MLA Quota MLC elections Schedule: ఆంధ్రప్రదేశ్లో.. శాసనమండలిలో.. ఎమ్మెల్యే కోటాలో త్వరలో ఖాళీ కానున్న 7 స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసి ఆ రోజు నుంచి.. 13వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనుంది. 14న నామినేషన్ల పరిశీలన.. 16 వరకు ఉప సంహరణకు తుదిగడువుగా ప్రకటించింది. 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి తుది ఫలితాలను వెల్లడించనున్నారు. మండలికి శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికై.. మార్చి 29తో పదవీకాలం పూర్తవుతున్న వారిలో నారా లోకేశ్, బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కాగా.. పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెన్మెత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకరరెడ్డి వైఎస్సార్సీపీ సభ్యులు. ఇటీవల అనారోగ్యంతో వైఎస్సార్సీపీకు చెందిన చల్లా భగీరథ రెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం కూడా ఖాళీగా ఉంది.
తెలంగాణలో: తెలంగాణలో కూడా శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 29వ తేదీతో ఖాళీ కానున్న మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
మార్చి 13 వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 వ తేదీన పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఉంటుంది. మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వివాదాలు.. విమర్శలు: తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వివిధ వివాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. అధికార పార్టీ తీరుపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ.. అడ్డదారులు తొక్కుతోందని విమర్శిస్తున్నారు. తాజాగా విశాఖలో.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏర్పాటు చేసిన సమావేశానికి.. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ హాజరవడం, దానికి తోడు నేరుగా వేదిక మీద కూర్చోవడం వివాదాస్పదమైంది. వీసీపై చర్యలు తీసుకోవాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అడ్డదారులు తొక్కుతోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గతంలో మండలి రద్దును ప్రకటించిన జగన్.. ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పోలీసులతో అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను బెదిరిస్తూ.. రాజకీయంగా దిగజారుతోందిని అన్నారు.
ఇవీ చదవండి: