ETV Bharat / state

మన్యంలో ‘అనంత’ అక్రమాలు అనేకం

author img

By

Published : May 24, 2022, 5:16 AM IST

mlc Ananthababu
mlc Ananthababu

తాను చెప్పిందే వేదం.... తన మాటే శాసనం.... కోట్ల విలువైన రంగురాళ్ల వ్యాపారం నుంచి మన్యంలో కలప అక్రమ రవాణా, అనధికారిక మట్టి తవ్వకాలు, ఇసుక దోపిడీ, పేకాట శిబిరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలన్నీ తన కనుసన్నల్లోనే సాగాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన్యంలో ఏం జరిగినా దానికి కర్త, కర్మ, క్రియా అన్నీ తానే కావాలి. ఇదీ అధికారం అండతో చెలరేగిపోతున్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తీరు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరు తెచ్చుకో వడంతో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సహచర నాయకులు సైతం ఆయనను చూసి బెదిరే పరిస్థితి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంలో... 'అనంత' అక్రమాలు అనేకం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేరిన రంపచోడవరం డివిజన్‌లో ‘అనంత’ అక్రమాలు అనేకం. అడ్డతీగల మండలం గొంటువానిపాలెంలో బినామీల పేరిట మెటల్‌ క్వారీలు, చేపల చెరువులు నడుస్తున్నాయి. మన్యం నుంచి కలప విచ్చలవిడిగా హద్దులు దాటుతోంది. గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యవహారంలోనూ అనంత మాటే శాసనమనే ప్రచారం ఉంది. ఇంత జరుగుతున్నా ఆయన చేతికి మట్టి అంటదు. అక్రమాలు కళ్లెదుట సాగిపోతున్నా అధికారులు ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఏజెన్సీలో పనులు చేపట్టే గుత్తేదారులు, ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి పెద్దమొత్తంలో వాటాలు అందాల్సిందేననే ప్రచారం ఉంది. గతంలో అడ్డతీగల పోలీసు స్టేషన్‌లో అనంతబాబును రౌడీషీటర్‌గా గుర్తించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రౌడీషీట్‌ ఎత్తేయించారు. అనంతబాబు తండ్రి అనంత చక్రరావు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో గిరిజన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో మావోయిస్టులు ఆయనను కాల్చి చంపారు. అనంతబాబు జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నప్పుడూ మావోయిస్టులు ఎత్తుకెళ్లి ప్రజాకోర్టు నిర్వహించి హెచ్చరించి వదిలేశారు. అయినా అక్రమాలు ఆగలేదు సరికదా అధికారం చేతిలోకి వచ్చాక వాటి తీవ్రత మరింత పెరిగింది.

మన్యంలో ‘అనంత’ అక్రమాలు అనేకం

నేనే రాజు.. నేనే మంత్రి : రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామానికి చెందిన అనంత ఉదయ భాస్కర్‌ సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్సీగా ఎదిగారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన 1998లో కాంగ్రెస్‌లో కార్యకర్తగా చేరారు. 2001లో తూర్పుకాపు కోటాలో అడ్డతీగల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006లో కొండ కాపుగా (ఎస్టీ) నకిలీ కుల ధ్రువపత్రంతో అడ్డతీగల ఎంపీపీ అయ్యారు. వైకాపా ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా, రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేశారు.
* 2014 శాసనసభ ఎన్నికల్లో కొండకాపుగా (ఎస్టీ) నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్‌ వేశారు. ప్రత్యర్థులు అనంతబాబు ఎస్టీ కాదని ఆధారాలు చూపించడంతో నామినేషన్‌ తిరస్కరణకు గురయింది. దీంతో నామినీగా ఉన్న వంతల రాజేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందినా.. అనంతబాబు అన్నీ తానై వ్యవహరించారు. రాజేశ్వరి ఏటీఎం కార్డు తనదగ్గరే అట్టిపెట్టుకుని వచ్చే గౌరవ వేతనాన్ని ఆయనే తీసుకునేవారనే ప్రచారం ఉంది. గుత్తేదారుల నుంచి ముక్కుపిండి మరీ పర్సంటేజీలు ఆయనే వసూలు చేసేవారనేది ఆరోపణ. దీంతో మనస్తాపం చెందిన రాజేశ్వరి వైకాపాను వీడి 2017లో తెదేపాలో చేరారు.
* అనంతబాబు 2019లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మిని నిలబెట్టి గెలిపించారు. పేరుకే ధనలక్ష్మి ఎమ్మెల్యే. ఆమెను ఎవరు కలవాలన్నా, ఏ పని గురించి అడగాలన్నా ముందు అనంతబాబును కలవాల్సిందే. దీంతో ఎమ్మెల్యే వర్గం లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నా చేసేది లేక మిన్నకుండిపోయింది. ఏ అధికారిక కార్యక్రమమైనా అనంతబాబుకే పెద్దపీట. ఒకవేళ ఎమ్మెల్యే ముందుగా హాజరైనా ఆయన వచ్చేవరకు నిరీక్షించాల్సిందే. ఫ్లెక్సీలపైనా, శిలాఫలకాలపైనా సముచిత గౌరవం దక్కకపోతే ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతారని అధికారులూ భయపడతారు.
* తన కనుసన్నల్లోనే ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రజాప్రతినిధి నడవాలనేది అనంతబాబు నైజం. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజాప్రతినిధులుగా ఎవరిని నిలబెట్టాలన్నా ఆయన పచ్చజెండా ఊపాల్సిందే. ఎవరు గెలిచినా పాలన అంతా తన కనుసన్నల్లో జరగాల్సిందే.. అనుచరులతో బెదిరింపులు, దందాలూ ఇక్కడ సాధారణం.. అందుకే ఆయన పేరెత్తితే మన్యం వణుకుతోంది. అక్కడ ఇంకా బయటకు పొక్కని అక్రమాలెన్నో. జిల్లాల విభజన తర్వాత పరిస్థితి మరీ దిగజారి, మన్యంలో అక్రమాల ఘోష బయటకు వినపడని పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ నెట్టాడు.. తలకు దెబ్బతగిలి డ్రైవర్ చనిపోయాడు : ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.