ETV Bharat / state

పార్టీ ప్రచారం కోసం పీహెచ్‌సీలపై చిన్నచూపు - జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల రూపాయల ఖర్చు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 9:34 AM IST

CM Jagan Negligence on Primary Healthcare Centres: సీఎం జగన్‌ ప్రచార పిచ్చి పేద ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతోంది. పార్టీ ప్రచారం కోసం జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా సర్కార్ ఖర్చు చేస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గాలికొదిలేస్తుంది. దీర్ఘకాలిక జబ్బులకు పరిష్కారం చూపాలన్న కేంద్ర మార్గదర్శకాలను తూతూ మంత్రంగానే అమలు చేస్తుంది. పీహెచ్‌సీల్లో స్పెషలిస్టు వైద్యుల సేవలు అందక పోవడంతో రోగులకు నాణ్యమైన వైద్యం దక్కడం లేదు.

cm_jagan_negligence_on_primary_healthcare_centres
cm_jagan_negligence_on_primary_healthcare_centres

CM Jagan Negligence on Primary Healthcare Centres: పార్టీ ప్రచారం కోసం పీహెచ్‌సీలపై చిన్నచూపు - జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల రూపాయల ఖర్చు

CM Jagan Negligence on Primary Healthcare Centres: దీర్ఘకాలిక రోగాలకూ చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్​ల (Bachelor of Medicine and Bachelor of Surgery)కు అదనంగా స్పెషలిస్టు వైద్యుల సేవలు కూడా గ్రామీణులకు అందాలని కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. దీని కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులను నియమించి నాణ్యమైన సేవలందించాలి.

అయితే పార్టీ ప్రచారానికే జగన్‌ సర్కార్‌ పెద్దపీట వేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha)కు అగ్రతాంబూలం అందిస్తుంది. వాటి కోసమే కోట్ల ఖర్చు పెట్టి PHCలను పట్టించుకోవట్లేదు. దీంతో పీహెచ్​సీ(Primary Healthcare Centre)ల్లో MBBSల ద్వారా మాత్రమే గ్రామీణులకు వైద్య సేవలు అందుతున్నాయి. స్పెషలిస్టు వైద్యుల సేవలను భూతద్దంలో వెతక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

జగనన్న సురక్ష వైద్య శిబిరాలతో ఒరిగిందేమిటి?

కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి 2021లో పీహెచ్​సీలోనూ స్పెషలిస్టు వైద్యుల సేవల కోసం నియామకాలు జరిగాయి. పీహెచ్‌సీల సంఖ్యను ప్రకారం 12 వందల మంది వరకు స్పెషలిస్ట్‌ వైద్యులు అవసరం అవుతారని అంచనా వేసి తొలివిడత కింద ఒప్పంద విధానంలో సుమారు 3 వందల 50 మందిని నియమించారు. వీరిలో జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెంటిస్ట్, డెర్మటాలజిస్ట్, ఆర్థో, గైనకాలజిస్టు, ఇతర వైద్యులు ఉన్నారు. ఒక్కో స్పెషాల్టీ డాక్టర్ చొప్పున సోమవారం నుంచి శనివారం వరకు ఆరుగురు ఔట్‌ పేషంట్‌’విధానంలో రోగులకు వైద్య సేవలు అందించాలి.

రోగుల అనారోగ్యం, వ్యాధి తీవ్రతను అనుసరించి రోగులు పెద్దాసుపత్రులకు వెళ్లేలా చేయాలి. ప్రతి స్పెషలిస్టు ఒకేరోజు ఉదయం ఒక పీహెచ్‌సీ, సాయంత్రం మరో పీహెచ్‌సీని సందర్శించి రోగులను చూడాలి. స్పెషలిస్టు వైద్యులు వారంలో 12 పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందించాలి. నిర్దేశించిన రోజుల్లో స్పెషలిస్టు డాక్టర్లే నేరుగా పీహెచ్‌సీలకు వస్తున్నందున రోగులకు అనుకూలంగా ఉంటుందన్న విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

No Response to Jagananna Arogya Suraksha: 'జనాలెక్కడ జగనన్నా'..! 'జగనన్న సురక్ష'కు స్పందన కరవు.. ఉపన్యాసాలతో విసిగిస్తున్న నేతలు

అంతంత మాత్రంగానే సేవలు: ప్రస్తుతం 350లో 50 మంది స్పెషలిస్టు వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరి సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఎప్పుడు వస్తారో రోగులకే కాదు పీహెచ్​సీల్లోని వైద్యులకు కూడా తెలియడం లేదు. ఒకసారి రోగిన చూసిన తర్వాత మరోసారి ఆ రోగి స్పెషలిస్టు డాక్టర్ల వద్దకు వస్తున్నారా? లేదా?, వైద్యులు పీహెచ్​సీలకు నెలలో ఎన్ని రోజులు వస్తున్నారు? ఎంత సమయం ఉంటున్నారు? అనే దానిపై నిశిత పరిశీలన ఉండటం లేదు. స్పెషలిస్టు వైద్యుల్లో కొందరు ప్రైవేట్‌ ఆసుపత్రులు, సొంత క్లినిక్‌లు నిర్వహిస్తూ పీహెచ్‌సీల సందర్శనకు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.

రాకుండానే వచ్చినట్లు నమోదు: పీహెచ్​సీలకు రాకుండానే వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దారితప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టి రోగులకు ప్రయోజనాలు చేకూరేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. వైద్యులకు లక్షా 30 వేల వరకు వేతనం ఇస్తున్నారు. వైద్యుల సంఖ్యను పెంచి, లోటుపాట్లు సమీక్షించి, దిద్దుబాటు చర్యలు తీసుకుంటే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దీనిని ప్రభుత్వం పక్కనబెట్టి జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో వైద్య శిబిరాల నిర్వహణకే అధిక ప్రాధాన్యమిస్తోంది.

Jagannana Suraksha for YCP Campaign: ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి.. జగనన్న ఆరోగ్య సురక్షతో పార్టీ ప్రచారం ముమ్మరం చేయండీ!

రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత నిర్వహించిన గ్రామ స్థాయిలోని వైద్య శిబిరాలు తూతూ మంత్రంగా జరిగాయి. బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడే వారే శిబిరాలకు ఎక్కువగా వచ్చారు. 50 లక్షల మందికి ఓపీ ద్వారా చికిత్స అందిస్తే కేవలం 80 వేల మందినే ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. ఓపీ విధానంలో వైద్యుల వద్దకు వచ్చిన రోగుల్లో కనీసం పది శాతం మంది పెద్దాసుపత్రులకు రిఫర్‌ చేయాల్సి ఉండగా, కేవలం రెండు శాతం మందినే రిఫర్‌ చేశారు. తొలి విడత వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం 112 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టింది. మలివిడత వైద్య శిబిరాల నిర్వహణకు 75 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Protest at Jagananna Arogya Suraksha Program: మూడేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఈ శిబిరాల వల్ల ఏం ఉపయోగం.. సామాన్యుడి ఫైర్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.