ETV Bharat / state

Accident: కుటుంబమే.. కూలిపోయింది

author img

By

Published : Oct 30, 2021, 6:53 PM IST

Updated : Oct 31, 2021, 6:49 AM IST

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

18:51 October 30

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

విధి ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో.. ఎవరికీ తెలియదు. శుభకార్యంలో పాల్గొనేందుకు ఆనందంగా కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని పంక్చరు రూపంలో మృత్యువు కబళించింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన సంఘటన శనివారం సాయంత్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బత్తలపల్లి మండలం జ్వాలాపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం కారు, లారీ ఢీకొన్న ఘటనలో అమ్మాజీ (50), ఆమె కొడుకు రెడ్డి బాషా (25), కూతురు రేష్మా (30), అల్లుడు బాబు బుడాన్‌ (36) మృతి చెందారు. జాస్మియాబాను అనే చిన్నారికి గాయాలయ్యాయి.

తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లికి చెందిన అమ్మాజీ, రెడ్డిపీరా కుటుంబం జీవనాధారం కోసం 15 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లా మదనపల్లెకి వెళ్లింది. రెడ్డిపీరా క్రషర్‌ మిషన్‌లో పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఏటా ఖరీఫ్‌లో పెద్దకడపలవారిపల్లికి వచ్చి పంటలు సాగు చేస్తుండేవారు. అనంతపురంలో ఆదివారం జరిగే బంధువుల వివాహ కార్యక్రమానికి వీరంతా మదనపల్లి నుంచి కారులో బయలుదేరారు. జ్వాలాపురం వద్దకు రాగానే కారు టైరు పంక్చరు కావడంతో అదుపుతప్పి అనంతపురం నుంచి చెన్నై వెళుతున్న లారీని ఢీకొంది. కారు - లారీ వేగంగా ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే నలుగురూ మృతి చెందారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ  రమాకాంత్‌, బత్తలపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం పెద్దకడపలవారిపల్లి, మదనపల్లెలో నక్కలదిన్నెలోని బంధువుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. రెడ్డిపీరా కన్నీటిపర్యంతమయ్యారు. దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. ప్రమాద ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదంలో మృత్యువాత పడ్డ కుటుంబీకులు..

ఇక్కడే ఉన్నా బాగుండు..

అనంతపురంలో సమీప బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు మదనపల్లె నుంచి కారులో బయల్దేరిన అమ్మాజీ కుటుంబం తనకల్లులోని గ్యాస్‌ కార్యాలయ సమీపంలో నివాసముండే మేనమామ హుస్సేన్‌సాబ్‌ను కలిసింది. మేనమామ ఇంటికి వెళ్లి టీ తాగిన అమ్మాజీ, కుమార్తె రేష్మా, అల్లుడు బాబు, కుమారుడు రెడ్డిబాషాలు అనంతరం శనివారం సాయంత్రం అనంతపురానికి బయలుదేరారు. వివాహం ఆదివారం ఉన్నందున రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళ్లాలని చెప్పామని, తమమాట విని ఉంటే ప్రాణాలతో ఉండేవారని హుస్సేన్‌సాబ్‌ కుటుంబ సభ్యులు విలపించారు. తమ యోగక్షేమాలు ఆరా తీసి వెళ్లిన గంటలోనే ఇలాంటి విషాదకర మాట వినాల్సి వచ్చిందని రోదించారు.

మృత్యుంజయురాలు ఆ చిన్నారి

చికిత్స పొందుతున్న చిన్నారి జాస్మియాబాను

చికిత్స పొందుతున్న బాలిక..

ఈ ప్రమాదంలో జాస్మియాబాను అనే అయిదేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ప్రమాద సమయంలో చిన్నారి కారులో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు గమనించి బాలికను వెలికితీశారు. వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం నగరంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. అమ్మ, అమ్మమ్మ మధ్యన కూర్చొని ప్రయాణిస్తుండటం వల్లే చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడిందని బత్తలపల్లి పోలీసులు తెలిపారు.

ప్రాణం నిలిపిన పింఛను..

రెడ్డిపీరా తల్లి ఇమామ్‌బీ సైతం కారులో వివాహానికి బయలుదేరి వెళ్లింది. నవంబరు 1న వృద్ధాప్య పింఛను తీసుకోవాలన్న విషయం గుర్తు చేసుకున్నారు. మార్గమధ్యలోనే ఆమె స్వగ్రామం అనంతపురం జిల్లా తనకల్లు మండలం కడపలవారిపల్లెలో విడిచిపెట్టి వెళ్లారు. దీంతో వృద్ధురాలు ప్రాణాలతో బయటపడ్డారంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి

Suicide: 

హాస్టల్ నిర్వాహకుడి ఆత్మహత్య.. సూసైడ్ నోట్​లో ఏముందంటే..

Last Updated :Oct 31, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.