ETV Bharat / state

Liquor in AP: ప్రజల రక్తమాంసాలు తాకట్టు పెట్టి రూ.50 వేల కోట్ల రుణం.. కేంద్రం గగ్గోలు.. వెనకడుగు వేయని జగన్​ సర్కార్​

author img

By

Published : Jul 27, 2023, 6:56 AM IST

Liquor Income in AP: మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే అని ప్రకటించిన జగన్‌.... ఇప్పుడు అవే రక్త మాంసాలు తాకట్టు పెట్టి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. మద్యపానంతో ప్రజల జీవితాలు నాశనమవుతాయని పాదయాత్రలో పదే పదే చెప్పిన జగన్‌.. ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయంపై అప్పులు పుట్టించేందుకు ప్రజల జీవితాలు ఏమైపోతాయన్నది ఆలోచించడం లేదు. ప్రజల ఆరోగ్యాలు పణంగా పెట్టి ఇప్పటికే 38 వేల కోట్ల రూపాయలు తెచ్చి వాడేసిన జగన్.. మరో 12 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేశారు. మద్యంపై ఆదాయమే రుణాలకు ఆధారంగా మారడంతో ఈ అప్పులు రాజ్యాంగ విరుద్ధం, చెల్లదని కేంద్రం, రిజర్వుబ్యాంకు ఘోషించినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. అప్పులు తెచ్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అన్వేషిస్తోంది. తాజాగా జీరో కూపన్‌ పేపర్ల విధానంలో ఆగస్టు 10 లోపు 5 వేల కోట్లు తెచ్చేందుకు యత్నిస్తోంది.

Liquor Income in AP
Liquor Income in AP

Liquor Income in AP: మద్యంపై వచ్చే ఆదాయాన్ని జగన్‌ సర్కార్​ పెంచేసింది. అలా పెరిగిన ఆదాయం ఖజానాకు వచ్చినా.. కార్పొరేషన్లకు మళ్లిస్తోంది. లిక్కర్‌పై వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని ఆ మొత్తాన్ని వేరే కార్పొరేషన్‌.. ఇతర రూపాల్లో వసూలు చేసుకునే అధికారం కల్పించింది. ఆ రాబడిని చూపించి.. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేస్తోంది. అంటే ఏపీ ప్రజలు తాగుతూ ఉండాలి. వారి తాగుడుపై.. ఆ కార్పొరేషన్లకు రాబడి వస్తూ ఉండాలి. ఆ రాబడి నుంచి ఎప్పటికప్పుడు వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తూ.. ఆ అప్పులు తీరుస్తూ ఉండాలి. అంతిమంగా.. లక్షల జీవితాలు నాశనమైపోతున్నా జగన్‌ సర్కార్‌ అప్పులు తెచ్చుకుంటూ..ఉండాలి. ఇలా ఇప్పటికే 38 వేల కోట్ల రూపాయల మేర అప్పులు తెచ్చి వాడేశారు. మరో 12వేల కోట్లు అప్పు తీసుకునేందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వం బెవరేజస్‌ కార్పొరేషన్‌కు మళ్లీ గ్యారంటీలు ఇస్తూ.. కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది. అందులో 5 వేల కోట్లు రూపాయలను ఆగస్టు10 లోపు రుణంగా సమీకరించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా 11వేల 850 కోట్ల రూపాయల రుణం తాజాగా తీసుకువచ్చేందుకు వీలుగా.. జగన్‌ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఈ మేరకు జీవో 345 జారీ చేసింది. కార్పొరేషన్‌కు ఫైనాన్షియల్‌ సర్వీసు అందించేలా.. ఎంఎస్‌ టిప్సన్స్‌ కన్సల్టెన్సీ సర్వీసు లిమిటెడ్‌ను నియమించింది. ఈ అప్పులు కూడా.. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల రూపంలో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత 5 వేల కోట్లు రుణం తీసుకునేందుకు 9.62శాతం వడ్డీకి.. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను జారీ చేసింది. మే 15న ఇందుకు సంబంధించి ట్రేడింగ్‌ జరగాల్సి ఉండగా.. మే 11న ముంబయి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్‌ ఆపరేషన్లకు సంబంధించిన సీనియర్‌ మేనేజర్‌ మేరియన్‌ డిసౌజా ఈ ట్రేడింగ్‌లో సభ్యులు ఎవరూ పాల్గొనవద్దని.. ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు ఈ నోటీసులు జారీ చేశారన్న దానిపై స్పష్టత లేకపోయినా.. ఆ రుణ సమీకరణ మాత్రం సాధ్యం కాలేదు.

Zero Coupons Papers System: ఇప్పుడు తాజాగా వైసీపీ సర్కార్‌.. కొత్త ఎత్తుగడ వేసింది. సున్నా వడ్డీ పత్రాల రూపంలో ఈ డిబెంచర్లు జారీ చేస్తోంది. ఈ డిబెంచర్లు అమ్మి.. రుణాలు సమీకరిస్తారు. ఇంతకాలం నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను 9.62శాతం వడ్డీకి జారీ చేసి.. ప్రభుత్వం రుణాలు సమీకరించింది. ఇంత వడ్డీ అంటే దాదాపు పది సంవత్సరాలలో.. ఆ మొత్తం రెట్టింపు అవుతుంది. ముందే ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించడం వల్ల.. ఆ సొమ్ముపై పొందే అదనపు వడ్డీలతో డిబెంచర్లు పొందిన వారు........ అంతకన్నా ఎక్కువ మొత్తం ఆదాయం పొందే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు తాజా పద్ధతిలో సర్కారు వడ్డీ చెల్లించదు. అందువల్ల.. ఒక డిబెంచరు ముఖ విలువ కన్నా 50శాతం కంటే తక్కువకే.... అది ట్రేడ్‌ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ సర్కార్‌ ఇప్పటివరకూ మద్యంపై రాజ్యాంగ విరుద్ధంగా 38 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌-APSDCని ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించింది. వివిధ మద్యం డిపోలకు ఆ రూపంలో వచ్చే రాబడిని.. తొలుత సంచిత నిధికి మళ్లించి, అక్కడి నుంచి ఏపీఎస్‌డీసీకి.. మళ్లించింది. అదే ఆదాయాన్ని చూపించి వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి 25 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం రాబట్టింది. ఆ రుణం తీర్చేవరకు ఈ మద్యం రాబడిని వినియోగించుకుంటూ.. ఉండాల్సిందే. ఖజానాకు వచ్చే సొమ్మును కార్పొరేషన్‌కు మళ్లించాల్సిందే. ఈ విధానాన్ని.. కేంద్రం తప్పు పట్టింది.

AP Liquor Income: రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా.. వేరే కార్పొరేషన్‌కు మళ్లించి రుణాలు తీసుకోవడం తప్పు అని కేంద్రం, రిజర్వుబ్యాంకు.. తేల్చి చెప్పాయి. ఆ తర్వాత ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసి.. మద్యంపై వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుంది. మద్యంపై 130 శాతం నుంచి 190 శాతం వరకు.. వ్యాట్‌ వసూలు చేసేవారు. దాన్ని వివిధ కేటగిరీలపై.. 35 శాతం నుంచి 60 శాతానికి తగ్గించారు. ఇక్కడ తగ్గించిన మేరకు ఆ సొమ్మును బెవరేజస్‌ కార్పొరేషన్‌.. ప్రత్యేక మార్జిన్‌ రూపంలో నిబంధనలు సవరించి మరీ.. వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇలా వచ్చిన రాబడిని ఆ కార్పొరేషన్‌ ఆదాయంగా చూపి.. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల రూపంలో ఇంతవరకు 13 వేల 148.82 కోట్ల రూపాయలు.. రుణంగా సమీకరించారు.

తొలుత 2022 జూన్‌ 14న 9.62శాతం వడ్డీకి 8,305 కోట్లు బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా.. రుణం తీసుకున్నారు. తిరిగి 2022 డిసెంబరు 21న అదే వడ్డీ రేటుకు..మరో 17వందల కోట్లు సమీకరించారు. ఆ తర్వాత 2023 మార్చి 31న 8.50 శాతం వడ్డీకి 3వేల 143.82 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు 12వేల కోట్ల రుణానికి ప్రభుత్వం... గ్యారంటీ ఇచ్చింది. అందులో జీరో కూపన్‌ పేపర్ల ద్వారా ఆగస్టు 10 లోపు 5వేల కోట్లు సమీకరించనున్నారు. ఈ అప్పులు తీసుకునేందుకు.. ఖజానా రాబడి దాదాపు 8వేల 140 కోట్లు వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లకు మళ్లించేసినట్లైంది.

అంతేకాకుండా విలువైన ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేసింది. ఏపీఎస్‌డీసీ తరహాలో.. అప్పులు తేవడం తప్పు అని.. కేంద్ర ఆర్థికశాఖ తప్పు పట్టింది. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి.. వివరణ కూడా కోరింది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్లకు.. రుణాలు ఇచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకులను కూడా హెచ్చరించింది. ఈ క్రమంలో చాలా కాలం పాటు ఎస్‌బీఐ.. ఎపీఎస్‌డీసీకి 18వందల కోట్ల రుణం ఇవ్వకుండా నిలిపివేసింది. సాక్షాత్తూ సీఎం జగన్‌.. ఈ అప్పు ఇచ్చేందుకు సహకరించాలని ప్రధాని మోదీకి లేఖ రాయాల్సి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.