ETV Bharat / state

R5 Zone plots: పేదలకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం.. మరో 268 ఎకరాలు

author img

By

Published : May 9, 2023, 10:23 PM IST

R 5 Zone plots : ప్రజాభిప్రాయానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని.. గ్రామసభలు, ఏకగ్రీవ తీర్మానాలను సైతం బుట్టదాఖలు చేస్తోందని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ 5 జోన్​లో ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తూ రైతులు రిలే దీక్ష కొనసాగిస్తున్నారు. మరో వైపు లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో లే అవుట్ లో హద్దు రాళ్లను రైతులు తొలగించడంతో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొనగా.. రాజధాని నగరంలో భూ పందేరంపై వారం రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Etv Bharat
Etv Bharat

R 5 Zone plots : ఆర్‌-5 జోన్‌లో పేదలకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ కు గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లు లేఖలు రాశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు లబ్ధిదారుల జాబితా ఇచ్చారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఫొటోలు సేకరిస్తున్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు అడిగిన భూమికి అదనంగా 268 ఎకరాలు కేటాయిస్తున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ లేఖ రాశారు. గతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదలకు 1134.58 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు జిల్లాలలో లబ్ధిదారుల సంఖ్య పెరిగిన దృష్ట్యా... ఎస్‌3 జోన్‌లో అదనంగా 268 ఎకరాలు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 26,739 మంది లబ్ధిదారులు, గుంటూరు జిల్లాలో 23,235 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేయనున్నారు. దీనికి అదనంగా ఎస్ 3 జోన్​లో మరో 128 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.

హద్దురాళ్ల తొలగింపు.. రాజధాని నిర్మాణానికి తామిచ్చిన భూములు ప్లాట్లు చేసి పంచడానికి వీల్లేదని రైతులు స్పష్టం చేశారు. కౌలు డబ్బులు చెల్లించకుండా, రిటర్నబుల్‌ ప్లాట్లు అభివృద్ధి చేయకుండా భూముల జోలికి రావద్దని హెచ్చరించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్​లో పాతిన హద్దు రాళ్లను పీకేశారు. ఇళ్ల స్థలాల పంపిణీకి శరవేగంగా పావులు కదుపుతున్న ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. ఆర్-5జోన్‌లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన పలువురు రైతులు.. ప్లాట్లు వేసి పాతిన హద్దు రాళ్లను పీకేశారు. రిటర్న్‌బుల్‌ ప్లాట్ల అభివృద్ధి సంగతేంటో తేల్చాలని భీష్మించారు. తామిచ్చిన భూములకు కౌలు కూడా ఇవ్వకుండా ఎవరికో పంచేస్తామంటే ఎలా అని రైతులు నిలదీశారు.

మంత్రి బొత్సపై ఆగ్రహం.. ఆర్-5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రభుత్వం ముందుకు వెళ్లొద్దని రైతులు డిమాండ్‌ చేశారు. కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షల్లో నాలుగో రోజు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. గ్రామ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలు పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందంటూ మండిపడ్డారు. అమరావతి ఓ బ్రహ్మపదార్థమా అని ఎద్దేవా చేసిన మంత్రి బొత్సపై రైతులు ఆగ్రహించారు. ఆర్ 3 జోన్​లో భూములను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. విశాఖ రుషికొండలో, కర్నూలులో ఎందుకు పేదలకు సెంటు స్థలాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో భూములు ఇస్తే.. కౌలు డబ్బులు వచ్చాయని, జగన్ వచ్చాక కౌలు డబ్బులు రాలేదు, ప్లాట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్లాట్ అలాట్ చేసి, కౌలు డబ్బులు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని రైతులు స్పష్టం చేశారు.

సుప్రీంలో విచారణ.. ఇళ్ల స్థలాల పంపిణీ అనేది తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు.. స్థానికేతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతుల అనుబంధ పిటిషన్లను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పెషల్​ లీవ్​​ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు.. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం వచ్చేవారం విచారణ చేపట్టనుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.