Disha Case: 'సరిగా నడవలేని నా భర్త... పోలీసులను ఎలా ప్రతిఘటించగలడు..?'

author img

By

Published : Sep 15, 2021, 7:57 AM IST

Disha Case

దిశ(disha case) నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో విచారణను సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) ముమ్మరం చేసింది. కమిషన్ ముందుకు మృతుడు చెన్నకేశవులు భార్య హాజరయ్యారు. సరిగ్గా నడవలేని చెన్నకేశవులు... పోలీసుల నుంచి ఎలా పారిపోగలడని వాంగ్మూలం ఇచ్చారు. తనకు న్యాయం చేయాలని కమిషన్​ను కోరారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం విధితమే. అయితే తమ వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించలేదని... పోలీసులే కావాలని ఎన్​కౌంటర్​ చేసినట్లు మృతుల కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీనిలో భాగంగా సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) విచారణను వేగవంతం చేసింది.

కమిషన్ ముందుకు మృతుడు చెన్నకేశవులు భార్య మంగళవారం హాజరయ్యారు. చెన్నకేశవులు సరిగా నడవలేడని... అలాంటి వ్యక్తి పోలీసులనుంచి తప్పించుకుని ఎలా పారిపోగలడని... వాంగ్మూలం ఇచ్చింది. తనకు తగిన న్యాయం చేయాలని కమిషన్​ను కోరింది. దిశ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుకతో పాటు... చెన్నకేశవులు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కమిషన్ ప్రశ్నించింది.

చెన్నకేశవులు వయసును పాఠశాలలో ఎలా నమోదు చేశారని గుడిగండ్లు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాద్యాయుడిని కమిషన్ ప్రశ్నించింది. తల్లిదండ్రులు చెప్పిన వయసు ఆధారంగానే పాఠశాలల్లో చేరేటప్పుడు రికార్డుల్లో నమోదు చేస్తామని ప్రధానోపాధ్యాయుడు కమిషన్​కు వివరించారు. రేణుక దాఖలు చేసిన అఫిడవిట్​లోని పలు అంశాలను ప్రభుత్వ తరఫు న్యాయవాది సురేందర్ రావు లేవనెత్తారు. రేణుకను పలు ప్రశ్నలు అడుగగా... దానికి ఆమె సమాధానమిచ్చారు. ఎన్ కౌంటర్ మృతులు జొల్లు నవీన్, జొల్లు శివ కుటంబ సభ్యుల నుంచి సిర్పూర్కర్ కమిషన్ నేడు వాంగ్మూలం తీసుకోనుంది.

ఇదీ చూడండి: Disha Encounter: నిర్వాసితులపై ఇంత నిర్లక్ష్యమా ?: ఎస్టీ కమిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.