ETV Bharat / state

నత్తనడకన పోలవరం పనులు.. ఏడాది కాలంలో 3శాతం లోపే!

author img

By

Published : Apr 2, 2023, 7:49 AM IST

‍‌Dam Design Review Committee on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు.. నత్తే నవ్వుకునేలా సాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3శాతం లోపే పనులు చేశారు. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కల సాకారం అయ్యేది ఎప్పుడన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Polavaram Project
Polavaram Project

నత్తనడకన పోలవరం ప్రాజెక్టు.. ఏడాది కాలంలోని పనులు 3శాతం లోపే!

‍‌Dam Design Review Committee on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మార్చి మొదటివారంలో.. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ నిపుణులు, పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ అధికారులు, కేంద్ర జలసంఘం అధికారులు సందర్శించి.. ఈ ఏడాది కాలంలో జరిగిన పనులపై నివేదిక ఇచ్చారు. ఆ గణాంకాల ప్రకారమే ఇక్కడ 2.86 శాతం మాత్రమే పనులు జరిగాయని నివేదించారు. గత నాలుగేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇదే పరిస్థితి ఎలాంటి పురోగతీ లేదు.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతో మళ్లీ టెండర్లు పిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ఈ పనులు చేపట్టింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రధాన డ్యాం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఎడమ కాలువ పనులకు, పునరావాస పనులకు.. వేర్వేరు గుత్తేదారులున్నారు. పనులు ఆలస్యం కావడానికి కొన్నాళ్లు కరోనా.. తర్వాత వేరే కారణాలు చెప్పారు. నిర్మాణంతో సంబంధం లేని పునరావాసం పనులు పూర్తి చేయడం లేదు. ఎడమ కాలువ పనులు ముందుకు సాగడం లేదు. డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చి ఆ పనులు పూర్తి చేసేవరకూ ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభించడంలో ఆలస్యానికి అంతో ఇంతో కారణం తప్ప, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, అనుబంధ పనులు, పునరావాస పనుల పూర్తికి ఏ ఇబ్బందులు లేకపోయినా పోలవరం ముందుకు సాగడం లేదు.

ప్రధాని మోదీతో రాజకీయాలకు అతీతమైన బంధముందని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. ఎన్నోసార్లు దిల్లీ వెళ్తూ.. పోలవరం నిధుల కోసం ప్రతిసారీ అడుగుతూనే ఉన్నామని చెప్తూ వచ్చారు. 22 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో ఒక నొక దశలో వైసీపీ మద్దతు లేకపోతే గట్టెక్కలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఎంపీల అవసరం కేంద్రానికి ఏర్పడ్డ సందర్భంలోనూ సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేరిన దాఖలాలు లేవు. ఒకవైపు పోలవరంపై రాష్ట్రం ఖర్చుచేసిన దాదాపు 2,600 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రావాలి. ఆ నిధుల్లో తాజాగా 826 కోట్ల రూపాయలే వచ్చాయి.

కేంద్రం నియమించిన రివైజ్‌ కాస్ట్ కమిటీ ఆమోదించిన ప్రకారం ప్రాజెక్టుకు 47వేల725 కోట్ల రూపాయలు అవసరం. విద్యుత్ కేంద్రం నిధులు, ఇంత వరకు కేంద్రం ఇచ్చిన నిధులు మినహాయిస్తే, ఇంకా మరో 25 వేల కోట్లకుపైగా నిధులు కేంద్రం నుంచి రావాలి. కానీ ఏడాదికి కేంద్రం నుంచి సగటున 1800కోట్ల రూపాయలే వస్తుంటే.. ఇక ఎప్పటికి పోలవరం పూర్తవుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే అంచనాలు ఏ స్థాయిలో పెరిగి మరింత భారంగా మారతాయనే అంశమూ చర్చనీయాంశమవుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.