ETV Bharat / state

ఏపీ పద్దు హద్దు దాటుతోంది..! పరిమితికి మించి బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు : కాగ్ నివేదిక

author img

By

Published : Mar 24, 2023, 1:11 PM IST

Updated : Mar 24, 2023, 1:50 PM IST

CAG Report : ఏపీ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సమర్పించింది. గతేడాది పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు 24,257 కోట్ల రూపాయల మేర పెరిగాయని స్పష్టం చేసింది. బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయని తెలిపింది. 90 శాతం మేర రుణాలు 13.99 శాతం వడ్డీ తో తీసుకున్నవేనని నివేదికలో వెల్లడించింది.

కాగ్ నివేదిక
కాగ్ నివేదిక

CAG Report : 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదిక ను కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ కార్యాలయం సమర్పించింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రెవెన్యూ, రవాణా తదితర అంశాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన 6,356 కోట్ల రూపాయల గ్రాంట్ మురిగిపోయిందని నివేదికలో తెలిపింది. గత ఏడాది పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు 24,257 కోట్ల రూపాయల మేర పెరిగిందని స్పష్టం చేసింది.

బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు.. బడ్జేటేతర రుణాలు 1,18,394 కోట్ల రూపాయలు నమోదయ్యాయి. డిస్కమ్ లకు, నీటి పారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.17,804 కోట్లుగా ఉన్నాయి. వీటినీ బడ్జెట్ లో చూపక పోవటంతో కీలకమైన మౌలిక సదుపాయల కల్పనా నిధుల పై శాసనసభ నియంత్రణ కోల్పోయేందుకు కారణమైందని నివేదికలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 18.47 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. 2021 లో ఏపీ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించింది. తద్వారా ఆర్థిక రుణ పరిమితి పెంచుకునే ప్రయత్నం జరిగింది. 688 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లస్థలాలు, ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉంది. బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయని తెలిపింది.

రాష్ట్రం వాటా విడుదల చేయని ప్రభుత్వం... స్మార్ట్ పట్టణాలు, కృషి వికాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగ్గా అమలు కాలేదని తెలిపింది. రూ.3540 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా రాష్ట్రం వివిధ పథకాలకు తన వాటా విడుదల చేయలేదని వెల్లడించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో క్యాపిటల్ వ్యయం తక్కువగా ఉంది. ఇది భౌతిక ఆస్తుల కల్పనపై ప్రభావాన్ని చూపి దీర్ఘకాల ఆర్థికాభివృద్ధి కుంటుపడే అవకాశముందని స్పష్టం చేసింది. 2021-22 అర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు 3,72,503 కోట్లుగా ఉంది. ఇందులో 90 శాతం మేర రుణాలు 13.99 శాతం వడ్డీ తో తీసుకున్నవేనని కాగ్ నివేదికలో పొందు పరిచింది. 2018 నుంచి 2022 వరకూ అంతర్గత రుణాలు 77.54 శాతం మేర పెరిగాయి. గడచిన 5 ఏళ్లలో తలసరి రుణం 61 శాతం మేర పెరిగింది, బడ్జెటేతర రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం రూ.92,797గా నమోదైంది. వచ్చే ఏడేళ్లలో రాష్ట్రప్రభుత్వం 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాలని నివేదిక లో తెలిపింది.

ఇవీ చదవండి :

Last Updated :Mar 24, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.