ETV Bharat / state

రెప్పపాటు వ్యవధిలో బస్సు బీభత్సం - ముగ్గురు బలి - ఈ తప్పిదానికి కారణం ఎవరు?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 7:53 PM IST

Vijayawada_RTC_Bus_Accident
Vijayawada_RTC_Bus_Accident

Vijayawada RTC Bus Accident: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విజయవాడ బస్టాండ్‌లో.. బస్సు బీభత్సం.. రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 12 నెంబర్‌ ప్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురి పాలిట యమపాశంలా మారి.. ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటనలో ఆరు నెలల చిన్నారి కూడా ఉండటం మరింత కలచివేసింది. అయితే ప్రమాదానికి కారణం.. బస్సు నిర్వహణ లోపమా..? లేదా డ్రైవర్‌ తప్పిదమా..? అనే విషయం ఇంకా తేలలేదు. బస్సు బీభత్సాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, స్టాళ్ల నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Vijayawada RTC Bus Accident: రెప్పపాటు వ్యవధిలో బస్సు బీభత్సానికి ముగ్గురు బలి - ఈ తప్పిదానికి కారణం ఎవరు?

Vijayawada RTC Bus Accident: సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాలు.. బస్సుల కోసం వెతుక్కుంటూ ప్లాంట్‌ ఫాంపై తిరుగుతున్న ప్రయాణికులు.. రెప్పపాటు వ్యవధిలోనే బీభత్సం సృష్టించిన బస్సు ముగ్గురు పాలిట మృత్యువులా మారింది. ఈ విషాద ఘటన విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు ఆటోనగర్‌ డిపోకు చెందిన మెట్రో లగ్జరీ నాన్‌ స్టాప్‌ బస్సు 24 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు 12 నెంబర్‌ ప్లాంట్‌ ఫాం వద్ద సిద్ధంగా ఉంది.

బస్సును వెనెక్కి తీసేందుకు.. డ్రైవర్ గేర్‌ వేసి ఎక్స్‌లేటర్‌ తొక్కారు. కదలకపోవడంతో.. ఎక్స్​లేటర్‌ గట్టిగా తొక్కారు.. అంతే.. ఒక్కసారిగా బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఇనుప బారికేడ్లు, కుర్చీలు, స్తంభం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బస్సు కింద పడి ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.

బస్టాండ్​లో ఫ్లాట్​ఫాంపైకి దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు - విద్యార్థులు ఉండగా కాల్వలో బోల్తాపడిన స్కూల్​ బస్​​​

బస్సు టైర్ల కింద పడి చీరాలకు చెందిన 45 ఏళ్ల కుమారి, ఆర్టీసీ బుకింగ్‌ క్లర్క్‌ అక్కడికక్కడే చనిపోయారు. ఆరు నెలల చిన్నారి కత్తి చెర్రీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో మృతి చెందాడు. తీవ్రంగా గాయాలపాలైన మరో ఇద్దరు ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బస్సు స్టాళ్ల పైకి వెళ్లి ఉంటే మరింత మందికి గాయాలయ్యేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు కండిషన్‌ బాగోలేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని డ్రైవర్‌ ప్రసాద్ చెప్పారు.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదస్థలిని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంస్థ నుంచి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

బస్సు డ్రైవర్‌పై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలకు హాని కలిగించారన్న అభియోగాలపై కేసు నమోదు చేసి.. బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే దళితులపై దాడులు - బస్సు ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి: లోకేశ్​

బస్సు ప్రమాదంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలం చెల్లిన బస్సుల వల్లే.. రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. పూర్తి బాధ్యత జగనే వహించాలని డిమాండ్ చేశారు.

వైసీపీ హయాంలో వచ్చాక ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదన్న లోకేశ్ ఆర్టీసీలో పరికరాల కొనుగోలుకు నిధులే ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. రిక్రూట్ మెంట్ లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన, సీపీఎం, సీపీఐ సహా పలు ప్రజా సంఘాల నేతలు ఘటనా స్థలిని పరిశీలించి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎదురుగా వస్తున్న వాహానాన్ని తప్పించబోయి, కాలువలోకి దూసుకెళ్లిన బస్సు! పల్నాడు జిల్లాలో ఘటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.