ETV Bharat / state

ఒంటిపూట బడులు ఎప్పట్నుంచి.. ఉపాధ్యాయులపై కక్ష విద్యార్దులపై చూపితే ఏలా! : టీడీపీ

author img

By

Published : Mar 30, 2023, 7:59 PM IST

Half Day schools in Andhra Pradesh: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నా విద్యార్థులకు ఒంటిపూట బడులు ఇవ్వక పోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు సీఎం జగన్​కి.. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై కక్షతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని విమర్శించారు.

TDP leaders
టీడీపీ నేతల ఆగ్రహం

Half Day schools 2023 in Andhra Pradesh: ఓ వైపు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. ప్రభుత్వం ఎప్పుడు ఒంటి పూట బడులను ప్రకటిస్తుందా అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రకటించకపోవడంపై.. పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం.. విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుతోందని మండిపడుతున్నారు. ఉపాధ్యాయులపై కక్షతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం విడనాడాలని కోరుతున్నారు. పిల్లల కష్టాలను గుర్తించి.. ప్రభుత్వం వెంటనే ఒంటిపూట బడులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

సీఎంకి బహిరంగ లేఖ: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నా.. విద్యార్దులకు ఒంటిపూట బడులు ఎందుకు ఇవ్వడం లేదని.. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అని ధ్వజమెత్తారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే పెద్దవాళ్లే భయపడుతున్నారు. చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్కూల్లో ఎలా ఉండగలరని నిలదీశారు. ఈ మేరకు సీఎం జగన్​కి బహిరంగ లేఖ రాశారు.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోందన్నారు. కానీ మార్చి నెల దాటిపోతున్నా ఒంటిపూట బడులు ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. ఒంటిపూట ఒడులు ఎప్పుడంటూ అడిగిన పాపానికి ఉపాధ్యాయులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఒంటిపూట బడులు పిల్లలకా మీకా అంటూ టీచర్లను మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరిగే ముఖ్యమంత్రి, మంత్రులకు.. స్కూలు పిల్లల కష్టాలు ఏం తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలు వీడి ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఆగ్రహం: అదే విధంగా మరో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి కూడా ఒండిపూట బడులపై ప్రశ్నించారు. ఏపీలో ఒంటిపూట బడులు ఇంకెప్పుడు పెడతారో జగన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. ఉపాధ్యాయులపై కక్ష సాధించేందుకే ఒంటిపూట బడులకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు.

ఎండలు మండుతున్నా పిల్లలను రోజంతా బడిలో ఉంచడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే సాధ్యమైందని దుయ్యబట్టారు. ఒంటిపూట బడులపై ప్రశ్నించిన టీచర్లపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.