ETV Bharat / city

అలా చేస్తే ఏపీ విద్యుత్ బకాయిల అంశం.. పరిష్కరించేందుకు సిద్ధం: తెలంగాణ

author img

By

Published : Feb 17, 2022, 7:18 PM IST

Updated : Feb 18, 2022, 5:23 AM IST

అలా చేస్తే ఏపీ విద్యుత్ బకాయిల అంశం పరిష్కరించేందుకు సిద్ధం
అలా చేస్తే ఏపీ విద్యుత్ బకాయిల అంశం పరిష్కరించేందుకు సిద్ధం

19:16 February 17

తెలంగాణ వాదనతో అంగీకరించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం న్యాయస్థానాల్లో కేసులు ఉపసంహరించుకుంటే విద్యుత్‌ బకాయిలతో పాటు రాష్ట్ర ఆర్థికసంస్థ వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ అధ్యక్షతన విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం మొదటి సమావేశం జరిగింది. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన సమావేశంలో హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌ నుంచి తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధితశాఖల అధికారులు హాజరయ్యారు. ఐదు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.

కోర్టు కేసులు ఉపసంహరించుకుంటే ... సమస్య పరిష్కారానికి సిద్ధం

విద్యుత్‌ విషయంలో ఏపీ నుంచి తమకు రూ.12,532 కోట్లు రావాల్సి ఉందని, అయితే వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తామే రూ.3,442 కోట్లు చెల్లించాలని ఏపీ అడుగుతోందని తెలంగాణ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఆకస్మాత్తుగా పీపీఏలు రద్దు చేసి ఏపీ జెన్కో నుంచి విద్యుత్‌ నిలిపివేయడం, తక్కువ ధరతో వచ్చే సీలేరు జల విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ తీసుకోకుండా చేయడం వల్ల తెలంగాణకు చాలా నష్టం జరిగిందని వివరించారు. తెలంగాణకు రావాల్సిన రూ.12,532 కోట్లు ఇవ్వకుండా ఏపీ కోర్టుకు వెళ్లిందని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి అధికారులు చెప్పారు. విద్యుత్‌ బకాయిలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించుకొని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఏపీ కోర్టు కేసు ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ విభజనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా చేసి ప్రతిపాదనలు పంపిందన్న తెలంగాణ అధికారులు.. కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా 235 ఎకరాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ప్రధాన కార్యాలయం కాని నానక్‌రామ్‌గూడలోని కార్యాలయ భవనంలో వాటా అడగడం సమంజసం కాదన్నారు. వీటన్నింటి కారణంగా ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన పెండింగ్‌లో పడిందని, కోర్టు కేసులు ఉపసంహరించుకుంటేనే విభజన ప్రక్రియలో తదుపరి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.

విభజన చట్టం సవరణ అవసరం లేదు...

పన్నుల అంశానికి సంబంధించి ఏడున్నరేళ్ల తర్వాత విభజన చట్టం సవరణ అవసరం లేదని తెలంగాణ మరోమారు తన అభిప్రాయాన్ని తెలిపింది. సవరణలు చేస్తే అంతులేని వివాదాలు వస్తాయని పేర్కొంది. సవరణ సాధ్యం కాకపోతే తమకు జరిగిన నష్టాన్ని కేంద్రం సరిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించింది. సవరణ తగదన్న తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి... పన్నుల అంశం ద్వైపాక్షిక అంశాల జాబితా నుంచి తొలగించేందుకు అగీకరించారు. ఏపీ నుంచి రావాల్సిన నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని తెలంగాణ అధికారులు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రూ.495 కోట్లు ఏడేళ్లుగా ఏపీ నుంచి రావడం లేదని, హైకోర్టు, రాజ్‌భవన్‌ నిర్వహణకు సంబంధించి రూ.315 కోట్లు ఇస్తామని అంగీకరించి ఇంకా ఇవ్వలేదని తెలంగాణ అధికారులు వివరించారు.

ఏపీ అండర్‌ టేకింగ్‌ ఇచ్చిన వెంటనే..

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు సంబంధించిన రూ.464 కోట్లు, ఎస్‌సీసీఎఫ్‌కు చెందిన రూ.208కోట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలు పంపాలని తెలంగాణకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేలా ఏపీ అండర్‌ టేకింగ్‌ ఇస్తే తాము ఇవ్వాల్సిన రూ.354 కోట్ల ప్రిన్సిపల్‌ అమౌంట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పౌర సరఫరాల సంస్థ తెలిపింది. అందుకు ఏపీ అంగీకరించింది. ఏపీ నుంచి అండర్‌ టేకింగ్‌ వచ్చిన వెంటనే ప్రిన్సిపల్‌ అమౌంట్‌ బదిలీ చేసేందుకు తాము సిద్ధమని తెలంగాణ పౌర సరఫరాల సంస్థ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి

కేంద్రం సహకారంతో.. రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మార్చేస్తాం: జగన్

Last Updated :Feb 18, 2022, 5:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.