ETV Bharat / city

New Railway Projects to Telangana: తెలంగాణకు మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు

author img

By

Published : Mar 5, 2022, 9:47 AM IST

New Railway Projects to Telangana
తెలంగాణకు మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు

New Railway Projects to Telangana : తెలంగాణలో రైల్వేలకు ఖర్చు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర సర్కార్ సహకరిస్తే నిధులు పెంచుతామని చెప్పారు. రైలు ఛార్జీలు పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే యోచనలో ఉందని ఈనాడు - ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

New Railway Projects to Telangana : ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే సేవల్ని మెరుగుపరుస్తామని.. డిమాండ్‌ బాగా ఉన్న థర్డ్‌ ఏసీ బోగీల్ని పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడిచారు. తెలంగాణ రాష్ట్రానికి మూడు కొత్త ప్రాజెక్టులు ఇచ్చే యోచన ఉందన్నారు. హైదరాబాద్‌ నుంచి దేశంలో ప్రధాన నగరాలకు రాజధాని, దురంతో రైళ్ల మంజూరు విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రైలు టికెట్ల ఛార్జీలను పెంచే చర్చ, ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాజీపేట, తిరుపతిలో కొత్త డివిజన్ల ఏర్పాటుకు అవకాశాలు ఉండకపోవచ్చని చెప్పారు. ‘కవచ్‌’ పనితీరుని పరిశీలించేందుకు శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

  • వందేభారత్‌ రైళ్లు ఎప్పుడు పట్టాలెక్కుతాయి?

Central Railway Minister Interview : 2023 ఆగస్టుకల్లా 75 రైళ్లు ప్రవేశపెడతాం. ఈ సంవత్సరం ఏప్రిల్‌, మేలలో రెండేసి వస్తాయి. సెప్టెంబరు నుంచి ఎక్కువ సంఖ్యలో పట్టాలెక్కుతాయి. మొత్తం 400 వందేభారత్‌లు వస్తాయి. సున్నా నుంచి 100 కిమీ వేగాన్ని 40 సెకన్ల వ్యవధిలోనే అందుకోవడం వీటి ప్రత్యేకత. సిట్టింగ్‌తో పాటు స్లీపర్‌ కోచ్‌లతోనూ వస్తాయి. ప్రస్తుత గరిష్ఠ వేగం గంటకు 180 కిమీ కాగా, రెండోతరం వందేభారత్‌లో 200 కిమీ వేగం ఉంటుంది. మున్ముందు వీటి కోసం మెట్రో తరహాలో ఎలివేటెడ్‌ కారిడార్లు వస్తాయి. వీటికి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ ఈ తరహా రైళ్లు దేశానికి అవసరం.

  • వందేభారత్‌లో హైదరాబాద్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతోంది?

సంఖ్యాపరంగా ఎన్ని అన్నది చెప్పలేం కానీ హైదరాబాద్‌కు ప్రాధాన్యం కచ్చితంగా ఉంటుంది.

  • తక్కువ రైల్వే నెట్‌వర్క్‌ ఉన్న తెలంగాణకు కొత్తగా ప్రాధాన్యమివ్వట్లేదనే అభిప్రాయాలున్నాయి...

Ashwini Vaishnav Interview : రాష్ట్రంలో రైల్వేనెట్‌వర్క్‌ తక్కువ ఉన్నది నిజమే. ఉమ్మడి రాష్ట్రంలో కోస్తా తీరంలోనే రైల్వే లైన్ల నిర్మాణం ఎక్కువగా జరిగింది. తెలంగాణ పై దృష్టి పెట్టలేదు. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు రైల్వే నెట్‌వర్క్‌ ఏర్పాటు, రైళ్ల సదుపాయం కల్పించేందుకు మేం సానుకూలంగానే ఉన్నాం.

  • యూపీ, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు చాలా తక్కువగా నిధులిచ్చారు కదా...

Telangana Railway Projects : మేం ఖర్చు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నాం. కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ, రాష్ట్ర వాటా నిధులివ్వడంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మేం నిధులు పెంచుతాం. తెలంగాణకు కొత్తగా మూడు ప్రాజెక్టులు మంజూరు చేసే యోచన ఉంది. దక్షిణమధ్య రైల్వే అధికారులతో శుక్రవారం మాట్లాడినప్పుడు ప్రతిపాదనలు చెప్పారు.

  • కాజీపేట, తిరుపతి డివిజన్ల సంగతేంటి?

డివిజన్ల ఏర్పాటు ట్రాక్‌ కిలోమీటర్ల ఆధారంగా ఉంటుంది. సాంకేతికంగా కొత్త డివిజన్ల అవసరం ఉందీ అనుకుంటే ఆ విషయం రైల్వేబోర్డు చూసుకుంటుంది.

  • కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై..

అవసరమైన రైలు బోగీల తయారీకి ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాం. తెలంగాణలోని మేధా కోచ్‌ ఫ్యాక్టరీకి భారీ ఆర్డర్లు ఇస్తున్నాం. కాజీపేటలో వ్యాగన్‌ పీఓహెచ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటుచేస్తున్నాం.

  • దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు ఆలస్యంపై..

ఈ ప్రక్రియ ఈ సంవత్సరం వేగవంతం అవుతుంది. కొత్త జోన్‌ పూర్తిస్థాయిలో ఏర్పడటానికి సమయం పడుతుంది.

  • తెలుగువారు ఉన్న చోటుకు వెళ్తే..

విదేశాలకు ఎక్కడకు వెళ్లినా తెలుగువాళ్లు పెద్దసంఖ్యలో కనిపిస్తారు. ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలో వీరే ఎక్కువ. న్యూయార్క్‌ టైంస్క్వేర్‌లో నేను ‘బాగున్నారా’ అని పలకగా పది మందికిపైగా తెలుగువాళ్లు నావైపు చూశారు. తెలుగువాళ్లున్న చోటుకు వెళ్లినప్పుడు నమస్తే అండి.. బాగున్నారా అని పలకరిస్తూ ఉంటా.

135 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఎన్ని విమానాలు తెచ్చినా సరిపోవు. రైలు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ వేగం పెంచడంపై దృష్టి పెడుతున్నాం. అదేసమయంలో ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తున్నాం.
మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారుల్ని పెద్దఎత్తున నిర్మిస్తోంది. తదుపరి ప్రాధాన్యం రైల్వేలకు లభించబోతోంది. రైల్వేపై మోదీకి ప్రత్యేక విజన్‌ ఉంది.

ఇదీ చదవండి : ఒకే ట్రాక్​పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ప్రమాదం లేదు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.