ETV Bharat / state

బిందెడు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.. సర్పంచ్​ల ఆవేదన

author img

By

Published : Apr 11, 2023, 4:46 PM IST

Sarpanchs Association meeting: వైసీపీ సర్కార్‌ తమను బిచ్చగాళ్ల కంటే హీనంగా మార్చేసిందని.. సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వాలంటీర్లతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు గృహసారథులు, సచివాలయ కన్వీనర్లను నియమిస్తూ మరింత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నియామకాల రద్దుతో పాటు 13 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకూ విశ్రమించబోమని సర్పంచులు హెచ్చరించారు.

Sarpanchs Association meeting
Sarpanchs Association meeting

Sarpanchs Association meeting: గ్రామపంచాయతీలు, సర్పంచుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును.. ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండించింది. గుంటూరులోని కొరటాల భవన్లో జరిగిన సదస్సులో పాల్గొన్న అన్ని పార్టీల సర్పంచులు.. ప్రభుత్వం తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విధులు, నిధులు లాగేసుకుని.. వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లతో పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా... కేంద్ర నిధులను కూడా లాగేసుకోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో గ్రామాల్లో ఏ పనీ చేయలేకపోతున్నామని.. కనీసంగా మురుగుకాలవల్లో పూడిక తీయించలేని దుస్థితికి చేరామని సర్పంచులు ఆవేదన వ్యక్తంచేశారు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్లదే పెత్తనమని... ఈ విషయంలో ఎమ్మెల్యేల మాట వినే పరిస్థితి కూడా లేదని గుర్తుచేశారు. ఏదో చేస్తారనే నమ్మకంతో జగన్‌ను గెలిపిస్తే.. నిలువునా ముంచేశారని వైసీపీకి చెందిన ఓ సర్పంచ్‌ చెప్పుతో కొట్టుకుని పశ్చాత్తాపడ్డారు.

ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది.. పంచాయతీ సర్పంచులకు సమాంతరంగా ప్రభుత్వం తెచ్చిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. విధులు, నిధులు లేక సర్పంచులు రెండేళ్లుగా కనీస అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారని తెలిపారు. వేసవిలో కనీసం బిందెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సర్పంచులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసి సర్పంచ్​లను ఉత్సవ విగ్రహాలు చేశారని ఆరోపించారు. ఇది 73, 74 రాజ్యాంగ సవరణకు వ్యతిరేకమన్నారు. వెంటనే గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు 8 వేల 600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు.

మా అమ్మకం నీవే జగనన్నా.. కేంద్రం ఇటీవల పంపించిన రెండు వేల కోట్లు పంపించినా ఇంకా సర్పంచుల ఖాతాలో వేయలేదని.. వాటిని ఏం చేశారో ముఖ్యమంత్రి లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చే డబ్బులు లాగేస్తున్నారని ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి ఆరోపించారు. పన్నుల రూపంలో వసూలైన డబ్బులను కరెంటు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కూడా సర్పంచిలకు ప్రాతినిథ్యం లేకుండా చేయటాన్ని తప్పుబట్టారు. మా నమ్మకం నీవే జగనన్నా అనుకునే బదులు మా అమ్మకం నీవే జగనన్నా అనే పరిస్థితి తెచ్చారని సర్పంచ్​లు తెలిపారు. నిధులు లేని పరిస్థితుల్లో ఆవేదనతో తనను తాను చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రకాశం జిల్లా చినగానిపల్లి సర్పంచ్ పగడాల రమేష్ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.