ETV Bharat / state

రాజధాని కేసులు.. సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడంటే..?

author img

By

Published : Feb 28, 2023, 11:23 AM IST

Supreme Court on AP capital
రాజధాని కేసులు

Supreme Court on Andhra Pradesh Capital: రాజధాని అమరావతికి సంబంధించిన కేసులు మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణను ఈనెల 23న సుప్రీంకోర్టులో చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. విచారణకు రాలేదు.

Supreme Court Hearing on Andhra Capital: రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం మార్చి 28న చేపట్టనుంది. తాము దాఖలు చేసిన పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ.. అమరావతి కేసుల అంశాన్ని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట రాష్ట్రప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి సోమవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ కేసుల విచారణను ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టులో చేపట్టాల్సి ఉంది. అయితే ఒకసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో.. ఈనెల 23న జరగాల్సిన విచారణ వాయిదా పడిందని పేర్కొన్నారు. హోలీ సెలవుల అనంతరం వెంటనే పిటిషన్లపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. వెంటనే అంటే.. సాధ్యం కాకపోవచ్చని అన్నారు.

తర్వాత వారంలో కూడా అలాంటి పరిస్థితే దాదాపు ఉందని న్యాయమూర్తులు పేర్కొనగా.. ఏదో ఒక తేదీ ఖరారు చేయాలని కోరారు. 400 పేజీలు పరిశీలించాల్సి ఉండడం, బహుముఖ అంశాలు ముడిపడి ఉన్నందున ఎక్కువ సమయం పడుతుందని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తెలిపారు. తొలుత మార్చి 20, 21 తేదీల్లో విచారించాలనుకున్నా.. కుదరని పరిస్థితి ఉండటంతో.. మార్చి 28న విచారించనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అంతకు ముందు.. ఎంత సమయం వాదనలకు తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకరోజు పడుతుందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు.

ఒకే అంశంపై పలువురు పిటిషన్లు వేసినందున ఒకరు వినిపించిన వాదనలే మరొకరు పునరావృతం చేయకూడదని జస్టిస్‌ బి.వి.నాగరత్న సూచించారు. అందుకు వాది, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు అంగీకరించారు. మార్చి 28వ తేదీన.. అన్ని కేసుల కంటే ముందే.. టాప్‌ ఆఫ్‌ ది బోర్డు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేయగా.. అప్పటికే రెండు కేసులు టాప్‌ ఆఫ్‌ ది బోర్డు ఉన్నాయని, సాధారణ జాబితా ప్రకారమే తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసుల విచారణలో మార్పులు చేస్తూ.. ఈనెల 14న సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్‌ తీసుకు వచ్చింది. దీని ప్రకారం.. ప్రతి బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్‌ పిటిషన్లపై ఏ ధర్మాసనం విచారణ చేపట్టదు. ఆ రోజుల్లో.. వివిధ అంశాలపై నియమించిన రాజ్యాంగ ధర్మాసనాలు ఉంటాయని, అదే విధంగా.. విచారణ చివరి దశలో ఉన్న పిటిషన్లపై మాత్రమే వాదనలు వినాలని నిబంధన తీసుకువచ్చింది. ఈ కారణంతో.. అమరావతిపై దాఖలైన పిటిషన్లు గత వారం విచారణకు రాలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.