ETV Bharat / state

Remand to Employees: నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు రిమాండ్‌.. సూర్యనారాయణపైనా కేసు నమోదు

author img

By

Published : Jun 2, 2023, 9:35 AM IST

Remand to Four Employees: వాణిజ్య పన్నులశాఖకు చెందిన నలుగురు ఉద్యోగులకు విజయవాడ న్యాయస్థానం ఈనెల 14 వరకు రిమాండ్‌ విధించింది. ఇదే కేసులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో ఐదో నిందితుడిగా పేర్కొన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్‌ మే 30న ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ పటమట పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు.

Remand to Employees
Remand to Employees

Remand to Four Employees: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలపై.. ఎస్‌టీ అధికారులు మెహర్‌కుమార్, కె.సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కేవీ చలపతి, ఆఫీసు సబార్డినేట్‌ ఎం.సత్యనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ కేఆర్‌ సూర్యనారాయణ, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారు. బుధవారం సూర్యనారాయణ మినహా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి రాజశేఖర్‌ ముందు రిమాండ్‌ నిమిత్తం హాజరుపరిచారు.

నిందితుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర.. ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఐపీసీ 409 సెక్షన్‌ నమోదు చేశారన్నారు. పన్ను వసూలు చేసే బాధ్యతను నిందితులకు అప్పగించలేదన్న ఆయన.. అలాంటప్పుడు 409 సెక్షన్‌ కింద కేసు నమోదు చెల్లదని తెలిపారు. ఇదే ఆరోపణలతో నిందితులపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు రద్దు చేసిందన్నారు.

సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్‌ కేసులో ఇచ్చిన మారదర్శకాలను దాటవేయాలన్న దురుద్దేశంతో పోలీసులు ఏడేళ్లకు పైబడే శిక్షకు వీలున్న సెక్షన్లు నమోదు చేస్తున్నారన్నారు. 409 సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే కాబట్టి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నిందితులకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. రిమాండ్‌ను తిరస్కరించాలని అభ్యర్థించారు.

పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.నాగిరెడ్డి.. రిమాండ్‌ దశలో సెక్షన్‌ 409 వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నిందితులందరూ పబ్లిక్‌ సర్వెంట్లుగా పేర్కొన్న న్యాయవాది.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తీసుకున్న అంతర్గత నిర్ణయాల ప్రకారం నిందితులకు పన్ను వసూలు చేసే బాధ్యత అప్పగించారన్నారు.

ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఉన్నతాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. నిందితులకు రిమాండ్‌ విధించాలని కోరారు. 2019-21 మధ్య కాలంలో విజయవాడ 1వ డివిజన్‌ వాణిజ్య పన్నుల శాఖ నిఘా విభాగంలో పని చేసిన నిందితులు.. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు సరఫరా చేసే వర్తకులు, సరఫరాదారులతో కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని రిమాండ్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నారన్నారు.

నీరు చెట్టు పథకం కింద చేపట్టిన పనుల మొత్తం వ్యయాన్ని తగ్గించి చూపారని, తనిఖీలు, దాడుల ముసుగులో డీలర్లు, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారని, పంపిణీ రిజిష్టర్లలో తప్పుడు ఎంట్రీలను నమోదు చేశారన్నారు. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని.. కస్టోడియల్‌ విచారణ అవసరం ఉన్న నేపథ్యంలో రిమాండ్‌ విధించాలని పటమట సీఐ కాశీ విశ్వనాథ్​ కోరారు.

ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కేసు నమోదు దగ్గర నుంచి వాదనలు వినిపించేంత వరకు ఉన్నతస్థాయి నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందాయి. నిందితుల అరెస్ట్‌ విషయంలోనూ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రిమాండ్‌ విధించే సమయంలోనూ రాష్ట్ర పీపీ నాగిరెడ్డిని రంగంలో దించారు.

డీసీపీ విశాల్‌ గున్ని స్వయంగా కోర్టుకు హాజరై పర్యవేక్షించారు. పోలీసు కమిషనర్‌కు విషయాలను ఎప్పటికప్పుడు నివేదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయాధికారి.. నలుగురు నిందితులకు ఈనెల 14 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీసులు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.