ETV Bharat / state

కొప్పర్రు ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Sep 23, 2021, 2:21 PM IST

Updated : Sep 23, 2021, 6:01 PM IST

chandrababu letter to dgp
chandrababu letter to dgp

14:17 September 23

chandrababu letter to dgp

కొప్పర్రు ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ
కొప్పర్రు ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు.  కొంత మంది పోలీసులు అధికార వైకాపా నాయకులకు కొమ్ముకాయటం వల్ల రాష్ట్రంలో హింసాత్మక దాడులు పెరిగిపోయాయని డీజీపీ గౌతంసవాంగ్​కు రాసిన లేఖలో ఆరోపించారు. ఈ హింసాత్మక దాడులు, అధికార పార్టీ ప్రారంభించిన రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వైకాపా గూండాలు తెదేపా నాయకులను సానుభూతిపరులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

తెదేపా సానుభూతిపరులపై వైకాపా నాయకుల హింసాత్మక దౌర్జన్యాలు, దాడులు, మతపరమైన పండుగలు, ఊరేగింపులను ఉపయోగించే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీన రాత్రి వైకాపా నాయకులు గణేష్ నిమజ్జనం కోసం విగ్రహాన్ని ఊరేగింపు పేరుతో పెద్దపెద్ద శబ్ధాలతో, డప్పులు, డ్యాన్సులతో తెదేపా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారద ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. 

హింసాత్మక దాడిని ఆపడంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తెదేపా సానుభూతిపరులు గానీ, పోలీసులు గానీ దాడిని ప్రతిఘటించడం లేదని తెలుసుకున్న వైకాపా గూండాలు మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారని దుయ్యబట్టారు. కొప్పర్రు సంఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పతనాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుందని ఆక్షేపించారు. గణేష్ విగ్రహ ఊరేగింపు పేరిట ఈ దాడిని వైకాపా గూండాలు ముందుగా పథకం ప్రకారం చేశారని జరిగిన సంఘటనల తీరును బట్టి స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లడానికి కారం పొడి, తగులబెట్టేందుకు పెట్రోల్ బాటిళ్లు తీసుకెళ్లడం, కరెంటు మెయిన్ బోర్డును ధ్వంసం చేయడం లాంటి ఘటనలు ఈ కుట్ర ముందుగానే వ్యూహ రచన చేసి అమలు చేసినట్లు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ముందుగా ఊహించిన విధంగానే, పోలీసులు నేరస్తులైన వైకాపా గూండాలు వద్ద నుండి ఫిర్యాదు తీసుకుని పెదనందిపాడు పోలీస్ స్టేషన్‌లో తెదేపా వర్గంపై FIR నంబర్ 110/2021 దాఖలు చేశారని...,. ఇందులో తెదేపా సానుభూతిపరులు, మహిళలు, పురుషులు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు ఇతరులైన 49 మంది పేర్లను చేర్చారని ధ్వజమెత్తారు.

 సంఘటన సమయంలో కొప్పర్రులో లేనివారు, వివిధ పనులతో కొప్పర్రు వెలుపల నివసిస్తున్న వారి పేర్లను సైతం చేర్చారని ఆరోపించారు. పోలీసులు బాధితులను మరింత బాధింప చేస్తున్నారు అనటానికి ఇది ఒక్క ఉదాహరణని విమర్శించారు. వైకాపా నాయకుల ఆదేశాల మేరకు తెదేపా సానుభూతిపరులపై తప్పుడు కేసులు ఎలా నమోదవుతున్నాయనే దానికి ఈ కేసు ఒక బలమైన దృష్టాంతమని పేర్కొన్నారు. పోలీసు అధిపతిగా, కొప్పర్రు ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

drugs case : హెరాయిన్​ కేసులో రంగంలోకి ఈడీ..!

Last Updated :Sep 23, 2021, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.