ETV Bharat / city

MOTHER MURDERED BABY IN VISAKHAPATNAM: కన్నతల్లి కర్కశత్వం.. నీటి డ్రమ్ములో పడేసి దారుణంగా చంపేసింది

author img

By

Published : Nov 27, 2021, 5:59 PM IST

Updated : Nov 27, 2021, 7:27 PM IST

తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన ఆ చిన్నారి నీటి డ్రమ్ములో శవమై తేలింది. ఏం జరిగిందని విచారణ జరపగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. (MOTHER MURDERED BABY IN VISAKHAPATNAM)కన్నతల్లే తన కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు హతాశులయ్యారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన విశాఖ జిల్లా ఏఎస్.పేట గ్రామంలో జరిగింది.

కన్నకొడుకును చంపిన తల్లి
కన్నకొడుకును చంపిన తల్లి

అమ్మా... నేనేం పాపం చేశాను...? నీ కడుపులో పుట్టటమే నేను చేసిన నేరమా..? నెలలు నిండని నన్ను ఇంత దారుణంగా చంపుతావా..? ఆ చిన్నారికి మాటలొస్తే ఇలాగే అడిగే వాడేేమో..! కన్న పేగు మమకారాన్ని మరిచి ఓ తల్లి తన సొంత కుమారుడిని నీటి డ్రమ్ములో పడేసి అత్యంత దారుణంగా హతమార్చింది. నెలలు కూడా నిండని ఆ చిన్నారి ఆయువు తీసేసింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన విశాఖ జిల్లా ఏఎస్.పేటలో జరిగింది(murder in Visakhapatnam). సొంతతల్లే బిడ్డను హత్య చేయడంపై గ్రామస్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తల్లి మానసిక స్థితి సరిగా లేనందునే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వైద్యుల నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఊహించని ఈ ఘటనతో చిన్నారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

నీటి డ్రమ్ములో మృతదేహం...
విశాఖ జిల్లా కసింకోట మండలం ఏఎస్.పేట గ్రామానికి చెందిన అప్పలరాజుకు గొండుపాలెం గ్రామానికి చెందిన సంధ్య అనే యువతితో గతేడాది నవంబర్​లో వివాహమైంది. వీరికి మగ శిశువు జన్మించాడు. దంపతులిద్దరూ అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. శుక్రవారం విధులు నిర్వహించిన అనంతరం ఇంటికి వచ్చారు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి పది గంటల సమయంలో చిన్నారి ఏడుపు వినిపించింది. ఆకలేస్తుందేమోననని భావించిన సంధ్య శిశువుకు పాలు పట్టింది. అందరూ నిద్రపోతున్న సమయంలో శిశువును నీటి డ్రమ్ములో పడేసి హత్య చేసింది. దీనిని గమనించని అప్పలరాజు అర్ధరాత్రి దాటాక శిశువు కోసం వెతికాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. సంధ్యను అడగగా...పొంతన లేని సమాధానం చెప్పడంతో ఇంటి చుట్టుపక్కలా వెతికాడు. ఫలితం లేకపోవడంలో 100 నంబర్​కు ఫోన్ చేశాడు. అప్పలరాజు ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి సమీపంలో గాలింపు చేపట్టగా నీటి డ్రమ్ములో శిశువు మృతదేహాన్ని గుర్తించారు.

విచారణలో విస్తుపోయే విషయాలు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. కన్నతల్లే అత్యంత కర్కశంగా తన కుమారుడిని హతమార్చినట్లు గుర్తించారు. సంధ్యకు మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించిన పోలీసులు...వైద్యులను సంప్రదించారు. చిన్నారికి పాలు పట్టే సమయంలో నొప్పి వస్తున్నట్లు సంధ్య తన కుటుంబసభ్యులకు చెప్పినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే శిశువును హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై నిందితురాలిని విచారించగా శిశువును తానే చంపినట్లు వివరించింది. అందరూ నిద్రపోతున్న సమయంలో చిన్నారిని నీటి డ్రమ్ములో వేసి చంపినట్లు ఒప్పుకుంది. నిందితురాలి వాంగ్మూలంతో హత్య కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు అనకాపల్లి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితురాలి మానసిక స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 27, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.