ETV Bharat / state

యువతిది ఆత్మహత్యా..? పరువు హత్యా..?

author img

By

Published : May 28, 2020, 10:58 PM IST

యువతిది ఆత్మహత్య? లేక పరువు హత్య ?
యువతిది ఆత్మహత్య? లేక పరువు హత్య ?

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ఈ నెల 26న 20 ఏళ్ల ఓ యువతి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దల అభ్యంతరంతో ప్రేమ విఫలమైన ఈ యువతి ఆత్మహత్య చేసుకుందా..? లేక పరువు హత్య జరిగిందా..? అన్న అనుమానం స్థానికులను కలవరపెడుతోంది. ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల యువతి, ఇదే మండలానికి చెందిన మరో యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో ప్రేమవివాహం చేసుకోవడానికి రెండు నెలల కిందట మదనపల్లె పోలీసులను ఆశ్రయించారు. వారిది పుంగనూరు మండలం కావటంతో అక్కడి పోలీస్ స్టేషన్​లో కలవాలని మదనపల్లి పోలీసులు సూచించారు. దీంతో పుంగనూరు పోలీస్ స్టేషన్​లో ఇరు వర్గాల పెద్దలను పిలిపించి విచారించారు. విచారణ అనంతరం రెండు కుటుంబాల పెద్దలు తమ పిల్లలను తీసుకుని వారి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఈ నెల 26వ తేదీ రాత్రి యువతి మృతి చెందడంతో అదే రోజు రాత్రి దహనం చేశారని ప్రచారం జరుగుతోంది. యువతి మనస్థాపానికి గురై ఉరి వేసుకొని మృతి చెందినట్లయితే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రేమ పెళ్లికి అంగీకరించని తల్లిదండ్రులకు యువతి ఎదురు తిరగడంతో.. కుటుంబసభ్యులే కొట్టి చంపేసి దహనం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.