జిల్లాలో జరిగింది. మరోచోట పంట పొలంలో ఓ వ్యక్తి 40 గంజాయి మొక్కలను పెంచుతున్నారని ఎస్ఈబీ అధికారులకు సమాచారం రావడంతో వారు గంజాయి సాగు చేస్తున్న పొలాన్ని గుర్తించి.. పంట సాగు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

youngman suicide attempt: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ వ్యక్తి నడిరోడ్డు మీద ఒంటిపై పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక స్థానిక ఎన్టీఆర్ కాలనీ చెందిన రమేష్ అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో జాతీయ రహదారిపై శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసి.. 108కు సమాచారం అందించారు. అప్పటికే సగానికి పైగా రమేష్ శరీరం కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడి ఉన్న రమేష్​ను 108 అంబులెన్స్​లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కౌలురైతు ఆత్మహత్య.. అప్పుల భారంతో కిలారు సాంబశివరావు(40) అనే కౌలురైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. యడ్లపాడు మండలం కొత్తసొలస గ్రామంలో సాంబశివరావు ఎకరం పొలం ఉంది. దాంతోపాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి పంటలు సాగు చేశాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు అప్పు చేశాడు. తెగుళ్లు, అకాల వర్షాలతో పంటల దిగుబడులు తగ్గాయి. అప్పులకు వడ్డీలు పెరిగిపోవటంతో సాంబశివరావు మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలోని వేప చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

చెరువులోకి స్నానానికి దిగి.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చెరువులోకి స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రత్తిపాడుకు చెందిన ప్రసన్నకుమార్ (25), నాగుల్ మీరా (22)లు మృతి చెందినవారిగా గుర్తించారు. ఎస్సై రవీంద్రబాబు గజ ఈతగాళ్లతో మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

యువతి మృతి.. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులోని 44వ జాతీయ రహదారిపై 8 రోడ్ల కూడలి వై జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాప్తాడు ఎస్ఐ పీవై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని చిలమత్తూరుకు చెందిన కిష్టప్ప కుతూరు రోజా (25), అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన గురుస్వామి కుమారుడు ఈడిగ దినేష్​లు ఇద్దరూ డీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు అనంతపురం నుంచి ధర్మవరం పంగర్ రోడ్డు వైపు వెళుతుండగా ధర్మవరం పంగల్ రోడ్డు నుంచి.. అనంతపురం వైపు అతివేగంతో వెళ్తున్న టిప్పర్ వై జంక్షన్లో ఢీకొంది.. దీంతో దినేష్, రోజాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడా చికిత్స పొందుతూ రోజు మృతి చెందింది. ఈడిగ రికేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

పట్ట పగలే చోరీ.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెం కాలనీలో నివాసం ఉంటున్నసుగ్గు గోవిందరావు ఇంట్లో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 10 తులాల బంగారం, అరకేజీ వెండి, రూ 20 వేలు నగదును దొంగలు పట్టుకెళ్లారు. పక్కింట్లో నివాసం ఉంటున్న వారికి అనుమానం వచ్చి సుగ్గు గోవిందరాకు సమాచారం అందించారు. దొంగలు అప్పటికే ఇంట్లో ఉన్న వాటిని చోరీ చేసి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఆదాం, ఎస్ఐ రాజేష్​ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీంతో చోరీ జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు.

పల్నాడు జిల్లా.. గురజాల మండలం దైద గ్రామంలో పంట పొలంలో ఓ వ్యక్తి 40 గంజాయి మొక్కలను పెంచుతున్నారని ఎస్ఈబీ అధికారులకు సమాచారం రావడంతో వారు ఈ రోజు తెల్లవారుజామున గంజాయి సాగు చేస్తున్న పొలాన్ని గుర్తించి.. పంట సాగు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ పండించిన పంట సుమారు 10 కేజీల పైగా ఉంటుందని తెలిపారు. అక్కడ మాత్రమే కాకుండా.. వేరువేరు ప్రాంతాల్లో కొంతమంది పంటను సాగు చేస్తున్నట్లు వారి దృష్టికి వచ్చిందని తెలిపారు. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఈబీ అధికారులు తెలియపరిచారు. మరిన్ని వివరాలు వారిని విచారించిన తర్వాత తెలియజేస్తామని తెలిపారు.

కోళ్ల లారీ బోల్తా.. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. చికెన్ షాప్​లకు కోళ్లను సరఫరా చేసే లారీ నరసరావుపేట నుంచి గిద్దలూరుకు కోళ్లను సరఫరా చేసేందుకు వచ్చింది. ఈ క్రమంలో లారీ వేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో దాదాపు లారీలో తరలిస్తున్న రెండువేల కోళ్లు మృతి చెందాయి. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో.. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే లారీ మాత్రం కింద పడి నుజ్జు నుజ్జు అయింది. సుమారు 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. అతివేగంతో లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.