ETV Bharat / opinion

అంగట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కీలక సమాచారం.. I PACకు చేరిన బ్యాంకు అకౌంట్స్, ఆధార్‌ వివరాలు

author img

By

Published : Jul 27, 2023, 12:13 PM IST

Volunteers data theft row
అంగట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కీలక సమాచారం

Volunteers data theft row: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ... డేటా చౌర్యంలో భాగస్వామిగా మారిందా... ప్రజల వ్యక్తిగత సమాచారం "ఐ" ప్యాక్ లాంటి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోందా. ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. ఇటీవల వాలంటీర్లు ప్రజల డేటా సేకరించడం, దాన్ని ప్రైవేటుసంస్థలకు చేరవేస్తున్న వ్యవహారాలపై పెనుదుమారమే రేగింది. ఈ అంశం.. రాజకీయంగా తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమైంది. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రజల ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు నేరుగా హైదరాబాద్ లోని ఊరూ పేరు తెలియని కొన్ని కంపెనీలకు బదలాయిస్తున్నారని ఆక్షేపణ వ్యక్తమైంది. మరి గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని వాలంటీర్లు ఏ ప్రాతిపదికన సేకరిస్తున్నారన్నది ఇప్పుడు జవాబు లేని ప్రశ్నగా మారింది.

Volunteers data theft row: నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టాలి, ప్రజల బ్యాంకు ఖాతా వివరాలు ప్రైవట్‌ సంస్థలకు ఇచ్చారంటూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌... ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యత, డేటా చౌర్యంపై తీవ్ర ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు ఆయన పరిపాలనలో ప్రజలకు పౌర సేవలను చేరువ చేసేందుకు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటరీర్ల వ్యవస్థ తీవ్ర ఆరోపణలకు కేంద్రంగా మారింది. ఇళ్ల వద్దకు వచ్చి వివిధ సేవలకు సంబంధించి అవసరమైన సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాలు డేటా చౌర్యానికి దారి తీస్తున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలకు సంబంధించిన అత్యంత గోప్యమైన ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాల సమాచారం ప్రభుత్వ యాప్‌ల ద్వారా సేకరించి దాన్ని ఐప్యాక్ లాంటి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి. 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందిన అత్యంత విలువైన సమాచారాన్ని, గోప్యంగా ఉంచాల్సిన డేటాను రాష్ట్ర సరిహద్దులు దాటించి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌ గూడలో ఉన్న ఊరూ పేరూ లేని కంపెనీలకు చేరవేరుస్తున్నారు.

Volunteers data theft row
అంగట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కీలక సమాచారం

ప్రభుత్వమే డేటా చౌర్యాన్ని వాలంటీర్ల ద్వారానే చేయిస్తోందంటూ విపక్షాలు ఆధారాలను కూడా బయటపెట్టాయి. అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ సలహాలు ఇస్తున్న ఐప్యాక్ సంస్థకు చెందిన ఉద్యోగులనే.....వివిధ కంపెనీ ఉద్యోగులుగా చూపిస్తూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారికి అందజేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రహస్యంగా ఉండాల్సిన ప్రభుత్వ డేటాను హైదరాబాద్‌లోని ఊరుపేరు తెలీని కంపెనీలకు ఇవ్వటంపై సందేహాలు రేగుతున్నాయి. నానక్‌రామ్‌గూడాలోని రామ్ ఇన్ఫో లిమిటెడ్, యూనీ కార్పొరేట్ సొల్యూషన్స్, పీకే కార్పొరేట్ సొల్యూషన్స్, ఉపాధి టెక్నో సర్వీసెస్, సిటిజెన్స్ సంస్థలకు ప్రజల సమాచారం వెళుతోంది. అక్కడున్న కంప్యూటర్లు, సర్వర్‌లలో కోట్లాది మంది ప్రజల ఆధార్ కార్డు నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు నిక్షిప్తం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Volunteers data theft row
అంగట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కీలక సమాచారం

ప్రభుత్వశాఖల వద్ద భద్రంగా ఉండాల్సిన డేటా.. ప్రైవేటుసంస్థలకు ఏ ఉద్దేశంతో వెళుతోంది ? ఎవరు సేకరించాలని ఆదేశించారు? ఎందుకు సేకరిస్తున్నారు? అనే అంశాలన్నీ చాలా పెద్ద ప్రశ్నలుగా మారుతున్నాయి. ఈ డేటా విశ్లేషించి.. దుర్వినియోగం చేసేందుకు వాడుతున్నారా, లేక రాజకీయ కోణంలో మరేదైనా కుట్రకు పాల్పడుతున్నారా అన్న అంశాలు బహిర్గతం కావాల్సి ఉంది. రామ్ ఇన్ఫో డైరెక్టర్ జయేష్ రావు, గుర్రం సాయికిరణ్ పూర్ణదుర్గ, దినేష్ తదితరులంతా ఐప్యాక్ ఉద్యోగులే కావటం విపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. ఐప్యాక్ కోర్ టీమ్ మెంబర్ దినేష్ మోరేను తూర్పు గోదావరిజిల్లాలోని వాలంటీర్ల ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ గతంలో ఆ జిల్లా గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది కూడా ఆరోపణల్ని మరింత ధృవీకరిస్తోంది. మరోవైపు ప్రజల నుంచి సేకరిస్తున్న డేటా విశ్లేషించి ఉపయోగించేందుకు వీలుగా ఆయా సంస్థలతో రాష్ట్రప్రభుత్వం 2020లోనే ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఏటా రూ.69కోట్లు చెల్లించేందుకు అంగీకరించిం ది. అంటే ప్రభుత్వ డబ్బుతో ఐప్యాక్ ద్వారా చేస్తున్న డేటా సేకరణ తిరిగి అధికార పార్టీ వైసీపీకి చేరుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Volunteers data theft row
అంగట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కీలక సమాచారం

వ్యక్తిగత సమాచార గోప్యత దేశ ప్రజలహక్కు. దీన్ని సుప్రీం కోర్టు కూడా ధృవీకరించింది. అసలు ఆధార్ కార్డు వివరాలు, ఓటర్‌ ఐడీ, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్లు వంటి వివరాలు ప్రైవేటు వ్యక్తి వద్ద ఉంటే అది నేరం కూడా. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కూడా ప్రజల డేటాను సేకరించడం తీవ్రమైన నేరమని చెప్పుకొచ్చిన తీరుని ఇప్పటికే మనం చూశాం. ఈ సమాచారం ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండటం శిక్షార్హం, చట్టవిరుద్ధమని ఆయన అప్పట్లో పదేపదే నొక్కిచెప్పారు. అలాంటిది ఇప్పుడు ఆయన ప్రభుత్వమే వాలంటీర్ల ద్వారా ప్రజల ప్రైవేటు డేటాను సేకరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్ వివరాలు తప్పనిసరి అని చెబుతూ వాలంటీర్లు ప్రజల నుంచి ఈ వివరాలను బలవంతంగా తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

Volunteers data theft row
అంగట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కీలక సమాచారం

ప్రజలు వ్యక్తిగత వివరాలు ఇవ్వకుంటే పథకాలు రావంటూ వాలంటీర్లు.. ప్రజలను భయ పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చేసేది లేక క్షేత్రస్థాయిలో ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను వాలంటీర్లకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీతో పాటు ప్రభుత్వమే ఇలా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడుతూ డేటా సేకరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. G.O. నెంబరు 13, 16 ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే F.A.O ద్వారా రామ్ ఇన్ఫో సంస్థకు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. విపక్షంలో ఉన్నపుడు డేటా చౌర్యంపై నానా యాగీ చేసిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలకు కనీసం ఇప్పుడు నోరు కూడా విప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను ఎక్కడ నిల్వ చేస్తున్నారు. స్వచ్ఛందంగా సేవలు అందించాల్సిన వాలంటీర్లకు ఈ డేటా సేకరించాలన్న అధికారాన్ని, ఆదేశాలను ఎవరిచ్చారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆధార్ డేటా ఇవ్వటం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే చెబుతుంటే ప్రభుత్వంలో భాగం కాని వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఈ వివరాలను ఎలా సేకరిస్తోంది అన్న దానిపై సందేహాలు వెలువడుతున్నాయి. దీనిపై మాట్లాడిన ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా విస్తృతమైన ప్రజల డేటాను ఏ రాజకీయ అవసరాల కోసం సేకరించి వినియోగిస్తున్నారన్న విషయం తేలాల్సి ఉంది.

Volunteers data theft row
అంగట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కీలక సమాచారం

ఇదీ చదవండి: 1. వాలంటీర్​ వ్యవస్థను పావుగా వాడుకుంటున్న ప్రభుత్వం..!

2. డేటా పరిరక్షణ బిల్లు.. పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ 'కవచం'!

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.