ETV Bharat / state

ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్‌ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 8:08 AM IST

Updated : Nov 8, 2023, 10:11 AM IST

rtc_buses
rtc_buses

YCP Government not Buying New RTC Buses: లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించినా విరామం లేదు.. తుక్కుకు వేయాల్సిన వాహనాలను రోడ్డెక్కిస్తున్నారు. డిపోలకే పరిమితం కావాల్సిన బస్సులకు పైపై మెరుగులద్ది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాలం చెల్లిన బస్సులతోనే కాసులు దండుకుంటున్నారు. ఛార్జీల పెంపు, రాబడిలో వాటాలు వసూలు చేసుకోవడం తప్ప.. ప్రభుత్వం సామాన్య ప్రయాణికుల భద్రతపై దృష్టిసారించిన దాఖలాలు లేవు. కనీసం బస్సులకు మరమ్మతులు చేయడానికి అవసరమైన సామాగ్రి సైతం అందుబాటులో ఉంచడం లేదు.

ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్‌ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?

YCP Government not Buying New RTC Buses: తుక్కు చేయాల్సిన బస్సులను రోడ్డు ఎక్కిస్తున్నారు.. డిపోకే పరిమితం కావాల్సిన బస్సులకు పై పైన రంగులతో మెరుగులు దిద్ది పరుగులు పెట్టిస్తున్నారు. ప్రయాణం భద్రంగా ఉంటుందన్న భరోసాతో బస్సెక్కిన ప్రయాణికులను ప్రమాదాల బారిన పడేస్తున్నారు సగానికిపైగా బస్సులు కాలం చెల్లినా పట్టించుకోవడం లేదు. బస్సులు కొంటాం నిధులివ్వమంటే సీఎం జగన్ ఉలకరు పలకరు నాలుగేళ్లుగా కొత్త బస్సుల కోసం ఎదురుచూపులే. ఛార్జీల పెంపు, రాబడిలో ప్రభుత్వ వాటా వసూలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ద ప్రయాణికుల భద్రతపై లేదు.. డిపోల్లో బస్సుల విడిభాగాలు ఉండవు. సరఫరాలోనూ భారీ కోత వేస్తారు. ఫలితంగా ఒవైపు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైసీపీ సర్కారు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్‌ అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

గ్రామాలకు తిరిగే పల్లె వెలుగు బస్సులు కానీ, విజయవాడ, విశాఖపట్నంలో తిరిగే సిటీ బస్సుల్లో కానీ చాలావరకు.. ఒకరోజంతా తిరిగి డిపోనకు చేరిన తర్వాత తప్పనిసరిగా గ్యారేజ్‌లోకి తీసుకెళ్లి రిపేర్ చేయాల్సిందే. లేకపోతే మర్నాడు అవి బయటకొచ్చే పరిస్థితి ఉండదు. ఆర్టీసీ సొంత బస్సుల్లో పల్లెవెలుగు సర్వీసులు 3,747 ఉండగా, వీటిలో 3,256 బస్సులు కాలం చెల్లినవే. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు 633 ఉండగా, వాటిలో 402 బస్సులు తిరిగిన కాలం చెల్లినవే. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తిరిగే చాలా బస్సులకు సకాలంలో మరమ్మతులు చేయడంలేదు. అందుకు సమయం కూడా ఇవ్వడంలేదు. ఆటోనగర్‌ నుంచి బయలుదేరిన బస్సు హైదరాబాద్‌ చేరుకోగానే డ్రైవర్‌ విశ్రాంతి తీసుకుంటారు. మరో డ్రైవర్‌ వెంటనే దానిని తిరుగు ప్రయాణానికి సిద్ధం చేసి తీసుకొస్తారు. వెంటనే మరొక డ్రైవర్‌ హైదరాబాద్‌ వెళ్లడం కోసం పాయింట్‌లోకి తీసుకెళ్తారు. ఇలా పలు సర్వీసులకు ఎటువంటి మరమ్మతుల ఊసే ఉండటంలేదు. ఏపీఎస్‌ఆర్టీసీలో బస్సుల్ని ఎలా నడుపుతున్నారో దీనినిబట్టి అర్థమవుతుంది.

రెప్పపాటు వ్యవధిలో బస్సు బీభత్సం - ముగ్గురు బలి - ఈ తప్పిదానికి కారణం ఎవరు?

కాలంచెల్లిన బస్సులను రోడ్లపై తిప్పుతూ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తెల్లారిలేస్తే.. నా పేదలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్‌కు.. ఆ పేదలే ఎక్కువగా ప్రయాణించే బస్సులు డొక్కుగా మారినట్లు కనిపించడం లేదా? రోజూ బ్రేకులు ఫెయిలయ్యి, స్టీరింగ్‌ ఊడిపోయి, చక్రాలు ఊడివచ్చి.. ప్రమాదాలకు గురవుతున్న బస్సులు తన కళ్లకు కనిపించకుండా గంతలు కట్టేసుకున్నారా? నిత్యం 35-40 లక్షల మంది ప్రయాణించే బస్సులపై సీఎంకు ఉన్న శ్రద్ధ ఇదేనా? మూడుసార్లు ఛార్జీలు పెంచి, ప్రయాణికులపై ఏటా రూ. 2 వేల కోట్ల భారం వేసినవాళ్లు కొత్త బస్సులు ఎందుకు కొనడంలేదు? ఆర్టీసీ రాబడిలో 25 శాతం తీసుకొని ఖజానాలో వేసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ఆ సంస్థను గాడిలో పెట్టడంపై ఎందుకు చూపడంలేదు? ప్రాణాలు పోతున్నా.. పేదోళ్లు ప్రయాణించే బస్సులపై దృష్టి పెట్టకూడదని కంకణం కట్టుకున్నారా?.

  • నిబంధనల ప్రకారం 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన బస్సులను తుక్కు (స్క్రాప్‌) చేయాలి. ఏపీఎస్‌ ఆర్టీసీకి సొంత బస్సులు 8,261 ఉండగా, వాటిలో 4,375 బస్సులు 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగేశాయి. అంటే కాలం చెల్లిన బస్సులు 52.95 (దాదాపు 53 శాతం) ఉన్నాయి.
  • ప్రస్తుతం ఆర్టీసీలో 12-13 లక్షల కి.మీ. మధ్య తిరిగినవి 759, 13-14 లక్షల కి.మీ. తిరిగినవి 988, అలాగే 14-15 లక్షల కి.మీ. మధ్య తిరిగినవి 1,092 బస్సులు ఉన్నాయి.
  • ఏకంగా 15 లక్షల కి.మీ.కు పైగా తిరిగినా ఇంకా రోడ్లపై పరుగులు పెడుతున్నవి 1,536
  • దూర ప్రాంతాలకు తిరిగే సూపర్‌ లగ్జరీ 1,163 సర్వీసుల్లో కాలం చెల్లినవి 396 ఉన్నాయి.
  • ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 95, ఆల్ట్రా పల్లె వెలుగు 51, ఇంద్ర ఏసీ బస్సులు 21, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 38 బస్సులు.. 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగేశాయి.

RTC Employees Worrying About Attacks: హారన్‌ కొట్టాలంటేనే భయపడాల్సి వస్తోందంటున్న ఆర్టీసీ డ్రైవర్లు.. వరుస దాడులతో ఆందోళనలో ఉద్యోగులు

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అనే నినాదంతో సంస్థ బస్సులు నడుపుతోంది. శిక్షణ కలిగిన డ్రైవర్లు, కండిషన్‌ ఉండే మంచి బస్సులతో వీటిలో ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతాం అని అంతా నమ్ముతుంటారు. కానీ కొంతకాలంగా ఆర్టీసీ యాజమాన్యం తీరుతో ఆ నమ్మకం సడలిపోయే పరిస్థితి వస్తోంది. ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. కొంతకాలంగా ఆర్టీసీలో ప్రమాదాలు సగటున ప్రతి లక్ష కి.మీ.కు 0.06గా ఉండేవి. ఆర్టీసీలో రోజుకు 40 లక్షల కి.మీ. మేర బస్సులు తిరుగుతాయి. ఈ లెక్కన రోజుకు సగటున 2.5, రెండు రోజులకు 5 చొప్పున ప్రమాదాలు జరిగేవి. అయితే కొంతకాలంగా ప్రమాదాల సంఖ్య ప్రతి లక్ష కి.మీ.కు రూ.0.07కి పెరిగింది. అంటే రోజుకు 3, రెండు రోజులకు 6 చొప్పున సగటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

రాష్ట్రంలో 129 డిపోలు, వాటికి అనుబంధంగా గ్యారేజ్‌లు ఉంటాయి. వాటిలో అవసరమైన విడి పరికరాలు అందుబాటులో ఉండాలి. కానీ అన్ని గ్యారేజ్‌ల్లో వీటి కొరత ఎక్కువగా ఉంది. ప్రధానంగా కీలకమైన స్టీరింగ్, గేర్‌ బాక్స్‌లకు చెందిన విడిభాగాలు, వీల్‌ హబ్స్‌ వంటి కొరత అధికంగా ఉంది. ఎయిర్‌ కంప్రెషర్, ఫ్రంట్‌ యాగ్సిల్, స్టీరింగ్, గేర్‌ బాక్స్‌లో సమస్య ఎక్కువగా ఉంటే వాటిని విజయవాడ, నెల్లూరు, కడప, విజయనగరంలో ఉన్న ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపులకు పంపుతారు. అక్కడ వాటిని సరిచేస్తారు. లేకపోతే అక్కడి నుంచే కొత్తవి సరఫరా చేస్తారు. ఈ జోనల్‌ వర్క్‌షాపుల్లో కూడా ఇవేమీ సక్రమంగా జరగడంలేదు. సంబంధిత విడి పరికరం లేకపోతే బస్సు నిలిచిపోయే అవకాశం ఉందని చెబితేనే ఏదో ఒకటి సర్దుబాటు చేస్తారని, లేకపోతే రోజుల తరబడి వేచి ఉండాల్సిందేనని మెకానిక్‌లు చెబుతున్నారు. డిపోల్లో బస్సుల సంఖ్యను బట్టి ఎంతమంది మెకానికల్‌ సిబ్బంది ఉండాలనే నిబంధన ఉన్నా సిబ్బందిని కుదించేయడం వల్ల కూడా బస్సుల మరమ్మతులపై ప్రభావం చూపుతోంది.

విజయవాడ బస్సు విషాదానికి కారణం - తప్పుడు నివేదికకు అధికారులు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో కొన్న బస్సులు కేవలం 300 బస్సులు మాత్రమే.. అది కూడా 2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-4 మోడల్‌ కొత్త బస్సులు తయారీ ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు నేపథ్యంలో.. ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు ఆఘమేఘాలపై 300 వరకు బీఎస్‌-4 బస్సులను కొనుగోలు చేశారు. అది మినహా, ఇప్పటి వరకు కొత్త బస్సులు తీసుకోలేదు. 1,500 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో యాజమాన్యం ప్రకటించింది. కానీ ఇంకా అవి డిపోలకు రాలేదు. ఇటీవల బస్‌ ఛాసీస్‌ల కొనుగోళ్లకు టెండర్లు పూర్తిచేసి బిడ్లు ఖరారు చేశారు. వీటి బాడీ నిర్మించే టెండర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఈనెల నుంచి నెలకు సగటున 200-250 కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే సంస్థలో కాలం చెల్లిన బస్సులు 4,375 ఉండగా, వీటిలో 1,500 కొత్త బస్సులను రీప్లేస్‌ చేసినా.. ఇంకా 2,875 కాలం చెల్లిన బస్సులే నడపాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సంస్థలో కాలం చెల్లిన బస్సులన్నింటినీ తొలగించి.. వాటి స్థానంలో కొత్త బస్సులు ప్రవేశ పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Last Updated :Nov 8, 2023, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.