ETV Bharat / state

వేల కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ జగన్‌ సన్నిహితులకే- స్మార్ట్​గా దోపిడీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 9:54 AM IST

YCP Govt Smart Meters Scam వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను జగన్‌ ప్రభుత్వం తన అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెడుతోంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు.. స్మార్ట్‌ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం నిర్వహించిన టెండరే ఇందుకు నిదర్శనం. జగన్‌కు దగ్గరగా ఉండే షిర్డిసాయి సంస్థ పెత్తనమే డిస్కంలపై నడుస్తోంది. వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఈ సంస్థకు ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచిపెడుతోందన్న ఆరోపణలున్నాయి.

ycp_smart_meters_scam
ycp_smart_meters_scam

YCP Govt Smart Meters Scam: జగన్‌ ప్రభుత్వం వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెడుతోంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు.. స్మార్ట్‌ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం నిర్వహించిన టెండరే ఇందుకు నిదర్శనం. డిస్కంలకు హుకుం జారీ చేసి ప్రాజెక్టు అంచనాలను తగ్గించినట్లే తగ్గించి ఆపై 22.70 శాతం అధిక మొత్తానికి షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు బిడ్‌ను ప్రభుత్వం కట్టబెట్టింది. దీనివల్ల టెండరు ధర కంటే అదనంగా 11 వందల 95 కోట్లను ప్రజలపై భారం మోపింది. జగన్‌కు సన్నిహితంగా ఉండే షిర్డిసాయి సంస్థ పెత్తనమే డిస్కంలపై నడుస్తోంది. వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఈ సంస్థకు ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెడుతోందన్న ఆరోపణలున్నాయి.

స్మార్ట్​ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు - ప్రజలపై పడనున్న 20 వేల కోట్ల భారం

రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. మూడు డిస్కంల పరిధిలో ఇందుకయ్యే వ్యయాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపాలని.. ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం విద్యుత్‌ తీగల నుంచి నేరుగా రైతు మోటారుకు కనెక్షన్‌ ఉందని భద్రతపరంగా ఎర్తింగ్, మీటర్‌ బాక్సు, సర్వీసు లైను, కెపాసిటర్లు అందించాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇందుకు డిస్కంలు 6 వేల 756.36 కోట్లతో అంచనాలను రూపొందించాయి. దీనిపై నిరుడు జులైలో మొదటిసారి టెండరు ప్రక్రియలో షిర్డిసాయి సంస్థ 6 వేల 480.21 కోట్లకు పనులు దక్కించుకుంది.

టెండరు ధర కంటే 4.08 శాతం తక్కువకే సంస్థ కోట్‌ చేసింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే.. టెండరులో నిర్దేశించిన ధర కొలమానం కాదని, పలు కీలక అంశాలను పరిశీలించలేదని, అందుకే ఆ టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం డిస్కంలను ఆదేశించింది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ఆధారంగా కొత్త అంచనాలను తయారు చేయాలని సూచించింది.

జర జాగ్రత్త.. విద్యుత్​ వినియోగం పెరిగితే స్మార్ట్ మీటర్లే

ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిసారి పిలిచిన టెండర్లను రద్దు చేసిన డిస్కంలు ప్రస్తుత ధరల ప్రకారం రెండోసారి 5 వేల 692.35 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాయి. వాటిని 2022 అక్టోబరు 21న ప్రభుత్వ పరిశీలనకు పంపాయి. మొదటి సారి కంటే ఈ సారి టెండర్ల ధరను 15.75 శాతం తగ్గించాయి. ఇందులో కేంద్ర గ్రాంటు 16 వందల 22.64 కోట్లు పోను 4 వేల 69.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ అంచనాలకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.

మొదటి, రెండోసారి రూపొందించిన అంచనాలు పోల్చినప్పుడు ప్రాజెక్టు వ్యయం వెయ్యీ 64.01 కోట్లు తగ్గాలి. కానీ.. కాగితాల్లో అంచనా మొత్తాన్ని ప్రభుత్వం తగ్గించినా గుత్తేదారుకు పనులను కేటాయించేటప్పుడు 22.70శాతం ధరను పెంచేసింది. అంటే.. షిర్డిసాయి సంస్థకు బిడ్‌ను 6 వేల 888.03 కోట్లకు కట్టబెట్టింది. దీంతో ఖర్చు తగ్గకపోగా 11వందల 95.68 కోట్ల భారం ప్రజలపై వేసినట్లయింది.

Electricity Charges Huge Increase in YSRCP Government: మాట తప్పి.. మడమ తిప్పేసిన జగన్.. విద్యుత్‌ ఛార్జీలను ఎడాపెడా పెంచి ప్రజలకే షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం

రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్‌కు 35 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గతేడాది అక్టోబరు 24న ఈటీవీ- ఈనాడులో కథనాలు వచ్చాయి. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు కోసం కొవిడ్‌ సమయంలో రూపొందించిన టెండరు అంచనాలను సమీక్షించుకుని, వాటిలో హెచ్చు, తగ్గులు ఉన్నాయని గ్రహించి వాటిని రద్దు చేశామన్నారు.

కొత్త అంచనాల ప్రకారం ఒక్కో మీటర్‌కు 6 వేలు, కెపాసిటర్లు, బాక్స్‌ల వంటి అనుబంధ పరికరాల కోసం 14 వేల 455 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం చూసినా 18.58 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు, అనుబంధ పరికరాలకు 3 వేల 801.74 కోట్లు సరిపోతాయి. అందులో కేంద్రం ఇచ్చే గ్రాంటు పోను రాష్ట్ర ప్రభుత్వం 2వేల 179.10 కోట్లు భరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించిన 6 వేల 888.03 కోట్లను భరిస్తే 3వేల 86.29 కోట్లు అదనంగా భారం పడుతుంది. పైగా ఈ ప్రాజెక్టు కోసం షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, అదానీ సంస్థలు రెండే పోటీపడ్డాయి.

కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ జగన్‌ సన్నిహితులకే- స్మార్ట్​గా దోపిడీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.