గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయానికి అర్ధరాత్రి సమయంలో మహిళలు భారీగా తరలివచ్చారు. మరో మూడు గంటల్లో డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణమాఫీ గడువు ముగిసిపోతుందన్న వాలంటీర్ల సమాచారంతో కార్యాలయం ఎదుట బారులు తీరారు. రుణమాఫీలో పేరు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు. ఒక్కసారిగా అధిక సంఖ్యలో మహిళలు రావడంతో... బయోమెట్రిక్ యంత్రాలు మొరాయించాయి.
ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు... తమను అర్ధరాత్రి వేళ ఎందుకు పిలిచారని సెర్ప్ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నుంచి రాత్రి 10 గంటలకు సమాచారం వచ్చిందని, కేవలం మూడు గంటల లోపు పేరు నమోదు చేసుకోకపోతే సైట్ మూసివేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు వాలంటీర్లకు సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. రుణమాఫీలో పేరు నమోదుకు కనీసం రెండు రోజుల గడువు ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.