ETV Bharat / state

ఖమ్మం జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు.. కేంద్ర విధానాలపై నిప్పులు

author img

By

Published : Jan 18, 2023, 6:09 PM IST

KCR in  Khammam meeting
సీఎం కేసీఆర్

CM KCR Comments: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖమ్మం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రసంగించిన సీఎం.. ఖమ్మం ప్రజలకు పలు హమీల వర్షం కురిపించారు.

CM KCR Comments: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభకు తరలివచ్చిన ఆత్మీయ బంధువులకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు. ఖమ్మంలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ తరువాత 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్లు హామీనిచ్చారు. 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అని వివరించారు. ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ఖమ్మం మున్నేరు నదిపై వంతెన నిర్మాణంతో పాటు.. ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తూ హామీల వర్షం కురిపించారు.

కేంద్ర విధానాలపై..

చాటలో తవుడు పోసి.. కుక్కల కొట్లాట: కేంద్ర వైఖరి చాటలో తవుడు పోసి.. కుక్కల కొట్లాట పెట్టినట్లుందిగా తయారైందని కేసీఆర్ విమర్శించారు. డొల్ల మాటలు, కల్ల మాటలతో పొద్దుపుచ్చే పరిపాలన అని మండిపడ్డారు. దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందని .. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుందని ఆరోపించారు. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉందని.. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదని పేర్కొన్నారు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉందని తెలిపారు. కానీ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని అన్నారు. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయిందని విమర్శించారు. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్: జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని కేసీఆర్ అన్నారు. చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉందని పేర్కొన్నారు. కానీ దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా అని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని కేసీఆర్‌ నిలదీశారు.

"దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుంది. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారు. - సీఎం కేసీఆర్

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.