ETV Bharat / state

YCP Attack on Common Man: రాజంపేట యువకుడిపై వైసీపీ అనుచరుల దాడి..

author img

By

Published : Jun 12, 2023, 1:33 PM IST

Updated : Jun 12, 2023, 2:28 PM IST

YCP Followers Attack on Common Man: ప్రశ్నించేవారి గొంతు నొక్కడం, బహిరంగంగానే దాడులకు పాల్పడటాన్ని అలవాటుగా మార్చుకున్న వైసీపీ నేతలు, వారి అనుచరులు.. మరోసారి బరితెగించారు. ప్రభుత్వ పాలనపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన ఓ సామాన్యుడిపై.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు అతడ్ని కాపాడి.. దాడికి పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకున్నారు.

ycp leader attack on common man
సామాన్యుడిపై వైసీపీ కార్యకర్తల పాశవిక దాడి

YCP MLA Followers Attack on Common Man: వైసీపీ నాయకులు, వారి అనుచరుల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రభుత్వం, వైసీపీ నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ గొంతెత్తేవారిని వెంటాడి మరీ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకోవడం కలకలం రేపింది. రాజంపేటకు చెందిన చిరు వ్యాపారి పత్తి మణిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరులు కత్తులు, రాడ్లతో పాశవికంగా దాడి చేశారు.

''ఇది రాచరిక పాలన కాదు. వారసత్వ రాజకీయం చేయడానికి.. ఇది ప్రజాస్వామ్యం'' అంటూ.. పత్తి మణి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ నేతను ఉద్దేశించి చేసినవేనని భావించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరులు.. పత్తి మణిని అపహరించి దాడి చేశారు. రాజంపేట హరిత హోటల్‌లో వేచి చూసిన వైసీపీ కార్యకర్తలు.. అక్కడికి రావాలని పత్తి మణికి ఫోన్‌ చేశారు. పోస్టు పెట్టినందుకు.. వచ్చి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించడంతో.. పత్తి మణి అక్కడికి వెళ్లారు.

వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వినకుండా.. రెండు వాహనాల్లో వచ్చిన వైసీపీ కార్యకర్తలు.. అతడ్ని కిడ్నాప్‌ చేసి వాహనంలో తీసుకెళ్లారు. రాజంపేట నుంచి ఓబులవారిపల్లె మీదుగా చిట్వేలు వరకు వాహనంలో కొట్టుకుంటూ తీసుకెళ్లారని బాధితుడు వాపోయారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఒక కన్ను మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

పత్తి మణి కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు.. చిట్వేలు ప్రాంతంలో వైసీపీ కార్యకర్తల రెండు వాహనాలను అడ్డగించి.. బాధితుడ్ని కాపాడారు. రెండు వాహనాల్లో ఉన్న 12 మంది వైసీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడ్ని చిట్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాజంపేటకు చెందిన నలుగురు వైసీపీ కార్యకర్తల సహాయంతోనే.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరులు తనను అపహరించి దాడి చేశారని.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలు వచ్చిన రెండు వాహనాల్లో ఒకదానిపై.. హ్యూమన్‌ రైట్స్‌ పేరుతో నంబర్ ప్లేటు ఉండటం చర్చనీయాంశంగా మారింది. పత్తిమణిపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడిని.. ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో పౌరులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోతోందని ధ్వజమెత్తాయి.

"వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్​ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని.. ఆయన అనుచరులు రాజంపేటకు వచ్చి.. నన్ను ఓ హోటల్​కి రమ్మన్నారు. దీంతో నేను అక్కడికి వెళ్లాను. ఈ క్రమంలో వారు ఎమ్మెల్యేకు నన్ను క్షమాపణలు చెప్పమన్నారు. నేనేం తప్పు చేశాను..? నేనెందుకు క్షమాపణలు చెప్పాలని అడిగాను. దీంతో నన్ను కిడ్నాప్ చేసి.. ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేశారు." - పత్తి మణి, బాధితుడు

ఇవీ చదవండి:

Last Updated :Jun 12, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.