ETV Bharat / state

Promises To AP: కేంద్రం ఇచ్చిన హామీలు.. రాబట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Jul 26, 2023, 7:42 AM IST

Updated : Jul 26, 2023, 8:51 AM IST

Union Govt on Promises To AP: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నిధులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం రాష్ట్రానికి సహకరించటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెక్కకుమించిన హామీలు ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ఇచ్చినా.. అవి నేటికి నెరవేరలేదు

Promises To AP
ఏపీకీ హామీలు

విభజన హామీలు సాధనలో జగన్‌ సర్కార్ విఫలం

Union Govt on Promises To AP: 25 మంది ఎంపీలను గెలిపించి ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచుతానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీరాలు పలికిన జగన్, సీఎం అయినతర్వాత నాలుగేళ్ల పాలనలో కేంద్రం నుంచి సాధించుకున్నది పెద్దగా ఏమీ లేదు. ప్రధానమంత్రితో సహా కేంద్ర అగ్రనేతలతో ముఖ్యమంత్రి జగన్ కలుస్తున్నప్పటికీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. అదిమాత్రమే కాకుండా దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్, రైల్వే జోన్‌ హామీలు.. నెరవేరడంలేదు. విద్యా సంస్థల ఏర్పాటులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ మంగళవారం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. అయినా వైసీపీ సభ్యుల నుంచి ఉలుకూ పలుకూ లేదు.

ఇప్పుడే కాదు గడచిన నాలుగుసంవత్సరాలుగా ఆ పార్టీ ఎంపీలదీ అదే వరస. ఈ నాలుగేళ్లలో చిన్నపాటి నిరసన కూడా తెలపలేదు. కనీసం అసంతృప్తి వ్యక్తం చేసే సాహసం కూడా చేయలేదు. నాలుగేళ్లుగా కేంద్ర పెద్దల దగ్గర అత్యంత వినయ, విధేయతలతో మెదులుతు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారు.

విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి సన్నాయి నొక్కులు నొక్కింది. మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఇచ్చిన సమాధానాలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన విధంగా ఉన్నాయి. చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టుల్లో దుగరాజపట్నం పోర్టు నిర్మాణం వీలుకాదని, కడప స్టీల్‌ప్లాంట్‌ లాభదాయకం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఒకవైపు చెబుతూనే మరోవైపు దుగరాజపట్నం పోర్టుకు బదులు మరో పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం చూపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పి ఆ అంశాలు ముగిసిపోయాయా? లేదంటే సజీవంగా ఉన్నాయా అన్నది తేల్చకుండా చేతులు దులుపుకున్నారు.

దుగరాజపట్నం పోర్టు నిర్మాణం ఎందుకు వీలుకాదు: విభజన చట్టం షెడ్యూల్‌ 13లో మౌలిక వసతుల జాబితాలో మొదటి స్థానంలో పేర్కొన్న దుగరాజపట్నం మేజర్‌ పోర్టు తొలిదశ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. అయితే ఈ ప్రభుత్వం దానికి పొరుగున ఉన్న పోర్టుల నుంచి పోటీ ఉన్నందున లాభదాయకం కాదని కొత్త వాదన తెరమీదికి తెచ్చింది. దాని స్థానంలో రామాయపట్నం నిర్మిద్దామనుకుంటే ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నాన్‌మేజర్‌ పోర్టు కింద నోటిఫై చేయడంతో దాని నిర్మాణం తాము చేపట్టలేమని కేంద్రం చెబుతోంది. ఒకవేళ దానినే కేంద్రం నిర్మించాలంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని మైనర్‌ పోర్టుల జాబితా నుంచి తొలగించాలని, లేదంటే మేజర్‌ పోర్టు నిర్మాణం కోసం మరో స్థలాన్ని గుర్తించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించినట్లు కేంద్రం చెబుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలో మేజర్‌ పోర్టు నిర్మిస్తామని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం ఎందుకు గుర్తించడంలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

కేంద్ర నిధులు "దారి" మళ్లించారు..మరి రహదారులు ఎప్పడు వేస్తారో..

కడప స్టీల్​ ప్లాంట్​ సాధ్యమెందుకు కాదు: వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధ్యయనం చేసి అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేయడం సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని తెలిపిందని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ ఒకవైపు చెబుతూనే.. రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి వీలుగా ఒక మార్గసూచిని తయారుచేసేందుకు ఉక్కుశాఖ ఆధ్వర్యంలో ఒక సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ని 2017లో ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఇది ఏర్పాటై ఆరేళ్లు గడిచినా ఆ కమిటీ ఏమి తేల్చిందన్న విషయాన్ని ఇప్పటివరకూ కేంద్రం బయటపెట్టలేదు. కడప స్టీల్‌ పరిశ్రమ సాధ్యం కాదని నేరుగా చెప్పకుండా కమిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి.

మరి పరిస్థితితేంటి: విభజన చట్టం హామీల అమలు గురించి ఎప్పుడు అడిగినా ‘చట్టంలోని చాలా అంశాలు ఇప్పటికే అమలుచేశాం. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మౌలిక వసతుల ప్రాజెక్టులు, విద్యాసంస్థలు లాంటి వాటి పూర్తికి సమయం పడుతుంది. చట్టంలోనే అందుకోసం పదేళ్ల గడువు ఇచ్చారు’ అన్న సమాధానం మంత్రుల నుంచి పరిపాటిగా వస్తోంది. అయితే ఎన్ని అంశాలు పూర్తయ్యాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, అవి ఎప్పటికి పూర్తవుతాయన్న విషయంలో స్పష్టత కరవైంది.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ గతేంటి: మౌలిక వసతుల ప్రాజెక్టుల పూర్తికి 10 ఏళ్ల గడువు ఉందని కేంద్రమంత్రి ఒకవైపు చెప్పినా మరోవైపు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పనులే మొదలుకాలేదు. ఈ జోన్‌ ఏర్పాటుపై 2019 ఫిబ్రవరి 27న అప్పటి రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. దీని ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం రూ.106.89 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు 2022 నవంబర్‌ 10న అనుమతి ఇచ్చినట్లు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ మంగళవారం లోక్‌సభకు చెప్పారు. ఈ పనుల కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 106 కోట్ల ప్రాజెక్టుకు ఇలా ఏటా 10 కోట్ల చొప్పున కేటాయిస్తూ పోతే అది పూర్తికావడానికి దశాబ్దం దాటే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి: రాష్ట్రంలో చేపట్టిన ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, గిరిజన, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పోలవరం, రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 21 వేల 154.568 కోట్లు విడుదల చేసినట్లు నిత్యానంద రాయ్‌ తెలిపారు. అయితే ఇవి ఎప్పటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నది మాత్రం అస్పష్టంగా ఉంది. అలాగే అనంతపురం కేంద్ర విశ్వవిద్యాలయం, విశాఖ పెట్రోలియం యూనివర్సిటీల స్థితిగతుల గురించి మంత్రి ప్రస్తావించలేదు. విభజన చట్టంలో చెప్పిన అంశాల అమలుపై కేంద్రహోంశాఖ ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేంద్రమంత్రి ఎంపీలు కేశినేని నాని, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు మంగళవారం బదులిచ్చారు. ఇప్పటివరకు 31 సమీక్షాసమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఇన్నిసార్లు సమావేశాలు నిర్వహించినా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన అంశం ఒక కొలిక్కిరాలేదు.

దిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ విభజన కూడా పూర్తి కాలేదు. అయితే ఈ విషయంలో కేంద్రం తామరాకు మీద నీటిబొట్టు తీరున వ్యవహరిస్తోంది. సమస్య పరిష్కారం అన్నది రెండురాష్ట్రాల బాధ్యతే తప్ప తమది కాదని చెబుతూ వస్తోంది. ‘ద్వైపాక్షిక అంశాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిష్కరించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం కేవలం సంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుంది’ అని మంగళవారం మంత్రి నిత్యానందరాయ్‌ చెప్పిన సమాధానం కేంద్ర ప్రభుత్వ వైఖరికి అద్దం పట్టింది.

విశ్వవిద్యాలయాలకు కేంద్రం నిధులు: అనంతపురంలో 450 కోట్ల రూపాయలతో కేంద్ర విశ్వవిద్యాలయం, 420 కోట్లతో ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే వీటి నిర్మాణాలు పూర్తికాకపోవడంవల్ల ఇవి ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయి. 450 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అనంతపురం కేంద్ర విశ్వవిద్యాలయానికి 2018-19 నుంచి 2022-23 వరకు కేంద్ర ప్రభుత్వం 147.48 కోట్లు విడుదల చేసింది. 2023-23 బడ్జెట్‌లో 47.40 కోట్లు కేటాయించింది. ఇవన్నీ కలిపితే 194.88 కోట్లవుతాయి. ఈ ప్రాజెక్టును 2024 డిసెంబర్‌కు పూర్తిచేయాలనుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం జూన్‌ 2న ఇనగంటి రవి అనే ఆర్‌టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అయితే ఇప్పటివరకు 43శాతం నిధులే ఇచ్చి 2024 డిసెంబర్‌ కల్లా ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

గిరిజన విశ్వవిద్యాలయం స్థల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తాత్సారం దానికి శాపంగా పరిణమిస్తోంది. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కొత్తవలస వద్ద కేటాయించిన స్థలాన్ని జగన్‌ ప్రభుత్వం రద్దుచేసింది. ఇప్పుడు విజయనగరం జిల్లా మెంటాడ మండలం చిన్న మేడపల్లి, మర్రివలస రెవెన్యూ గ్రామాల వద్ద స్థలాన్ని చూపింది. 2021 సెప్టెంబర్‌ 29న ఆ స్థలాన్ని చూసిన ఎంపిక కమిటీ అందుకు ఆమోదం చెబుతూ అదే ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ భూమిని గిరిజన విశ్వవిద్యాలయం పేరున బదిలీ చేయాలని సూచించింది.

ఒకసారి ఆ స్థలాన్ని విశ్వవిద్యాలయానికి అప్పగిస్తే డీపీఆర్‌ ప్రకారం అవసరమైన మాస్టర్‌ప్లాన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లాన్‌ తయారు చేసుకుంటామని విశ్వవిద్యాలయం పేర్కొంది. అయితే 2023 ఏప్రిల్‌ 4 నాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని విశ్వవిద్యాలయానికి అప్పగించలేదని ఆర్‌టీఐ యాక్ట్‌ కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న భూమిని విశ్వవిద్యాలయానికి బదిలీచేయాలని ఏప్రిల్‌ 4న ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అందులో తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 420 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2018-19 నుంచి 2022-23 వరకు రూ.24.39 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2023-24 బడ్జెట్‌లో రూ.37.67 కోట్లు కేటాయించింది. ఇవన్నీ కలిపినా ఇప్పటివరకు రూ.62.06 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు అవుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇది 14.77%మాత్రమే. పరిస్థితి ఇలా ఉంటే ఇది ఎప్పటికి పూర్తవుతుందన్నది చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Last Updated :Jul 26, 2023, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.